మిర్చి మరింత మంటెక్కిస్తున్నది. భారీ వర్షాలతో పంట దిగుబడి తగ్గడంతో మార్కెట్లో ధర భారీగా పలుకుతున్నది. గతేడాది కిలో 150 నుంచి 200 ఉంటే, ఈ సారి 250 నుంచి 300 పెరిగింది. తొక్కుల సీజన్ కావడంతో పెరిగిన ధరలతో అదనపు భారం పడుతున్నదని మహిళల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నది.
– వేములవాడ, ఏప్రిల్ 22
మార్కెట్లో అనేక రకాల కంపెనీలు తమ కారంపొడిని విక్రయిస్తున్నా.. ఇప్పటికీ చాలా మంది మిరపకాయలు కొని కారం పట్టిస్తున్నారు. ఏటా ఫిబ్రవరి చివరి వారం నుంచి ఏప్రిల్ చివరి వారం వరకు మిరపకాయలను కొనుగోలు చేస్తుంటారు. ప్రతి ఇంట్లో తొక్కులతో పాటు ఏడాదికి వంటలకు సరిపడా కారం పొడిని సిద్ధం చేసుకుంటారు. ఒక్కో కుటుంబం 10 నుంచి 20కిలోల వరకు కొంటారు. అయితే గత వానకాలం సీజన్లో భారీ వర్షాలతో మిర్చి దిగుబడి తగ్గింది. కిలో మిరపకాయల ధర 250 నుంచి 300 వరకు చేరింది. గతేడాది దొడ్డు మిరపకాయలు కిలోకు 150 నుంచి 200 వరకు విక్రయించారు. ఈ సారి మాత్రం ప్రారంభం నుంచే 250కిపైనే అమ్ముతున్నారు. వేములవాడ ప్రాంతంలోని చందుర్తి మండలం రుద్రంగి, జగిత్యాల జిల్లా కథలాపూర్, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలాలకు చెందిన రైతులు గత నెల రోజులుగా వేములవాడ పట్టణంలో విక్రయాలు చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో పండించిన మిరపకాయలను కొనేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. అయితే ధరల పెంపుతో అదనపు భారం పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెరిగిన ధరలతో భారం
పోయిన ఏడాదికంటే ఈ యేడే మిరపకాయం మస్తు ధర పలుకుతున్నది. కనీసం రూ.3వేలు ఖర్చు పెట్టనిదే యేడాదికి సరిపోయేటట్టు లేదు. కంపెనీలు అమ్ముతున్న కారంపొడి మేం వాడం. మిరపకాయలు కొని పట్టించుకున్న పొడినే వాడుతం. ధర ఎక్కువైనా తప్పడం లేదు.
-మంజులత, గృహిణి (వేములవాడ)
మూడెకరాల్లో సాగు చేశాం
మూడెకరాల్లో మిరపతోట సాగు చేశాం. 10 ఏళ్లుగా పంటను సాగు చేసి స్వయంగా మేమే వేములవాడకు వచ్చి విక్రయిస్తాం. ఈసారి కాయ పట్టిన సమయంలో కురిసిన భారీ వర్షాలకు పంట దిగుబడి తగ్గిపోయింది. అందువల్లే కొంత రేటు ఎక్కువకు అమ్ముతున్నాం.
-లక్ష్మి మహిళా రైతు, సిరికొండ (నిజామాబాద్ జిల్లా)
కారం పొడిని సిద్ధం చేసుకుంటం
ఉగాది పండుగ తర్వాత కారంపొడిని సిద్ధం చేసుకుంటాం. యేడాదికోసారి సరిపడా మిరపకాయలను కొనుగోలు చేసి స్వయంగా కారంపొడిని తయారుచేసుకుంటాం. తొక్కులకు పోనూ నిత్యం వంటలకు కూడా వేరేగా సిద్ధం చేసుకుంటం
-బండ శైలజ, గృహిణి (వేములవాడ)