యూరియా కోసం ఆందోళన చేస్తున్న రైతులకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. వారికి మద్దతుగా పలు మండలాల్లోని గోదాములు, సహకార సంఘాల వద్ద నిరసన తెలపడంతో పాటు రోడ్డుపై ధర్నాలు, రాస్తారోకోలకు దిగింది. అధికారులకు వినతిపత్రాలు అందించి, యూరియా కొరత తీర్చే వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేసింది.
వేములవాడ రూరల్/ కోనరావుపేట/ చందుర్తి/ రుద్రంగి/ ఇల్లంతకుంట/ వీర్నపల్లి, ఆగస్టు 12 : యూరియా కోసం ఇబ్బందులు పడుతున్న రైతులకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు. మంగళవారం సిరిసిల్ల జిల్లాలో అన్నదాత పక్షాన నిరసనలు తెలిపారు. ఎల్లారెడ్డిపేటలో ధర్నాకు దిగిన రైతులకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మద్దతుగా నిలిచారు. అరగంట పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.
ఇల్లంతకుంట బస్టాండ్ ఆవరణలో నిరసన తెలిపారు. ఇక్కడ జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు పాల్గొని రైతులకు మద్దతుగా నిలిచారు. బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు పిలుపు మేరకు నియోజకవర్గంలో పార్టీ నాయకులు ఆందోళనలకు దిగారు. వేములవాడ మండలం చెకపల్లిలోని రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు.
కోనరావుపేట మండలం మల్కపేటలో బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. రుద్రంగిలోని కోరుట్ల-వేములవాడ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం తహసీల్ ఆఫీస్లో వినతి పత్రం అందజేశారు. చందుర్తి మండలకేంద్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి స్థానిక తహసీల్ ఆఫీస్లో వినతి పత్రం సమర్పించారు.
ముస్తాబాద్ మండల కేంద్రంలో వివిధ గ్రామాల రైతులు ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచి పోవడంతో వ్యవసాయ, రెవెన్యూ అధికారులు, పోలీసులు చేరుకొని రైతులను సముదాయించడంతో విరమించారు. వీర్నపల్లి మండలకేంద్రంలో ప్రధాన రోడ్డుపై రైతులు, బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు.