వీణవంక, మార్చి 10 : పొట్టకచ్చిన పంటలు ఎండిపోయేలా ఉన్నాయని, ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా సాగునీరు విడుదల చేసి ఆదుకోవాలని వీణవంక రైతులు వేడుకున్నారు. లేదంటే రైతుల బతుకులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన చెందారు. ఈ మేరకు మంగళవారం వీణవంక మండల కేంద్రంలోని స్థానిక బీరన్న దేవాలయం ఆవరణలో విలేకరులతో తమ గోడు వెల్లబోసుకున్నారు. వీణవంక పెద్ద చెరువు తూముకు మరమ్మతులు చేయకపోవడంతో సాగునీరు వృథాగా పోతున్నదని వాపోయారు. ఈ చెరువు కింద సుమారు 200 ఎకరాలు సాగవుతున్నాయని, ఈ చెరువుపై సుమారు వెయ్యి కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని తెలిపారు.
పంట చేతికి వచ్చే సమయంలో నీళ్లు లేకపోతే ఎండిపోయి ఎడారిలా మారే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, ఇరిగేషన్శాఖ అధికారులు స్పందించి ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా బేతిగల్ చెరువును నింపాలని, దాని నుంచి వచ్చే నీటితో వీణవంక చెరువు నిండుతుందని విన్నవించారు. నీటిని విడుదల చేయకుంటే పంటలు ఎండిపోయి, రైతుల బతుకులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన చెందారు. అనంతరం వీణవంక చెరువు వద్ద ఇరిగేషన్ ఏఈని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు నీట మొండయ్య, డీ రవీందర్, వేణు రవి, సంపత్, ఎం సమ్మయ్య, రాములు, గెల్లు కొమురయ్య, రంజిత్, శ్రీనివాస్, పోచయ్య పాల్గొన్నారు.