Sultanabad | సుల్తానాబాద్ రూరల్, ఏప్రిల్ 21 : రైతులు తప్పక భూసార పరీక్షలు చేయించుకోవాలని సుల్తానాబాద్ ఏవో పైడితల్లి సూచించారు. కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే), రామగిరి ఖిల్లా నుండి శాస్త్రవేత్త డాక్టర్ పిల్లి కిరణ్ కుమార్తో కలిసి ఆమె సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల గ్రామంలో రైతుల వద్దకు వెళ్లి మంగళవారం సమగ్ర ఎరువుల యాజమాన్యం, భూసార పరీక్ష ఆధారిత, ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె డాక్టర్ కిరణ్ కుమార్తో కలిసి మాట్లాడారు. విచక్షణ రహితంగా పంటలపై ఎరువులు వాడడం ద్వారా పంట పెట్టుబడి పెరగడంతో పాటు భూసారం దెబ్బ తింటుందన్నారు.
రైతులందరూ తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకుని వాటి ఫలితాల ఆధారంగా సిఫారసు చేసిన ఎరువులను వాడడం ద్వారా పెట్టుబడి తగ్గించుకోవడంతో పాటుగా సూక్ష్మ పోషక లోపాలను అధిగమించవచ్చునని రైతులకు సూచించారు. భూసార పరీక్షల కోసం మట్టి నమూనాను సేకరించే విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో ప్రశాంత్, సర్పంచ్ రమేష్, ఉప సర్పంచ్ బొంగోని కుమార్ గౌడ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.