రాజన్నసిరిసిల్ల, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : రైతులు పడుతున్న సాగు నీటి కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వర జలాలతో మెట్టను అభిషేకిస్తున్నది. యాసంగి చివరి పంటకు నీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఆదేశాలతో రంగనాయకసాగర్ నుంచి తంగళ్లపల్లి, ఇల్లంతకుంట మండలాలకు, మల్లన్నసాగర్ నుంచి ముస్తాబాద్, గంభీరావుపేట మండలంలోని పంటచేలకు అధికారులు నీటిని విడుదల చేశారు. కాలువల ద్వారా పరుగులు తీస్తూ, చెరువులు, కుంటలను నింపుతూ పంట చేలకు చేరిన గోదావరి జలాలతో రైతుల మోములో చిరునవ్వు కనిపిస్తున్నది. సిరిసిల్ల నియోజకవర్గంలోని 150 చెరువులుండగా, పదివేల ఎకరాలకు సాగునీరందేలా చర్యలు తీసుకుంటున్నారు. గంగను తెచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేవుడంటూ వేనోళ్ల కొనియాడుతున్నారు.
తంగళ్లపల్లి మండలంలో నాలుగు వేల ఎకరాలకు నీరు
సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ నుంచి తంగళ్లపల్లి, ఇల్లంతకుంట మండలాలకు అధికారులు నీటిని విడుదల చేశారు. ఇల్లంతకుంట మండలంలోని దాచారం అముదాల కుంట, బాణప్ప, సిరికొండలోని మంగమ్మ చెరువులు నింపుతూ తంగళ్లపల్లి మండలంలోని నర్సింహులకుంట, బాలుమల్లుపల్లె సోమయ్య చెరువు, జిల్లెల్లలోని పెద్దచెరువు, పటేల్చెరువు, నల్లచెరువు, పెద్దలింగాపూర్లోని కొత్తచెరువులను నింపుతున్నారు. ఈ చెరువుల పరిధిలోని సుమారు నాలుగు వేల ఎకరాలకు సాగునీరందిస్తున్నారు.
మానేరు ఒడికి మల్లన్న సాగర్ జలాలు
సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్ నుంచి గంభీరావుపేట మండలం ఎగువ మానేరుకు కాళేశ్వర జలాలను విడుదల చేశారు. దుబ్బాక సమీపంలోని కూడెల్లివాగు ద్వా రా వస్తున్న నీటితో ముస్తాబాద్ మండలంలోని లిం గంచెరువు, మద్దికుంట, పెద్దచెరువులతో పాటు వివిధ చెరువులను నింపుతున్నారు. కాళేశ్వరజలాలు రావడంతో ఎర్రటి ఎండల్లోనూ చెరువులు మత్తుళ్లు దుంకు తూ అలుగులు పారుతున్నాయి. ముస్తాబాద్మండలం లో మూడువేల ఎకరాలకు గోదావరి జలాలను అందిస్తున్నారు. ఎగువ మానేరు ఆయకట్టు పరిధిలో ఉన్న పంట చేలకు నీటిని విడుదల చేశారు. కుడి, ఎడమ కా లువల్లో పిచ్చిమొక్కలు మొలవగా మంత్రి కేటీఆర్ ప్ర త్యేక చొరవతో నీటి పారుదలశాఖ రూ.50 లక్షల వ్య యంతో శుభ్రం చేయించింది. ముస్తాబాద్, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలంలోని కొన్ని గ్రామాలు కలుపుకుని మొత్తం 6వేల ఎకరాలకు సాగునీరందిస్తున్నారు. మల్లన్న, రంగనాయకసాగర్ నుంచి వస్తున్న నీ టితో యాసంగి పంటలు జీవంపోసుకున్నాయి. దీంతో ఆయా గ్రామాల్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు రైతులు పాలాభిషేకాలు నిర్వహిస్తున్నారు.
మంత్రి జెయ్యవట్టే పంట దక్కింది
వానకాలంల వేసిన పంట మంచిగచ్చిందని మురిసి యాసంగిల వరేసిన. చేతికొచ్చే టైంకు బోర్లలో నీళ్లు అడుగంటి పోయినయ్. పంట చేతికి రాదనుకుని పెట్టుబడి ఎట్లెల్లుతదో అనుకుని రందిపడ్డం. ఇంతలోనే రంగనాయక సాగర్ నీళ్లు అచ్చినయ్. మంత్రి కేటీఆర్ సార్ దయవల్ల పంట దక్కింది. పంటకు నీళ్లు అందినయో లేదో ఒక్కసారే గొలలన్నీ పచ్చపడ్డయ్. చాలా సంతోషమనిపించింది.
– మెతుకు రాజు, రైతు నర్సింహులపల్లె
కండ్లముందే కనిపిస్తుంది
బోర్లపైనే ఆధార పడి ఎవుసం నడుస్తంది. కూరగాయలు సాగు జేద్దామంటే కోతుల బెడద ఎక్కువుంది. అందుకే ఇక్కడ వరి తప్ప మరే పంట ఏత్తలేం. యాసంగి పంటేసినంక నీళ్లకు గోసయింది. పంటలు ఎండి పోతున్నయని కేటీఆర్ సార్కు సార్లందరూ చెప్పిండ్రట. రంగనాయకసాగర్ నుంచి నీళ్లిత్తున్నరు. పంటలకు రందీలేకుండా చేసిండు. సర్కారు కట్టిన ప్రాజెక్టుల ఫలితం కండ్ల ముందే కనిపిస్తంది.
– బ్రాహ్మణపల్లి తిరుపతి రైతు, నర్సింహులపల్లె
నీళ్లను సూత్తే సంబురమనిపిస్తంది
నాకు రెండెకరాలుంది. ఎప్పుడూ వరేత్తున్న. వానకాలంల మంచి పంటచ్చిందని యాసంగిల ఏసిన. అయితే పంటకు నీళ్లందుతయో లేదోనని రందయింది. చెరువుల్ల సుక్కబొట్టులేదు. కడుపు నిండా కరెంటు ఇత్తుండు కానీ,నీళ్లు లేకపాయె అని తండ్లాడుతున్నం. అంతలోనే రంగనాయకసాగర్ నుంచి నీళ్లు ఫుల్లు అచ్చినయ్. సూత్తుండంగనే నర్సింహుల కుంట, సోమయ్యచెరువు నిండింది. గింత ఎండల్ల కూడా చెరువులు నిండింది ఎన్నడూ ఎరకలే. కేటీఆర్ సార్ దయవల్లనే పంటలు చేతికొత్తన్నయ్. సార్కు రుణపడి ఉంటం.
– నర్సయ్య రైతు బాలుమల్లుపల్లె