రైతన్నల కష్టంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం కరీంనగర్లోని రాంనగర్లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ను రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్తో కలిసి ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించి, రాష్ట్రంలో పాదయాత్రల పేరిట ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కేసీఆర్కు ప్రత్యామ్నాయంగా ఏ నాయకుడు కనిపించడం లేదని, మూడోసారి ఆయనే ముఖ్యమంత్రి అని తేల్చిచెప్పారు. తర్వాత మార్క్ఫెడ్ 24వ పాలకవర్గ సభ్యుల సమావేశానికి హాజరై, పాలకవర్గానికి, అధికారులకు పలు సూచనలిచ్చారు.
కరీంనగర్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : గత ఎనిమిదేళ్లలో రైతులు కష్ట పడడంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం కరీంనగర్లోని రాంనగర్లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ను మరో మంత్రి గంగుల కమలాకర్తో కలిసి ప్రారంభించిన అనంతరం, మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈసారి యాసంగి సాగులో ఆల్టైం రికార్డు నమోదు చేసిన రాష్ట్ర రైతాంగాన్ని అభినందించారు. 2014లో రాష్ట్రంలోని అన్ని పంటలు కలిపి 28.18 లక్షల ఎకరాల్లో సాగు చేయగా ఈసారి యాసంగిలో చూస్తే 68.08 లక్షల ఎకరాల్లో అన్ని పంటలు సాగయినట్లు వెల్లడించారు. ఇది మామూలు విషయం కాదన్నారు. ఇటీవల కేంద్రం ఇచ్చిన నివేదికల ప్రకారం చూస్తే తెలంగాణ వ్యవసాయ వృద్ధి రేటు దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు.
ఇది మనందరికీ గర్వకారణమని, వీటన్నింటికీ కర్త, కర్మ, క్రియగా నిలిచింది సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు. వ్యవసాయంతో ముడిపడి ఉన్న అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఏర్పడిందని, పట్టణాలు, వర్తక, వ్యాపారాలు, ఉపాధి విస్తరణ, సహకార సంఘాలు బలోపేతమైన ఇలా రంగం ఏదైనా వ్యవసాయంతోనే ముడిపడి ఉంటుందన్నారు. సహకార సంఘాల్లో ఒకప్పుడు చైర్మన్లకు గౌరవ వేతనం ఇచ్చేందుకు కూడా నిధులు ఉండేవి కాదని, ఇపుడు క్రియాశీలకంగా పనిచేసే ప్రతి సహకార సంఘంలో లక్షలు, కోట్లలో నిధులు ఉంటున్నాయనే విషయాన్ని గుర్తు చేశారు. వ్యవసాయ ఉత్పత్తులు పెరిగిన కారణంగానే మార్కెటింగ్ పెరిగి ఈ వ్యవస్థ కూడా బలపడిందన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత వ్యవసాయం కోసం సాగు నీరు, విద్యుత్, రైతుబంధు, ధాన్యం కొనుగోళ్లు వంటి అంశాలపై రూ.3.50 లక్ష కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి వెల్లడించారు. దేశంలో మనకంటే ఐదింతలు పెద్దగా ఉన్న ఉత్తరప్రదేశ్, నాలుగింతలు ఉన్న మహారాష్ట్ర, మూడున్నరింతలు ఉన్న మధ్యప్రదేశ్లో వ్యవసాయరంగానికి తెలంగాణ కేటాయించిన దాంట్లో పావు వంతుకూడా ఖర్చు చేయలేదని తెలిపారు.
దేశంలో అన్ని రాష్ర్టాల్లో జరుగుతున్నది సాధారణ పరిపాలన అయితే రాష్ట్రంలో జరుగుతున్నది మాత్రం ప్రణాళికాబద్ధంగా నవ తెలంగాణ నిర్మాణమని స్పష్టం చేశారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడే వాళ్లకు తెలంగాణ అభివృద్ధి విషయాలు అర్థం కావని, ప్రభుత్వానికి, ప్రతిపక్షాల మధ్య ఉన్న విభజన రేఖను ప్రజలు గమనిస్తున్నారని, ఏది నిజమో, ఏది అబద్దమో ఆలోచిస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్లాల్, మార్క్ఫెడ్ ఎండీ పీ యాదిరెడ్డి, కరీంనగర్ మేయర్ వై సునీల్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్గౌడ్, డీసీఎమ్మెస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, స్థానిక కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, మార్క్ఫెడ్ డైరెక్టర్లు రామస్వామి, మోహన్, లింగయ్య పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంపై అర్థం లేని నిందలు
రాష్ట్రంపై ఏ మాత్రం అవగాహన, భవిష్యత్ కార్యాచరణ లేని, కేసీఆర్ కంటే అద్భుతంగా ఒక్క పనైనా చెప్పడానికి చేతగాని వాళ్లు ఇప్పుడు రాష్ట్రంలో పాదయాత్రలు, సభలు నిర్వహించుకుంటూ ప్రభుత్వంపై అర్థం లేని నిందలు వేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. కేవలం సీఎంతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలను దూషించేందుకే నిర్వహిస్తూ వాళ్ల సంస్కార హీనతను బయటపెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. విపక్ష నాయకులు లజ్జాహీనంగా ప్రవర్తిస్తున్నారు తప్పితే నిర్మాణాత్మకంగా ఎక్కడా తమ పాత్రను పోషించలేక పోతున్నారని ధ్వజమెత్తారు.
ప్రభుత్వ వాహనాలకు వినియోగించుకోవాలి
కరీంనగర్లో ఎంతో విలువైన స్థలాన్ని మార్క్ఫెడ్కు ఇచ్చి, ఇక్కడ ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటుకు కృషి చేసినందుకు మంత్రి గంగుల కమలాకర్ను, జిల్లా యంత్రాంగాన్ని మంత్రి నిరంజన్రెడ్డి అభినందించారు. ఇది ఇక్కడితో ఆగకుండా విభిన్న వ్యాపారాలు నిర్వహించేందుకు మార్క్ఫెడ్ సంస్థ ప్రయత్నం చేస్తోందని, అందులో ఇది తొలి ప్రయత్నమని స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖల వాహనాలు ఈ ఫిల్లింగ్ స్టేషన్లో పెట్రోల్, డీజిల్ వినియోగించుకోవాలని, అందుకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ను మంత్రి కోరారు.
22 ఏండ్ల నుంచి ఏమీ మారలేదు..
ఫ్లెక్సీపై తన ఫొటో చూసుకున్న మంత్రి నిరంజన్రెడ్డి.. “అబ్బ అది 22 ఏండ్ల కింద ఫొటో ఇక్కడ కనిపించింది. బాగుంది. అప్పటికీ ఇప్పటికీ ఏమైనా మారానా?” అని అక్కడే ఉన్నవారిని మంత్రి అడిగారు. లేదు అలాగే ఉన్నారని బదులివ్వడంతో 22 ఏండ్ల నుంచి అలాగే ఉన్నానా.. థాంక్స్ అంటూ, ప్లెక్సీలో ఆ ఫొటో పెట్టినందుకు కృతజ్ఞతలు చెప్పారు.
“తెలంగాణకు అడ్డుపడిన పార్టీల వాళ్లు ఇప్పుడు కొత్త అవతారం ఎత్తి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. వేటకు వెళ్లినప్పుడు రానోడు యాటను కోసినప్పుడు మెత్తని కుప్పలు ఎత్తుకున్నట్లు, తెలంగాణ రాష్ట్రం బాగుపడిన తర్వాత వచ్చి ఏదో బావుకుందామనే విధంగా ప్రతిపక్షాల ప్రవర్తన ఉంది. వీళ్లకు తెలంగాణ పట్ల సోయిగాని, ఆర్ధ్రత గానీ లేదు. తెలంగాణ సమాజం ఇవన్నీ గమనిస్తున్నది. కేసీఆర్ కంటే గొప్పగా, ముందుచూపుతో పాలన అందించే వాళ్లు ప్రజలకు ఎవరూ కనిపించడం లేదు. మళ్లీ మూడో సారి ముఖ్యమంత్రిగా కేసీఆర్నే ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.”
– మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి