జగిత్యాల, జనవరి 29, నమస్తే తెలంగాణ/ సారంగాపూర్: బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణలో రైతు రాజ్యం నడుస్తున్నదని, కర్షక కేంద్రగా సీఎం కేసీఆర్ పాలన మహాయజ్ఞంగా సాగుతున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, వృద్ధులు, దివ్యాంగులు, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. బీర్పూర్ మండలంలో 136 కోట్లతో ఆధునీకరించిన రోళ్లవాగు ప్రాజెక్ట్ కాలువల ద్వారా ఆదివారం పంట పొలాల్లోకి నీటిని విడుదల చేయగా, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్తో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా బీర్పూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బీర్పూర్ మండల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
47 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, నలభై ఏండ్లుగా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసిన నాయకులు బీర్పూర్తో పాటు, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గ రైతులకు అన్యాయం చేశారన్నారు. తెలంగాణ ప్రాంతం కరెంట్ లేక, నీళ్లు రాక, పొలాలు పండక అల్లాడిపోయిందన్నారు. ప్రత్యేక రాష్ట్ర అవతరణకు ముందు కరువుల తెలంగాణ, వలసల తెలంగాణ, ఆకలిచావుల తెలంగాణగా మారిపోయిన పరిస్థితిని వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మూడు గంటలు పాటు రైతులకు కరెంట్ ఇవ్వలేని దైన్యంలో రాష్ట్రం ఉండేదని గతాన్ని గుర్తు చేశారు.
గోదావరి నది ఒడ్డునే ఉన్నప్పటికీ సాగునీరు, తాగునీరు లేని దుస్థితిని జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాలు అనుభవించాయన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సీఎం కాగానే ఆరు నెలల వ్యవధిలోనే రైతులకు 9 గంటల కరెంట్ ఇచ్చారని, ఏడున్నరేళ్లుగా 24 గంటల విద్యుత్ను అందిస్తున్నారని, చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని స్పష్టం చేశారు. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో యూరియా, విత్తనాలు పొందాలంటే తీవ్రమైన అవస్థలు ఉండేవని, సీఎం కేసీఆర్ విత్తనాలు, యూరియా కొరత లేకుండా చేశాడన్నారు. నకిలీ విత్తనాలు అమ్మినవారిపై పీడీ యాక్ట్ను సైతం అమలు చేశారని గుర్తు చేశారు.
2009లో ధర్మపురి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత దొంతాపూర్లో సమావేశం పెట్టుకున్నామని, ఈ క్రమంలో అధికారులు, ప్రజలు ధర్మపురికి సాగు, తాగు నీటి కోసం ఎత్తిపోతల పథకాలు లేదా బీర్పూర్లోని రోళ్లవాగును ఆధునీకరించాలని చెప్పారని అప్పటి నుంచి రోళ్లవాగు ఆధునీకరణ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. ఒక్క టీఎంసీ సామర్థ్యంతో చెరువుగా ఉన్న రోళ్లవాగు ప్రాజెక్టును ఆధునీకరించేందుకు స్వరాష్ట్రంలో రూ.136 కోట్లతో పనులు పూర్తి చేసుకున్నామన్నారు. గతేడాది భారీ వానలకు వచ్చిన వరదకు ప్రాజెక్టు తెగిపోతే కాంగ్రెస్, బీజేపీలు రాజకీయాలు చేశాయని మండిపడ్డారు.
కానీ వారికెవరికీ సాధ్యం కానీ రోళ్లవాగు ప్రాజెక్టును తమ ప్రభుత్వం పూర్తి చేసిందని స్పష్టం చేశారు. రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణ బీర్పూర్ ప్రజలు సాధించిన విజయంగా అభివర్ణించారు. సీఎం కేసీఆర్ రైతుల మేలు కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారని, ఆయన కృషితో నేడు తెలంగాణ కోటిన్నర ఎకరాల మాగాణంగా మారిపోయిందన్నారు. రూ.10వేల కోట్ల రూపాయలతో రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ను అందిస్తున్నామన్నారు.
తెలంగాణ విపరీతమైన ధాన్యాన్ని పండిస్తున్న విషయాన్ని గుర్తించిన కేంద్రం, రైతులను, ప్రభుత్వాన్ని వంచించేందుకు ధాన్యాన్ని కొనుగోలు చేయమని మెలికపెట్టిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని సూచించారు. ఢిల్లీ వెళ్లి వడ్లు కొనమని బతిమిలాడినా కేంద్రం పెడచెవినపెట్టిందని, రైతుల మేలు కోసం సీఎం కేసీఆర్ ధైర్యం చేసి రూ.22వేల కోట్లు అప్పు తెచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేశారన్నారు. బీజేపీ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల నేడు దేశంలో తిండి గింజలకు కొరత ఏర్పడిందని, ప్రస్తుతం తెలంగాణలో పండించిన వడ్లను కావాలని అడిగిమరీ కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. ఏనాటికైనా సత్యం జయిస్తుంది..
ధర్మం పరిఢవిల్లుతుందనడానికి ఇదే నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ పార్టీ అనేది రైతు పక్షాన, రైతు కేంద్రంగా పనిచేస్తున్న ప్రభుత్వమన్నారు. రాబోయే రోజుల్లో దేశంలోనూ బీఆర్ఎస్ తన సత్తా చాటుతుందని, వచ్చే ఎన్నికల్లో జయం మనదేనని మంత్రి ప్రకటించారు. ఇక్కడ డీసీఎమ్మెఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, కేడీసీసీబీ డైరెక్టర్ ముప్పాల రాంచందర్ రావు, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు కొల్ముల రమణ, ధర్మపురి, బుగ్గారం, సారంగాపూర్ జడ్పీటీసీలు బత్తిని అరుణ, బాదినేని రాజేందర్, మనోహర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ ముక్క శంకర్, పార్టీ మండలాధ్యక్షులు నారపార రమేశ్, గుర్రాల రాజేందర్రెడ్డి, ఆర్బీఎస్ సారంగాపూర్, బీర్పూర్ మండలాధ్యక్షులు కోల శ్రీనివాస్, రాజేశం, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, సర్పంచ్ శిల్ప, ఎంపీటీసీ, ఎడ్ల సృజన, మండల యూత్ అధ్యక్షుడు గాజర్ల రాంచంద్రంగౌడ్ పాల్గొన్నారు.
బీర్పూర్ను అన్ని విధాలా అభివృద్ధి చేసుకున్నాం
నలభై ఏండ్లు ప్రజాజీవితంలో ఉండి, రెండు సార్లు మంత్రి పదవిలో ఉండి కూడా జీవన్రెడ్డి రోళ్లవాగు, బీర్పూర్ అభివృద్ధి ఏం చేయలేకపోయిండు. బీర్పూర్ను మండలంగా చేయాలని ఆలోచించలేదు. కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత బీర్పూర్ను మండలంగా ఏర్పాటు చేసుకున్నాం. అన్ని విధాలా అభివృద్ధి చేసుకుంటున్నాం. ఈ మండలంలో గత 40 ఏండ్లలో పది వాటర్ ట్యాంకులు ఉంటే, రాష్ట్రం వచ్చిన తర్వాత మిషన్ భగీరథ కింద 14 ట్యాంకులు నిర్మించుకున్నాం. రూ.136 కోట్లతో రోళ్ల వాగు ఆధునీరించుకున్నాం. కులవృత్తుల ప్రాధాన్యమిచ్చి, మండలంలో 18 వేల గొర్ల పంపిణీ చేశాం. తుంగూరుకు పల్లె దవాఖాన మంజూరైంది.
మండలంలో నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశాం. ఇవన్నీ ఏడేండ్ల కాలంలో జరిగిన అభివృద్ధి. కాళేశ్వరం, ఎస్సారెస్పీ పునర్జీవ పథకాలతో రాష్ట్రం సస్యశ్యామలమైంది. ఒకప్పుడు జగిత్యాల నియోజకవర్గంలో 20 వేల ఎకరాల్లో వరి వేస్తే, ఇప్పుడు 60వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. సారంగాపూర్, బీర్పూర్ మండలాల్లోనే 20 వేల ఎకరాల్లో సాగవుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలు, రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కేంద్రంలోని మోదీ సర్కారు రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు ఒక్క రూపాయి ఇవ్వకపోగా, ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నది.
– డాక్టర్ సంజయ్కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే
రైతులను ఆగం చేస్తున్నారు
ప్రతిపక్ష నాయకులు రైతులను ఆదుకోవడం కోసం పనిచేయడం లేదు. ఆగం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓట్ల కోసమే రైతుల పేరిట రాజకీయం చేస్తున్నారు. పని చేసే నాయకులను గుర్తించి ప్రజలు అండగా ఉండాలి. ముచ్చట్లు చెప్పే నాయకులకు తగిన బుద్ధి చెప్పాలి.
– దావ వసంత, జగిత్యాల జడ్పీ చైర్పర్సన్
స్వరాష్ట్రంలో నాణ్యమైన విద్య
రాష్ట్ర ఏర్పాటు తర్వాత పేద, మధ్యతరగతి ప్రజల పిల్లలకు నాణ్యమైన విద్య అందుతున్నది. అలాగే నిరుద్యోగుల కోసం 90 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. ఎస్సీ, బీసీ స్టడీ సరిల్ ఏర్పాటు ద్వారా ఉచిత కోచింగ్ ఇస్తున్నది. కోటి రూపాయలతో జగిత్యాలలో లైబ్రరీ నిర్మిస్తున్నాం.
– డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్