Kalvacherla | రామగిరి, మే 11 : రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామ శివారులో ఉన్న చీమల చెరువుకు సంబంధించిన తూములు కొల్లగొట్టి కొందరు వ్యక్తులు అక్రమంగా చెరువు నీటిని వదులుతున్నారని ఆరోపిస్తూ గ్రామ రైతులు తహసీల్దార్కు సోమవారం ఫిర్యాదు చేశారు. చెరువులో నిల్వ ఉన్న నీటిని అనధికారికంగా బయటకు వదలడం వల్ల గ్రామ పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు తీవ్రంగా పడిపోతాయని, వేసవి కాలంలో పశు పక్షాదులకు తీవ్ర నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
చెరువులో ప్రస్తుతం ఉన్న నీరు గ్రామ రైతులకు, పశువులకు ఎంతో ఉపయోగకరమని, ఇటువంటి పరిస్థితుల్లో కొందరు వ్యక్తులు స్వప్రయోజనాల కోసం తూములు ధ్వంసం చేసి నీటిని వృథాగా వదులుతున్నారని వారు ఆరోపించారు. వెంటనే సంబంధిత అధికారులను పరిశీలించి, చెరువు తూములు ధ్వంసం చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. అదేవిధంగా చెరువుకు రక్షణ చర్యలు చేపట్టి, మిగిలిన నీటిని సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ను కోరారు. గ్రామ ప్రజల జీవనాధారమైన చెరువులను కాపాడేందుకు అధికారులు తక్షణమే స్పందించాలని రైతులు విజ్ఞప్తి చేశారు.