తిమ్మాపూర్, డిసెంబర్2: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరండ్లలో సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డుపై ధర్నా చేసి సొసైటీ కార్యాలయాన్ని మూసి వేయించారు రైతులు. సొసైటీ ఎదుట రోడ్డుపై రాస్తారోకో చేశారు. నెల రోజుల నుండి దాన్యం కుప్పలు పోసి ఉన్నాయని, తూకం వేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల 43 కిలోల చొప్పున తూకం వేసి ట్రాక్టర్లను మిల్లర్ల వద్దకు పంపితే తరుగు పేరిట బస్తాకి మరో ఐదు కిలోలు అదనంగా కట్ చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తరుగు పేరిట రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం సొసైటీ పాలకవర్గం చొరవ తీసుకొని వెంటనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలని రైతులు డిమాండ్ చేశారు. 3వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలుకు రైస్ మిల్లు అలాట్మెంట్ అయిందని ధాన్యం తూకం వేస్తామని సొసైటీ ఉద్యోగులు తెలపడంతో రైతులు ఆందోళనను విరమించారు. ఒక్క పోరండ్లలో నే కాకుండా పలు చోట్ల కేంద్రాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉన్నదని, అధికారులు ఇబ్బందులు లేకుండా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.