కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 13 : రెవెన్యూ అధికారుల ఆగడాలు రోజురోజుకూ శృతిమించుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండల స్థాయిలో పెండింగ్ భూ సమస్యలను వెంటవెంటనే పరిష్కరించాలంటూ నిత్యం ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా, వాటిని పక్కన పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో స్థానిక అధికారులు నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుకొంటున్నారని బాధితులు వాపోతున్నారు. విధిలేక కలెక్టర్ వద్ద కొచ్చి తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. అయినా, పరిష్కారమార్గం దొరకక రోడ్డెక్కుతున్నారు. తాజాగా ఇదే తరహా సమస్యపై ఓ రెండు రైతు కుటుంబాలు నిరసన తెలిపాయి. ఇతరులకు విక్రయించిన తమ భూమిని రిజిస్ట్రేషన్ చేయాలంటే సెటిల్మెంట్ చేసుకోవాలని ఒత్తిడి చేస్తూ, బెదిరింపులకు గురిచేస్తున్న రెవెన్యూ అధికారిపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని తమ భూమి పట్టా కాగితాలతో కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించాయి.
చిగురుమామిడికి చెందిన నిరుపేద రైతులు చిట్టెల మైసవ్వ, చిట్టెల రాములు శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట తమ కుటుంబసభ్యులతో కలిసి ఆందోళన కు దిగారు. కలెక్టర్ ఆదేశించినా తమకు న్యాయం జరగడం లేదని, ఇతరులకు విక్రయించిన తమ భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా తమను బెదిరిస్తూ, మానసికంగా వేధిస్తున్నాడని, ‘కలెక్టరమ్మా.. మాకు న్యాయం చేయండి’ అంటూ వే డుకున్నారు. చిగురుమామిడి గ్రామంలోని తమ కుటుంబాలకు చెందిన 853 సర్వేనంబర్లో 2.37 ఎకరాల భూమిని విక్రయించామని, రిజిస్ట్రేషన్ చేసేందుకు ఈ యేడాది మార్చి 28న స్లాట్ బుక్ చేశామని, అయితే ఈ భూమిపై ఫిర్యాదులు వచ్చాయంటూ తహసీల్దార్ రిజిస్ట్రేషన్ నిలిపేశాడని బాధితురాలి కొడుకు చిట్టెల కిష్టయ్య ఆరోపించాడు. దీనిపై తాము ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అన్ని డాక్యుమెంట్లు పరిశీలించి రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశించారని, తమను ఏప్రిల్ 23న స్లాట్ బుక్ చేసుకోవాలని చెప్పారని, ఆ మేరకు రీషెడ్యూల్ చేసుకున్నామని, మరుసటి రోజు కార్యాలయానికి వెళ్తే ‘మాతంగి తిరుపతి మీ భూమిపై ఫిర్యాదు చేశాడు.
రిజిస్ట్రేషన్ చేయం’ అంటూ మళ్లీ పాతకథే చెప్పుకొచ్చాడని వాపోయాడు. కలెక్టర్ వద్దకు వెళ్దామని అంటూ తమను కరీంనగర్ తీసుకొచ్చి తనొక్కడే లోనికి వెళ్లి ‘మేడం ఆపమన్నది’ అని చెప్పాడని వాపోయాడు. సెటిల్మెంట్ చేస్తే తప్ప రిజిస్ట్రేషన్ కాదంటూ ఖరాఖండిగా చెబుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై ప్రజావాణిలో నాలుగుసార్లు కలెక్టర్ను కలిసి విన్నవిస్తే తహసీల్దార్కు చీవాట్లు పెట్టారని, తననే మేడంతో తిట్టిపిస్తారా..? మీ సంగతి చూస్తానంటూ బెదిరిస్తున్నాడని కన్నీటి పర్యంతమయ్యాడు. తన తల్లి రెండు కిడ్నీలు చెడిపోతే వైద్యం కోసం ఉన్నభూమి విక్రయించామని, కొనుగోలు చేసిన రైతు పేర రిజిస్ట్రేషన్ చేసేందుకు తహసీల్దార్ తమను ముప్పుతిప్పలు పెడుతున్నాడంటూ బాధిత కుటుంబ సభ్యులు బావురుమన్నారు. కలెక్టరమ్మా కనికరించి తమకు న్యాయం చేయాలని, సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో వైద్యం అందక తన తల్లికి ఏదైనా జరిగితే అధికారులే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.