కోరుట్ల కేంద్రంగా భారీ నకిలీ పాస్ పోర్టుల కుంభకోణం వెలుగులోకి వస్తున్నది. ఒకటి కాదు.. రెండు కాదు, వందలాది పాస్పోర్టులు ఇక్కడి చిరునామాలపైనే జారీ కావడం సంచలనం రేపుతున్నది. గల్ప్ ఏజెంట్లు సాగించిన ఈ దందాలో బంగ్లాదేశ్, శ్రీలంక వాసులకు సైతం ఇచ్చినట్టు తెలుస్తున్నది. కొన్నాళ్ల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో హైదరాబాద్ సీఐడీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, శుక్రవారం నాలుగు బృందాలుగా ఏర్పడి చేసిన ఆకస్మిక దాడిలో కండ్లు బైర్లు కమ్మేలా నిజాలు బహిర్గతమైనట్టు తెలుస్తున్నది.
అందులో అశోక్రావు, కమ్రుద్దీన్, చాంద్పాషాతోపాటు మరికొంత మంది ఏజెంట్ల ఇండ్లలో సోదాలు చేసినట్టు తెలిసింది. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే దాడులు ప్రారంభించి.. దాదాపు 11 గంటలపాటు నిర్విరామంగా సోదాలు చేయగా, అందులో అనేక చీకటి కుంభకోణాలకు సంబంధించిన పత్రాలు దొరికినట్లుగా తెలుస్తున్నది.
కరీంనగర్, జనవరి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / రాంనగర్ : కోరుట్ల కేంద్రంగా కొంత మంది గల్ఫ్ ఏజెంట్లు నకిలీ పాస్పోర్టులు ఇప్పిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అందులో భాగంగా శ్రీలంకతోపాటు బంగ్లాదేశ్ వాసులకు సైతం కోరుట్లలోని పలు చిరునామాల మీద పాస్పోర్టులు ఇప్పించారు. అందుకోసం బోగస్ ఆధార్ కార్డులు, స్థానిక సర్టిఫికెట్లు, ఇతర ధ్రవీకరణ పత్రాల కోసం అవసరమైన స్టాంపులు, దస్ర్తాలు సృష్టించారు.
రెవెన్యూకు సంబంధించి కోరుట్ల రెవెన్యూ అధికారులతోపాటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాలకు చెందిన బోగస్ రెవెన్యూ స్టాంపులు తయారు చేసి.. ఈ దందాను నడుపుతున్నట్టుగా తెలుస్తున్నది. అందుకోసం సదరు ఏజెంట్లు భారీగా డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. అలాగే వేరే వారి ఆధార్ నెంబర్ తీసుకొని, సదరు కార్డుపై ఫొటోలు మార్చి.. ఏమాత్రం అనుమానం రాకుండా సదరు కార్డు చిరునామాపై బోగస్ కార్డులు సృష్టించి చిరునామాలు వాడుకున్నారని తెలుస్తున్నది. మొత్తంగా రికార్డుల పరంగా ఎక్కడ డౌట్ రాకుండా సదరు ఏజెంట్లు జాగ్రత పడినట్లుగా సమాచారం. దీంతో.. వారి దందా మూడు పువ్వులు ఆరుకాయల మాదిరిగా జరిగింది. రెండు మూడేళ్లుగా ఈ దందాను నిరాకంటంగా నడుపుతున్నారని సీఐడీ పోలీసులు స్వాధీనం చేసుకున్న బోగస్ పత్రాల ద్వారా తెలుస్తోంది.
నిజానికి ఒక పాస్పోర్టు జారీ కావాలంటే.. చట్టపరంగా చాలా ఎంక్వైరీలుంటాయి. ముందుగా స్పెషల్ బ్రాంచ్కు ఆన్లైన్లో సమాచారం వస్తుంది. వారు దరఖాస్తుదారుడు ఉండే పోలీస్స్టేషన్కు సమాచారం ఇస్తారు. ఈ తరుణంలో ఇటు ఎస్బీ, అలాగే స్థానిక పోలీసులు పూర్తిగా విచారణ చేస్తారు. ఆన్లైన్లో ఇచ్చే నివేదిక మేరకే పాస్పోర్టులు జారీ చేస్తారు. ఎక్కడ అనుమానం వచ్చినా రిమార్క్ రాయొచ్చు. పోలీసులు ఏమాత్రం అభ్యంతరం తెలిపినా పాస్పోర్టులు ఆగిపోతాయి.
కానీ, వందలాది పాస్పోర్టులు కోరుట్ల నుంచి జారీ అయ్యాయి. అవి కూడా పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. ఒకటీ రెండు పత్రాలు కాదు.. సమస్తం బోగస్ పత్రాలు పెట్టి పాస్పోర్టులు జారీ అయ్యేలా చూశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఏజెంట్లు చూపిన ఆశకు పోలీసులు సైతం చిక్కారనే అనమానాలు కలుగుతున్నాయి. ఒక్కో పాస్పోర్టుకు ఒక్కో రేటు చొప్పున వసూలు చేసి, అవి బోగస్ అని తెలిసినా.. ఒకే చెప్పారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సీఐడీ అధికారులు శుక్రవారం కోరుట్లలోని పలువురు ఏజెంట్ల ఇండ్లపై దాడులు చేసి, మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. అందులో ముగ్గురు ఏజెంట్లు కాగా.. మరో నలుగురు ఈ రాకెట్తో సంబంధం ఉన్నవారని తెలుస్తున్నది. సదరు వ్యక్తులను ముందుగా కరీంనగర్ తరలించిన సీఐడీ అధికారులు, రాత్రి తిరిగి హైదరాబాద్కు తీసుకెళ్లారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్ట్యాప్లు, స్టాంపులు, బోగస్ పత్రాలన్నింటినీ సైతం సీజ్ చేసి తీసుకెళ్లినట్టు తెలిసింది. దాడుల సమయంలో దొరికిన సమాచారం, పలు స్టాంపులు, ల్యాప్ట్యాప్లో ఉన్న అంశాలను చూసి సీఐడీ అధికారులే నివ్వరపోయినట్టుగా సమాచారం.
అంతేకాదు, బంగ్లాదేశ్, శ్రీలంక వాసులు ఇక్కడి నుంచి పాస్పోర్టులు తీసుకునేందుకు ఉపయోగించిన పలు స్టాంపులు, ఇతర సామగ్రిని చూసి.. వాటి గురించి పూర్తి వివరాలు ఆరా తీసినట్టు తెలిసింది. ఇదే సమయంలో బోగస్ పాస్పోర్టుల జారీకి సహకరించిన పోలీస్ అధికారులపైనా ఆరా తీస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ ఏజెంట్ల వ్యవహరాం అంతా కోరుట్ల కేంద్రంగానే నడిచిందా..? లేక ఇతర జిల్లాల నుంచి కూడా నడిచిందా..? అన్న కోణంలోనూ సమాచారం సేకరిస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో సీఐడీ మరింత లోతుగా వెళ్తే.. బాగోతం పూర్తిగా బట్టబయలవుతుంది.