అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకుసాగుతున్న రాష్ట్ర సర్కారు, భద్రత, రక్షణకూ అధిక ప్రాధాన్యమిస్తున్నది. ఎక్కడైతే ప్రజలు సంతోషంగా, భద్రంగా ఉంటారో.. ఆ ప్రాంతం ప్రశాంతంగా, ప్రగతిలో ఆదర్శంగా ఉంటుందనే సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం పోలీసుశాఖను బలోపేతం చేసింది. శాంతిభద్రతల పరిరక్షణకు సర్వాధికారాలు కట్టబెట్టింది. పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారనే అపవాదును తొలగించేందుకు ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’కు శ్రీకారం చుట్టడమే కాదు పోలీస్ శాఖలో ఎన్నో సంస్కరణలు చేపట్టి, సేవలను చేరువచేసింది. కమిషనరేట్ల ఏర్పాటు, ఠాణాలకు ఆధునిక వాహనాలు, మహిళల భద్రతకు షీటీంలు, మహిళా ఠాణాలను ఏర్పాటుచేసి భరోసా కల్పించింది. ముఖ్యంగా నేరాల అదుపునకు గతంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చి, కేసులను త్వరగా ఛేదిస్తున్నది. విప్లవాత్మక మార్పులతో ప్రజలకు ‘నేనున్నాననే’ భరోసా కల్పిస్తున్నది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు సురక్షా దినోత్సవం జరుపుకోనున్న సందర్భంగా, ‘నమస్తే’ ప్రత్యేక కథనం..
– కరీంనగర్, జూన్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కరీంనగర్ (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, జూన్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కరీంనగర్ (నమస్తే తెలంగాణ) :‘శాంతి భద్రతలు ఎక్కడైతే పటిష్టంగా ఉంటాయో.. ఆ ప్రాంతం బాగుపడుతుంది’ అని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్, పోలీస్ శాఖలో ఎన్నో సంస్కరణలు చేశారు. అందులో భాగంగా విప్లవాత్మక మార్పులు తేవడంతోపాటు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారనే అపవాదును తొలగించేందుకు ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’కు శ్రీకారం చుట్టారు. 24 గంటలూ విధులు నిర్వర్తించే పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర అధ్యయనం చేసి, వాటి పరిష్కారానికి కృషి చేశారు. ప్రతి ఠాణాకు కావాల్సినంత సిబ్బందిని నియమించారు. ఆధునిక వాహనాలను సమకూర్చడమేకాకుండా, మహిళల భద్రతకు షీటీంలను రంగంలోకి దించారు. అన్ని జిల్లాల్లోనూ మహిళా ఠాణాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి భరోసా కల్పించగా, సీఎం ఆలోచనలకు గుణంగా ప్రభుత్వం పోలీసుశాఖను మరింత బలోపేతం చేసింది. కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత కరీంనగర్, రామగుండం పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేసింది.
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చడమేకాదు తద్వారా ఎన్నో కేసులను ఛేదించేలా పోలీసులకు నైపుణ్యాన్ని కల్పించింది. గత చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా పీడీ చట్టం కింద కేసుల నమోదుతో నేరాలను కట్టడి చేస్తున్నది. ప్రజల రక్షణకు పెద్దపీట వేయడంతో యావత్ ఉమ్మడి జిల్లా పోలీసు వ్యవస్థ ముఖచిత్రం పూర్తిగా మారింది. నేరాలు తగ్గడమేకాదు, అంతర్రాష్ట్ర దొంగలను సైతం వెంటాడి వేటాడి పట్టుకొచ్చిన ఘనత మన పూర్వ జిల్లా పోలీసులకు ఉంది. షీ-బృందాలతో మహిళలకు పరిపూర్ణ రక్షణ కల్పిస్తున్నది. ఒకటి రెండుకాదు, శాంతి భద్రతలే లక్ష్యంగా ఉమ్మడి జిల్లా పోలీసు రంగంలోవచ్చిన ఎన్నో విప్లవాత్మక మార్పులు, నేరాల అదుపునకు పోలీసులు తీసుకుంటున్న చర్యలు, ఆధునిక పరిజ్ఞానంతో ఛేదిస్తున్న కేసులు, ఆకతాయిలకు అడ్డుకట్టవేస్తున్న షీ బృందాలపై సురక్ష దినోత్సవం సందర్భంగా ‘నమస్తే’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
మారిన ముఖచిత్రం
స్వరాష్ట్రంలో ఉమ్మడి జిల్లా పోలీసు ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. పోలీస్శాఖలో అంతకు ముందు ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్), సివిల్, ఆక్టోపస్, ఇంటలిజెన్స్ అని వేర్వేరు విభాగాలు ఉండేవి. ఇపుడు అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందికి తెచ్చారు. ఇపుడు అన్ని విభాగాల్లోని ఫోర్స్ను ఏ రకమైన విధులకైనా వినియోగించుకునే అవకాశం ఏర్పడింది.
నేడు సురక్షా దినోత్సవం
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సురక్షా దినోత్సవం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, స్నేహపూర్వక విధానాన్ని, విజయాలను, మహిళల భద్రతకు తీసుకొంటున్న చర్యలను వివరించేలా కార్యక్రమాలు నిర్వహిస్తారు. జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు తీసి సభలు ఏర్పాటు చేయనున్నారు.
ఫోన్ ద్వారా పరిచయమై..
కొన్ని రోజుల క్రితం ఒక అమ్మాయికి ఓ యువకుడి నుంచి ఇన్స్ట్రాగ్రామ్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అమ్మాయి ఇంటిపేరు అతని ఇంటి పేరు ఒకటే అయినందున యాక్సెప్ట్ చేసింది. ఆ అమ్మాయితో మా పూర్వీకులు మీ పూర్వీకులు బంధువులని, మనం కూడా బంధువులమే అవుతామని పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుందామని ఫోన్స్, వీడియో కాల్స్ చేశాడు. వాటిని రికార్డు చేసుకొని అమ్మాయిని డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేశాడు. సదరు యువతి కరీంనగర్ షీ టీంని సంప్రదించగా, వారి విచారణలో ఆ యువకుడు పెళ్లయి విడాకులు తీసుకున్నట్లు గుర్తించారు. ఇంకా వ్యసనాలకు బానిసై యువతులకు ఎరవేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తుంటాడని తేలియగా, అతనిపై కేసు నమోదు చేసి సదరు యువతికి విముక్తి కలిగించారు.
ఫిలిం మేకర్పై పోక్సో యాక్ట్
ఒక బాలిక బతుకమ్మ పండుగ సమయంలో తన అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లింది. షార్ట్ ఫిలిం తీయడానికి ఒక గ్రూప్ అదే గ్రామానికి వచ్చింది. ఆ షార్ట్ ఫిలిం చూసేందుకు వెళ్లిన బాలికకు వారి యూట్యూబ్ ఛానల్కు లైక్ కొట్టాలని, సబ్స్రైబ్ చేసుకోవాలని నమ్మించి ఆ గ్రూప్లోని ఒక వ్యక్తి ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు. రోజూ మెస్సేజ్లు, ఫోన్లు చేస్తూ పరిచయం పెంచుకున్నాడు. మైనర్ తన వాట్సాప్ డీపీగా పెట్టుకున్న ఫొటోలు, స్టేటస్లో పెట్టుకున్న ఫొటోలను స్రీన్ షాట్ తీసుకొని తన కుటుంబ సభ్యులకు పంపిస్తానని సెక్సువల్ హరాస్ చేయగా, సదరు బాలిక షీ టీమ్ని సంప్రదించింది. రంగంలోకి దిగిన బృందం, ఫిలిం మేకర్ను పట్టుకుని సంబంధిత ఠాణాలో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయించింది.
వివాహం కోసం వివరాలు పెడితే..
వివాహం కుదుర్చుకోవాలని ఓ యువతి మ్యాట్రిమోనిలో తన వివరాలు పెడితే ఒక వ్యక్తి ఫోన్ చేసి వివాహం కోసం సంప్రదింపులు జరిపాడు. కులాలు వేరైనందున ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు వద్దని వారించారు. కానీ, ఆ యువకుడు మానుకోలేదు. స్నేహితుడిగా ఉంటానని మెసేజ్ చేస్తూ, ఫోన్ చేస్తూ, వేధించారు. తను పనిచేస్తున్న చోటుకి వెళ్లి ఇబ్బంది పెట్టాడు. ఆమె ప్రయాణిస్తున్న బస్సులోకి వెళ్లి గొడవ చేయడం లాంటి చర్యలకు పూనుకున్నాడు. దీంతో మానసికంగా కుంగిపోయి, విసిగివేసారిన ఆ యువతి, కరీంనగర్ షీ టీంని సంప్రదించింది. సదరు యువకుడిని పట్టుకుని సంబంధిత పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించింది.
ప్రైవేట్ కాంపౌండర్ ఆటకట్టు
ఓ వివాహిత తన తల్లి ఆరోగ్యం బాగా లేనందున కరీంనగర్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించింది. తల్లికి తోడుగా దవాఖానలో ఉన్నది. ఆ దవాఖాన కాంపౌండర్గా పని చేస్తున్న ఓ వ్యక్తి, ఆ మహిళకు మాయమాటలు చెప్పి రిపోర్ట్స్ అని, మందులని ఫోన్ నంబర్ తీసుకొన్నాడు. ఆ తర్వాత మెస్సేజ్లు చేస్తూ ఫోన్లు చేస్తూ ఇబ్బందులు పెట్టాడు. అంతటితో ఆగకుండా ఆ మహిళకు, తనకు అక్రమ సంబంధం ఉందని, ఈ విషయాన్ని నీ భర్తకు చెబుతానని బ్లాక్ మెయిల్ చేశాడు. ఫొటోలు పెట్టాలని, వీడియో కాల్స్ చేయాలని బ్లాక్ మెయిల్ చేసేవాడు. అతని వేధింపులు భరించక సదరు యువతి షీ టీంకు ఫిర్యాదు చేయగా, కాంపౌండర్ను తీసుకొచ్చి కౌన్సెలింగ్ ఇచ్చి మరీ కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి సదరు కాంపౌండర్ సదరు వివాహిత జోలికి వెళ్లడం మానేశాడు.