గోదావరిఖని, డిసెంబర్ 29: బీఆర్ఎస్ సర్కారుపై కాంగ్రెస్ దుర్మార్గపు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి కొ ప్పుల ఈశ్వర్ నిప్పులు చెరిగారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలయ్యేదాకా వదలబోమని తేల్చిచెప్పారు. ఓటమికి కుంగిపోబోమని, పదవులు ఉన్నా లేకున్నా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రకటించారు. గోదావరిఖనిలో తాజా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ ఎంపీ వినోద్కుమార్తో కలిసి పాల్గొన్నారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ సర్కారు పాలనలో దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో అభివృద్ధి జరిగిందని, ప్రజాహిత సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలయ్యాయని చె ప్పారు. కేసీఆర్ హయాంలోనే సింగరేణి కా ర్మికులకు న్యాయం జరిగిందని, కోలిండియా లో లేనివిధంగా అనేక హక్కులు కల్పించామన్నారు. సమైక్య పాలనలో అరిగోసపడ్డ రైతాంగానికి సాగునీరు, కరెంట్ అందించామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ సర్కారుపై దుర్మార్గమైన ప్రచారంతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిందని విమర్శించారు.
ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, తాము పదవుల కోసం పని చేసేవాళ్లం కాదని, ప్రజల కోసం పనిచేసేవాళ్లమని చెప్పా రు. కార్యకర్తలు అధైర్యపడవద్దని, మీ అందరికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఆముల నా రాయణ, కార్పొరేటర్లు పెంట రాజేశ్, సాగంటి శంకర్, కొమ్ము వేణు, దొంత శ్రీనివాస్, భాస్కర్, కృష్ణవేణి, ధాతు శ్రీనివాస్, ముదాం శ్రీనివాస్, బాదె అంజలి, జనగామ కవిత, తస్నీం భాను, నాయకులు కౌశిక హరి, గోపు ఐలయ్య, రామ్మూర్తి, నీరటి శ్రీనివాస్, కౌటం బాబు, పీచర శ్రీనివాస్, శంకర్ గౌడ్, గాదం నందు, మా రుతి, కోల సంతోష్, పిల్లి రమేశ్, దేవరాజు, తిరుపతి పాల్గొన్నారు.
దేశం గర్వించేలా కేసీఆర్ సర్కారు చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలతో ప్రజల్లోకి తీసుకెళ్లి గద్దెనెక్కింది. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా పోరాటం చేయాల్సిన బాధ్యత బీఆర్ఎస్ శ్రేణులపై ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సాధన, ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం కేసీఆర్ చేసిన కృషి మరువలేనిది. రాష్ట్రం వచ్చిన సందర్భంలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ఆఖరి సీఎం కిరణ్కుమార్రెడ్డి తెలంగాణలో చీకట్లు అలుముకుంటాయని శాపనార్థాలు పెట్టారు. కానీ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనాదక్షతతో 7708 మెగావాట్లు ఉన్న కరెంట్ ఉత్పత్తిని 26000 మెగావాట్లకు పెంచారు. ఇప్పుడు మరో ఇరవై ఏండ్లపాటు కరెంట్ ఇవ్వచ్చు. కానీ, కాంగ్రెస్ నాయకులు అప్పుల రాష్ర్టాన్ని అప్పజెప్పారని బద్నాం చేస్తున్నారు. వారి విష ప్రచారాన్ని తిప్పి కొట్టాలి. రానున్న రోజుల్లో అన్ని ఎన్నికల్లోనూ పార్టీ గెలుపొందేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలి. ఎవరూ అధైర్యపడద్దు.
– బోయినపల్లి వినోద్కుమార్, మాజీ ఎంపీ
పార్టీ శ్రేణులను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. రాష్ట్ర సాధన కోసం నాడు అలుపెరుగని పోరాటం చేసిన చరిత్ర మన పార్టీకి ఉన్నది. పెద్దపల్లి ఎంపీగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను గెలిపించుకుందాం. కార్యకర్తల కోసం ప్రతిరోజు గోదావరిఖని పార్టీ కార్యాలయంలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉంటా. కార్యకర్తలు ఏ కష్టం వచ్చినా నా దృష్టికి తేవాలి.
– కోరుకంటి చందర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు