RSS | జగిత్యాల, మే 04 : సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని పెంపొందించుకోవాలని ఆర్ఎస్ఎస్ కరీనగర్ విభాగ్ సంఘ చాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్ అన్నారు. వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో గత పది రోజులుగా నిర్వహిస్తున్న సంస్కార సాధన శిబిరం ముగింపు కార్యక్రమం జగిత్యాల వాల్మీకి ఆవాసం ఆవరణలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక సేవా సంస్థ అయిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సేవా విభాగం, సేవా భారతి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సుమారు లక్ష 50 వేల సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఇందులో భాగంగా జగిత్యాలలో ఏర్పాటు చేసిన వాల్మీకి ఆవాసం ద్వారా ఎంతోమంది గ్రామీణ, నిరుపేద విద్యార్థులను విద్యావంతులుగా, ఉత్తమ దేశభక్తి పౌరులుగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. వాల్మీకి ఆవాసం ద్వారా సమాజంలో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తరించాలనే ఉద్దేశంతో గత సంవత్సరం ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇప్పటివరకు 160 మంది నిరుపేద మహిళలకు కుట్టు శిక్షణ అందించగా వారు స్వయం ఉపాధి పొందుతున్నారని తెలిపారు.
జగిత్యాల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వెనుకబడిన బస్తీల్లోని పిల్లలకు చదువుతోపాటు సంస్కారం అందించాలనే ఉద్దేశంతో అభ్యాసిక పేరుతో ఫ్రీ ట్యూషన్ సెంటర్లను గత ఐదు నెలల క్రితం ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ ట్యూషన్ సెంటర్లో చదువుతున్న పిల్లల కోసం వేసవి సెలవుల్లో పది రోజులపాటు ప్రత్యేక శిక్షణను అందించేందుకు ఉచితంగా సంస్కార సాధన శిబిరాన్ని వాల్మీకి ఆవాసంలో ఏర్పాటు చేశామని తెలిపారు.
ఈ శిబిరంలో ఆరు కేంద్రాల నుండి 80 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారని, వీరికి యోగ, కరాటే, ఆటలు, దేశభక్తి గీతాలు, శాస్త్రీయ నృత్యం, కోలాటం తదితర అంశాలలో శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. సమాజంలో ఎంతోమంది సామాజికంగా, ఆర్థికంగా విద్యాపరంగా వెనుకబడిన వారు ఉన్నారని, వాటిని ఆదుకోవాల్సిన బాధ్యత తోటి సమాజంపై ఉందన్నారు. సమాజంలో అసమానతలను తొలగించి తోటి బంధువులను ఆదుకునేందుకు సేవా భారతి చేపట్టే కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా విద్యార్తినీ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక, శారీరక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.ఈ కార్యక్రమంలో వాల్మీకి ఆవాస అధ్యక్షులు జిడిగే పురుషోత్తం, ఉత్తూరి గంగాధర్, కంకనాల నీరజ, మదన్ మోహన్ రావు, తుంగూరి సురేష్, సంపూర్ణ చారి, సత్యం, గుండ సురేష్, బెత్తేపు లక్ష్మణ్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.