కొత్తపల్లి, డిసెంబర్ 22 : విద్యార్థి దశలో విద్యతోపాటు క్రీడారంగాల్లో వచ్చే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కరీంనగర్లోని డాక్టర్ బీఆర్ అంబేదర్ ప్రభుత్వ మోడల్ రెసిడెన్షియల్ (ఎస్సీ) పాలిటెక్నికల్ కళాశాలలోని తెలంగాణ క్రీడాప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్, గేమ్స్ మీట్ 2023-24కు ఆమె ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతిప్రజ్వలన చేశారు. అనంతరం క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి, 11 ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థి దశలో ఉన్నప్పుడు విద్యతోపాటు క్రీడారంగాల్లో వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తనకు క్రీడల్లో ఎలాంటి అనుభవం లేకపోయినా పాఠశాల స్థాయిలో నిర్వహించే మార్చ్ ఫాస్ట్లో చురుకుగా పాల్గొన్నట్లు గుర్తు చేశారు. క్రీడలు శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తాయన్నారు. ఇక్కడ పలు పాలిటెక్నిక్ కళాశాలల ప్రధానోపాద్యాయులు జీ అప్పారావు, బీ రాజు పాల్గొన్నారు.