మెజార్టీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు రెండు, మూడు సార్లు విజయం సాధిస్తే.. చొప్పదండిలో మాత్రం అందుకు భిన్నమైన సంప్రదాయం కొనసాగుతున్నది. 24 ఏండ్లుగా ఒకసారి గెలిచిన ఎమ్మెల్యేకు మరోసారి అవకాశం ఇవ్వకుండా ప్రజానీకం తీర్పునిస్తున్నది. ప్రతి అసెంబ్లీ ఎన్నికలోనూ ఇక్కడి ఓటర్లు విలక్షణ తీర్పునిస్తున్నారు. ఐదేండ్లకోసారి మార్పును కోరుకుంటూ కొత్త వారికి అవకాశమిస్తున్నారు.
– గంగాధర, డిసెంబర్ 6
గంగాధర, డిసెంబర్ 6 : చొప్పదండి నియోజకవర్గ ప్రజలు ప్రతి ఎన్నికలోనూ సిట్టింగులకు కాకుండా కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు . 1999 నుంచి 2023 దాకా పరిశీలిస్తే.. ఇక్కడ ఒకసారి గెలిచినవారు తర్వాత ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నారు. 1952లో చొప్పదండి నియోజకవర్గం ఏర్పడింది. అది అప్పుడు జనరల్గా ఉండేది. 1985 నుంచి వరుసగా మూడు సార్లు న్యాలకొండ రాంకిషన్రావు గెలిచినా.. ఆ తర్వాత నుంచి మాత్రం ఆనవాయితీకి బ్రేక్ పడింది.
24 ఏండ్లలో ఒకసారి గెలిచిన వారు మళ్లీ వరుసగా రెండోసారి మాత్రం గెలువలేదు. 1999లో ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న న్యాలకొండ రాంకిషన్రావుపై కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కోడూరి సత్యనారాయణగౌడ్ గెలుపొందారు. తర్వాత 2004లో సిట్టింగ్ ఎమ్మెల్యే సత్యనారాయణగౌడ్పై టీడీపీ అభ్యర్థి సాన మారుతి విజయం సాధించారు. 2009లో చొప్పదండి నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డుగా మారగా, అప్పుడు టీడీపీ తరపున సుద్దాల దేవయ్య గెలుపొందారు. 2014లో రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సుద్దాల దేవయ్యపై బీఆర్ఎస్ అభ్యర్థి బొడిగ శోభ గెలిచారు.
ఇక 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున సుంకె రవిశంకర్ విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్పై కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం గెలుపొందారు. ఈ లెక్కన చూస్తే గత 24 ఏండ్లుగా ఇకడి ఓటర్లు వినూత్నంగా తీర్పునిస్తున్నారు. ప్రతి ఎన్నికలోనూ కొత్త వారికి అవకాశం ఇస్తూ సరికొత్త సంప్రదాయం కొనసాగిస్తున్నారు.