జమ్మికుంట, ఏప్రిల్ 16 : చెల్పూర్ సర్పంచ్ నాలుగేళ్లుగా తమకు నరకం చూపెడుతున్నాడని, కాళ్లు మొక్కినా కనికరించలేదని బాధిత మైనార్టీ మహిళ, ఆమె కుటుంబ సభ్యులు వాపోయారు. జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్న ఆమెతో పాటు కుటుంబ సభ్యులు చెల్పూరు సర్పంచ్పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. పదిహేనేండ్ల కిందనే బాధిత మహిళ బతుకుదెరువు కోసం చెల్పూరుకు వచ్చింది. ఆమెకు ఇద్దరు కొడుకులు. వారు తలో పని చేసుకుని బతుకుతున్నారు. అయితే, అప్పటి నుంచే సదరు మహిళపై కన్నేసిన మహేందర్గౌడ్కు ఆమె ఎంతకూ లొంగ లేదు. ఆయనా, సర్పంచ్ అయిన తర్వాత మరింత రెచ్చిపోయాడు. చికెన్, మటన్ షాపును అడ్డుపెట్టుకుని ఆమెను వేధింపులకు గురి చేసేవాడు. నాలుగేళ్లుగా ఇదే రకంగా నరకం చూపుతున్నాడని బాధిత మహిళతోపాటు ఆమె కుటుంబ సభ్యులు వాపోయారు.
దుకాణం తీసేయాలని ఒత్తిడి చేసేవాడని, అతనికి తోడుగా వార్డు సభ్యుడు అజ్జు కూడా వేధించే వాడని ఆరోపించారు. దుకాణం డబ్బాను అడ్డు పెట్టుకుని తనను లైంగికంగా వేధించడం తనకు ఎంతో అవమానం అనిపించిందని మహిళ వాపోయింది. ఈ నేపథ్యంలో ఈ నెల 11న తన ఇంటికి వచ్చి అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించాడని, తాను అవకాశం ఇవ్వకపోవడంతో తెల్లవారి తన దుకాణం తీసి వేయించే ప్రయత్నం చేశాడని, ఈ సందర్భంగా సర్పంచ్ వద్దకు వెళ్లి బతిమాలినా, కాళ్ల మీద పడినా పట్టించుకోలేదని, అందుకే తాను పురుగుల మందు తాగానని, పురుగుల మందు డబ్బా కూడా సర్పంచ్ తమ్ముడి దుకాణంలోనే కొనుక్కున్నానని బాధిత మహిళ అతి కష్టంమీద తన బాధను వెల్లడించింది. ఈ నేపథ్యంలో జరిగిన ఘటనపై ఎమ్మెల్యే ఈటల వెనకాముందు చూసుకోకుండా తామే తప్పు చేసినట్లు సర్పంచ్ను వెనకేసుకొస్తున్నాడని మరో పక్క బాధిత మహిళ కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. ఈ వివాదంలో బాధితులకు అండగా నిలవాల్సింది పోయి తప్పు చేసిన వారికి వత్తాసు పలుకుతున్నారని వాపోయారు.