Godavarikhani | కోల్ సిటీ, మార్చి 7 : చెత్త బయట పడవేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని రామగుండం నగర పాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ఈమేరకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి 49వ డివిజన్ గోదావరిఖని మార్కండేయ కాలనీలో శనివారం నాలా పూడికతీత పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కేవలం రూ.40లు రాగ్ పిక్కర్ కు చెల్లిస్తే నెల రోజులు ఇంటి వద్ద నుంచి చెత్త సేకరిస్తారని తెలిపారు. నగర పాలక సంస్థ రూ.కోట్లు వ్యయం చేస్తూ వాహనాలు కొనుగోలు చేసి పారిశుధ్య సిబ్బందిని నియమిస్తే ఇంటి ముందుకు వచ్చే సిబ్బందికి ఇవ్వకుండా రోడ్లు, కాలువలు, ఖాళీ స్థలాల్లో పడవేయడం తగదన్నారు.
ప్రజారోగ్య దృష్ట్యా ఇక మీదట చెత్త బయటపడవేసినా, కాల్చినా రూ.500లు జరిమానా విధించే యోచన చేస్తున్నామన్నారు. ఏళ్ల తరబడి కాలువల్లో పూడిక తీయకపోవడంతో మురుగునీరు నిలిచి పందులు, దోమల బెడద తీవ్రతరమైందన్నారు. కలెక్టర్ సూచనల మేరకు పారిశుధ్య వాహనాలు అద్దెకు తీసుకొని అదనపు సిబ్బంది ఉపయోగించుకొని పూర్తి స్థాయిలో కాలువల పూడికతీత పనులు చేపడుతామన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆలోచనలకు అనుగుణంగా నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా తీర్చిదిద్దుతామన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్ సంతోష్ రావు, నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, ఎస్ఈ గురువీర, ఈఈ పీవీ రామన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే 47వ డివిజన్ లో ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించి స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. 58వ డివిజన్ పీహెచ్ సీలో వైద్య శిబిరంను మేయర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఎల్లయ్య, కార్పొరేటర్లు మేకల సమ్మయ్య, శారద, డిప్యూటీ డీఎంహెచ్ రాజమౌళి, వైద్యాధికారి స్నేహలత, సీడీపీఓ ఆర్ అలేఖ్య పటేల్ తదితరులు పాల్గొన్నారు.