కరీంనగర్: హుజూరాబాద్లో ప్రజాప్రతినిధులను, నాయకులను మాజీ మంత్రి ఈటల రాజేందర్ డబ్బుతో కొనే ప్రయత్నాలు మానుకోవాలని హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక శ్రీనివాస్ అన్నారు. ఈటల తన సన్నిహితులను తమవద్దకు పంపి ప్రలోభాలకు గురిచేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్లో వైస్చైర్పర్సన్ నిర్మల, ఎంపీపీ రాణి, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్తో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. తనకు రెండు వందల ఎకరాల భూమి ఉందని ఈటల గతంలో ప్రకటించారని చెప్పారు. ఎకరం అమ్మితే రూ.వంద కోట్లు వస్తాయని, ఆ డబ్బుతో ఎన్నికల్లో గెలుస్తానని ప్రకటించారని.. ఆయనది అహకారం కాదా అని ప్రశ్నించారు. తామంతా సీఎం కేసీఆర్ వెంటే ఉంటామని, టీఆర్ఎస్ పార్టీ కోసమే పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈటల లాగా స్వార్ధ ప్రయోజనాల కోసం, అవసరాలకు అనుగుణంగా పార్టీలు మార్చే సంస్కృతి తమకు లేదని చెప్పారు.
ఈటల తన అక్రమాస్తులను కాపాడుకోవడానికే బీజేపీలో చేరుతున్నారని హుజూరాబాద్ ఎంపీపీ రాణి అన్నారు. తమ వద్దకు ఎవరైనా వచ్చి బేరసారాలు చేయాలని చూస్తే తగిన విధంగా బుద్ధిచెబుతామని హెచ్చరించారు.