ధాన్యం కొనుగోళ్లలో అంచనా తప్పింది. ఎన్నికల సమయంలో కొనుగోళ్లు ప్రారంభం కావడం, అధికారులంతా ఈ పనిలోనే నిమగ్నమై ఉండడంతో కొంత నిర్లిప్తత కనిపించింది. ఫలితంగా ఎక్కువ మంది రైతులు ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోగా, ఈ సారి వరికి తెగుళ్లు ఆశించి కూడా దిగుబడి పెద్ద మొత్తంలో తగ్గింది. సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాలని కరీంనగర్ జిల్లా యంత్రాంగం ప్రణాళికలు వేసుకుంటే, ఇప్పటి వరకు కేవలం 2.13 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనగలిగింది. ఇప్పటికే కొనుగోళ్లు మందగించడంతో మరో మూడు నాలుగు రోజుల్లో కేంద్రాలన్నింటినీ మూసివేసే పరిస్థితి ఉన్నది.
– కరీంనగర్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): వానకాలం ధాన్యం కొనుగోళ్లు ఆశించిన రీతిలో జరుగలేదు. కొనుగోళ్లకు ముందు అధికారులు జిల్లాలో ఎంత వరి సాగైంది. ఎకరాకు ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉందనేది అంచనా వేసి అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేసుకుంటారు. గత వానకాలం సీజన్లో జిల్లాలో 2.72 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. ఫలితంగా 6 లక్షల మెట్రిక్ టన్నులకు మించి దిగుబడి రావచ్చని భావించిన అధికారులు, 4 లక్షల మెట్రిక్ టన్నులు మార్కెటింగ్ జరుగవచ్చని అంచనా వేశారు. ప్రతిసారి అక్టోబర్ చివరలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేవారు. నవంబర్లో పుంజుకుని, డిసెంబర్లో మొదటి లేదా రెండో వారంలో కొనుగోళ్లు ముగిసేవి.
అయితే ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో అధికారులు ఎక్కువగా ఈ పనిలోనే నిమగ్నమై ఉన్నారు. ఏ కొద్ది సమయం చిక్కినా కొనుగోళ్లపై దృష్టి సారించారు. జిల్లాలో 324 కేంద్రాలను ప్రారంభించారు. అధికారులు కొనుగోళ్ల విషయంలో ఎక్కడా లోపాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఫలితంగా ఇప్పటి వరకు 2.13 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా కొనుగోళ్లు చేశారు. అధికారులు తదుపరి వేసిన అంచనాల ప్రకారం 2.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొనుగోళ్లు మందగించిన నేపథ్యంలో తెరిచిన 324 కేంద్రాల్లో ఇప్పటికే 180 కేంద్రాలు మూసేశారు. మరో నాలుగైదు రోజుల్లో మిగతా కేంద్రాలను కూడా మూసివేసే ఆలోచనలో అధికారులు కనిపిస్తున్నారు.
ఇది కొత్తపల్లి మండల కేంద్రంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం. ఈ కేంద్రంలో గతేడాది వాన కాలంతో పోల్చితే ఇప్పుడు ధాన్యం కొనుగోలు 50 శాతం మాత్రమే జరిగింది. 2022లో 13,070 క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లు చేసిన ఈ కేంద్రంలో ఈ సారి ఇప్పటి వరకు 7,240 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయగలిగారు. ఇంకో వెయ్యి క్వింటాళ్ల వరకు కేంద్రంలో ఉన్నాయి. ఆలస్యంగా వరి నాట్లు వేసిన ఇంకొందరు రైతులు ఇప్పుడిప్పుడే కోతలు నిర్వహిస్తున్నారు. మరో నాలుగైదు రోజుల్లో ఇంకో 500 క్వింటాళ్ల వరకు ధాన్యం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎంత చేసినా 9వేల క్వింటాళ్లకు మించి ఇక్కడ కొనుగోళ్లు జరిగే అవకాశం కనిపించడం లేదు. గతానికి ఇప్పటికే పోల్చుకుంటే కేంద్రం ప్రారంభించకముందే కొందరు రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకున్నారు. అంతే కాకుండా గ్రామంలో వరికి వచ్చిన తెగుళ్ల కారణంగా గతేడాదికి ఇప్పటికీ దిగుబడి పెద్ద మొత్తంలో పడిపోయింది.
జిల్లాలో ఇప్పటి వరకు వానకాలం సీజన్లో వచ్చిన ధాన్యం దిగుబడిలో 2.13 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. దీని విలువ రూ.470.65 కోట్లుగా అధికారులు చెబుతున్నారు. ఐకేపీ ద్వారా 50 కేంద్రాలు తెరిచి 6,310 మంది రైతుల నుంచి 31,502.800, ప్యాక్స్ కేంద్రాల ద్వారా 233 కేంద్రాలు తెరిచి 32,560 మంది రైతుల నుంచి 1,55,356.162, డీసీఎంఎస్ ద్వారా 46 కేంద్రాలు తెరిచి 24,935.740, హాకా ద్వారా 3 కేంద్రాలు తెరిచి 1,849.160 మెట్రిక్ టన్నుల చొప్పున 2,13,644.312 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.
దీని విలువ మొత్తం రూ.470.65 కోట్లు కాగా ఇప్పటికే రూ.458.45 కోట్లు అప్లోడ్ చేశారు. రూ.439.81 కోట్లకు ట్రక్షీట్ జనరేట్ చేశారు. రూ.424.82 కోట్లు మిల్లర్ల నుంచి సేకరించారు. ఇందులో రూ.401.91 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశారు. విడుదలైన నగదులో ఇంకా రూ.22.91 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేయాల్సి ఉంది. కాగా, ఎప్పటి ధాన్యాన్ని అపుడు తరలించడంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు సేకరించిన 2,13,644 మెట్రిక్ టన్ను ల్లో 2,13,587 మెట్రిక్ టన్నులు తరలించారు. ఇంకా కేవలం 56.540 మెట్రిక్ టన్నులు మాత్రమే తరలించాల్సి ఉంది.
వరి నిన్ననే కోసినం. రెండు మూడు రోజులకు ఎండుతయచ్చు. మా ఊళ్లె రెండు కేంద్రాలు పెట్టిన్రు. ఇంకో కేంద్రంల సుతం వడ్లమ్మినం. ఎన్కషీరి నాటేత్తే కోతలు సుతం ఎన్కకైనయ్. మా పొలం ఇంకింత కోతకున్నది. రేపటెల్లుండి కోత్తం. మా వడ్లు అయింత కేంద్రానికి వచ్చేదాక ఉంచుతరో లేదో..? అందుకనే వడ్లు ఇక్కన్నే ఎండబోసినం. ఇంకింత కోతయ్యేదాక కేంద్రం ఉంచాలే. ఈ వడ్లన్నీ ఏడికివోయి అమ్ముకుంటం.
– పుల్ల బక్కవ్వ, కొత్తపల్లి రైతు.
జిల్లాలో సాధారణంగా దొడ్డు రకం వడ్లను ఎక్కువగా సాగు చేస్తారు. హుజూరాబాద్ డివిజన్లో విత్తనోత్పత్తికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ నేపథ్యంలో 2.72 లక్షల ఎకరాల్లో వరి సాగైనపుడు ఎకరానికి 25 క్వింటాళ్లు అంచనా వేసినా 6 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో తిండి కోసం, సన్న రకం వడ్లు, విత్తనోత్పత్తి తీసేస్తే అధికారులు ముందుగా అంచనా వేసినట్లు 4 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉండేది. కానీ ఈ సారి జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ వ్యాపారులు ధాన్యం కొనుగోళ్లు విరివిగా జరిపారు.
కొతలు కోస్తుండగానే పొలాల వద్ద నుంచే పచ్చి ధాన్యాన్ని మిల్లులకు తరలించుకెళ్లారు. ప్రైవేట్ వ్యాపారులు పొలం వద్దకు వచ్చి కొనుగోళ్లు చేసుకున్న నేపథ్యంలో రైతులు ధర విషయం ఆలోచించ లేదు. క్వింటాల్కు రూ. 1,750 నుంచి రూ.1,900 చెల్లించినా సంతోషంగా అప్పగించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అయితే ఏ గ్రేడ్ ధాన్యానికి రూ. 2,203, సాధారణ రకానికి రూ.2,183 చొప్పున కనీస మద్దతు ధర చెల్లిస్తున్నారు. అయితే ధాన్యం కల్లాల్లో ఆరబెట్టి, నాణ్యతా ప్రమాణాల ప్రకారం ఉంటుందని భావించిన తర్వాతనే కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ పనంతా లేకుండా చాలా మంది వ్యాపారులు పచ్చి వడ్లనే కొనుగోలు చేయడంతో తక్కువ ధరకైనా రైతులు విక్రయించినట్లు తెలుస్తోంది.
ఈ సారి మా ఊళ్లె ప్రవేట్లను బగ్గ మంది అమ్మిన్రు. కోతలు సురువైనపుడు మిల్లర్లు వచ్చి పచ్చి వడ్లే కొనుక్కపోయిన్రు. అప్పటికింకా కేంద్రం ఇస్టాట్గాలే. రేటు కేంద్రంల పెట్టినట్లు ఎందుకు పెడ్తరు. కింటల్కు పద్దెనిమిది, పదిహేడు వందలట్ల పెట్టికొన్నరు. పచ్చి వడ్లే కొనిరి బరువు వత్తయిగదా. కేంద్రం రేటు పెడ్తే వాళ్లు లాసుగారా. అంతకంతే నయమని మా రైతులు సుత ఎగవడి ఎగవడి అమ్మిన్రు. ఎవ్వలూ బాధపడలే.
– ఒగ్గరి జగన్, కొత్తపల్లి రైతు.
పది రోజుల కిందనే వరి కోసినం. పర్దలు లేకుండె. కిందనే కుప్పవోసి ఉంచినం. వాన పడ్డపుడు కవర్లు కప్పి పెట్టినం. ఎండ గొట్టినంక ఎండవోసినం. జెర్రంత గల్లర గల్లర అయినంక ఇయ్యలనే జోకుతన్రు. వరి కొంచెం నాటేసుడు ఎన్కకయ్యింది. కోతలు సుతం ఎన్కకయ్యేవరకు కేంద్రం ఉంటదో లేదో అనుకున్నం. మా ఊళ్లె చాన మందే ఎన్కకు ఏసిన్రు. ఇంకా కోతలైతన్నయ్. చాన్దినాలే కేంద్రం ఉంచిన్రు.
– ఎగుర్ల పద్మ, కొత్తపల్లి రైతు.