Outdoor gym | నేటి ఉరుకులు, పరుగుల ప్రపంచంలో మనిషి జీవితమే బిజీ అయిపోయింది. కాలంతో పోటీ పడుతూ.. ఉదయం లేచింది మొదలు పడుకునేదాకా క్షణం తీరికలేకుండాపోతున్నది. దీనికి తోడు వీడని నీడలా వెంటాడే మానసిక ఒత్తిడి.. ఇరవైలకే అరవైలుగా తయారవుతున్న జీవితాలు. ఇదీ నేటి సగటు మనిషి జీవనం. దీనికి చక్కని పరిష్కారం శారీరక శ్రమ. దీనిని గుర్తించిన రాష్ట్ర సర్కారు నగరాలు, పట్టణాల్లో కోట్లాది నిధులతో ఓపెన్ జిమ్స్, వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేస్తుండగా, ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది. ఆరోగ్యంపై పెరిగిన అవగాహనతో ఉదయం, సాయంత్రం క్యూ కడుతున్నారు. పిల్లలు మొదలు వృద్ధుల దాకా కసరత్తు చేస్తున్నారు.
పాత రోజుల్లో ప్రతి దానికి శారీరక శ్రమ ఎంతో అవసరం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మహిళలకైతే పిండి రుబ్బే పనిలేదు. బట్టలు ఉతికే పనిలేదు. మగవాళ్లకైతే నడిచి బజారుకెళ్లే పనిలేదు. సరుకులు మోసుకొచ్చే పనిలేదు. ఇలా పెరిగిన ప్రతి సౌకర్యం మనకు సమస్యలూ తెచ్చిపెట్టింది. వీటి వల్ల జీర్ణక్రియ దెబ్బతినడం, నిద్ర కరువవడం, జీవక్రియ పడిపోవడం వంటి ఎన్నో రకాల శారీరక, మానసిక సమస్యలు మనిషిని చుట్టుముడుతున్నాయి. వీటిని అధిగమించేందుకు ఒకటే మార్గం వ్యాయామం. ఇటీవల కాలంలో ఎక్సర్సైజులపై ఆసక్తి బాగా పెరిగింది.
ప్రధానంగా మహిళలు, వృద్ధులు మాత్రం ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి వ్యాయామాన్ని ఒక మా ర్గంగా ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్య తెలంగాణ కో సం కృషిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నది. పట్టణ ప్రగతి నిధులతో ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచే పనులు చేయాలని సూచించింది. ఇందులో భాగంగానే ఆయా మున్సిపాలిటీలు నగరాలు, పట్టణాల్లో వాకింగ్ ట్రాక్స్, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేస్తుండగా, స్థానిక ప్రజల నుంచి విశేష ఆదరణ వస్తున్నది. ఈ క్రమంలో ప్రజల అవసరాలకు తగ్గట్టుగా పరికరాలను అందుబాటులో ఉంచుతుండడంతో ఉదయం, సాయంత్రం ఎక్సర్సైజు చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు.
అందుబాటులో జిమ్స్
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో 3.50 కోట్లతో 30 ప్రాంతాల్లో ఓపెన్ జిమ్స్ను ఏర్పాటు చేశారు. ప్రజలు ఎక్కడైతే ఎక్కువగా మార్నింగ్, ఈవినింగ్ వాకింగ్కు వెళ్తున్నారో ఆయా ప్రాంతాల్లో డివిజన్ల వారీగా నెలకొల్పారు. నగర శివారుల్లోని మానేరు డ్యాం ప్రాంతంతో పాటు అంబేద్కర్ స్టేడియం, ఎస్సారార్ కళాశాల, కశ్మీర్గడ్డ, హౌసింగ్బోర్డు కాలనీ, అలకాపురి, విద్యానగర్, జ్యోతినగర్, మార్క్ఫెడ్తో పాటుగా ఇతర అనేక ప్రాంతాల్లో వీటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే 80 లక్షలతో తొమ్మిది చోట్ల వాకింగ్ ట్రాక్స్ను తీర్చిదిద్దారు. మార్క్ఫెడ్ మైదానం, మహిళ డిగ్రీ కళాశాల, సప్తగిరికాలనీ ప్రభుత్వ స్కూల్, హౌసింగ్బోర్డు కాలనీలో, గిద్దెపెరుమాండ్ల దేవాలయ సమీపంలో అభివృద్ధి చేశారు. ఇప్పటికే నగరంలో జ్యోతిభాపూలే మైదానంలో సింథటిక్ ట్రాక్ను అందుబాటులోకి తెచ్చారు.
మానేరు డ్యాం కట్ట వెంట సుమారుగా రెండు కిలోమీటర్ల మేర నూతన ట్రాక్ పనులు తుది దశకు వచ్చాయి. నగరంలో ప్రస్తుతం వినియోగంలోకి వచ్చిన వాకింగ్ ట్రాక్స్తో పాటుగా ఇతర ప్రాంతాల్లోనూ ట్రాక్స్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనికి తోడు ఎస్సారార్ కళాశాల, ఇతర ప్రాంతాల్లోనూ ట్రాక్స్ను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే పలు డివిజన్ల నుంచి కూడా వాకింగ్ ట్రాక్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు వస్తుండడంతో వాటిపై అతి త్వరలోనే నిర్ణయం తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. హుజూరాబాద్లో 1.32 కోట్ల వ్యయంతో 11 జిమ్లు, జమ్మికుంటలో 60 లక్షల వ్యయంతో ఐదు జిమ్లు ఏర్పాటు చేశారు. ఇక చొప్పదండి, కొత్తపల్లిలో జిమ్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.
పెరిగిన ఆదరణ
ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ముఖ్యంగా శారీరకంగా దృఢంగా ఉండేందుకు జిమ్లకు వెళ్లే స్థోమత లేని వారికి ఈ ఓపెన్ జిమ్లు ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయి. ఇక్కడ పిల్లల నుంచి పెద్దల దాకా ఎక్సర్సైజు చేసేందుకు తీరొక్క పరికరాలను ఏర్పాటు చేయడంతో అన్ని రకాల వ్యాయామం చేసుకునే వీలుకలుగుతున్నది. ముఖ్యంగా ఎయిర్ వాకర్, పుష్చైర్, ఎయిర్ స్వింగ్, షోల్డర్ వీల్, లెగ్ప్రెస్, పుల్చైర్, స్టాండింగ్ ట్విస్టర్, డబుల్ క్రాస్ వాకర్, ఎల్లిప్టికర్ ఎక్సర్సైజ్. లెగ్లిప్ట్, సిట్టింగ్ ట్విస్టర్ తదితర అన్ని రకాల సాధనాలను అందుబాటులో ఉంచగా, స్థానిక ప్రజలకు ఇవి వరంలా మారాయి. ఉదయం 4.30 గంటల నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు సందడి చేస్తున్నారు. సామాన్య ప్రజల నుంచి మొదలుకొని ఉన్నత స్థాయి అధికారుల వరకు ఓపెన్ జిమ్లపై ఆధారపడి ఆరోగ్యాన్ని పెంచుకుంటున్నారు. ఆడుతూ.. పాడుతూ వ్యాయామం చేస్తున్నారు.
కరీంనగర్లో మరికొన్నింటికి ప్రతిపాదనలు
నగరం, పట్టణాల్లో ఏర్పాటు చేసిన ఈ ఓపెన్ జిమ్స్కు ఆదరణ పెరుగడంతో మరికొన్ని చోట్లా నెలకొల్పాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. కరీంనగర్లో ప్రస్తుతం ఉన్న 30 జిమ్స్ రద్దీగా మారడంతో తమ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలంటూ ఆయా డివిజన్ల కార్పొరేటర్లు ఇప్పటికే ప్రతిపాదనలు పంపారు. పది రకాల పరికరాలను ఏర్పాటు చేసేందుకు వీలుగా స్థలం ఉంటే ఏర్పాటు చేస్తామని మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం పెంపునకు ఇవి ఎంతో ఉపయోగపడుతుండడంతో అన్ని మున్సిపాలిటీల పరిధిలో వీటిని పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసేందుకు అటు రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రాధాన్యత ఇచ్చి సూచనలు చేస్తుంది. ముఖ్యంగా స్థానిక ప్రజలు కోరుకునే ఎక్సర్సైజుల పరికరాలను వారికి అందుబాటులో ఉంచే విధంగా వీటిని తీర్చిదిద్దాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎంతో ఉపయోగకరంగా ఉంది
పెద్ద జిమ్లకు వెళ్లకుండా ఉన్న ప్రాంతాల్లో ఎక్సర్సైజులు చేసుకొని ఇంటికి వెళ్లే విధంగా ఉన్నాయి. గత ఐదారు నెలలుగా ప్రతి రోజు వీటిల్లో ఎక్సర్సైజులు చేస్తున్నా. ఎంతో బాగుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మంచి ఆరోగ్యంగా ఉండేందుకు వీలుగా ఈ జిమ్లో ఎక్సర్సైజ్ చేసి ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. నేను ప్రతి రోజు చేస్తున్నాను. అన్ని అవయవాలు కదిలే విధంగా సులువుగా చేసుకునే విధంగా పరికరాలు ఉన్నాయి. జిమ్ కోసం ఎక్కడికో వెళ్లి వేలకు వేలు పెట్టకుండా మున్సిపాలిటీ నుంచి వీటిని ఏర్పాటు చేయటం ఆనందంగా ఉంది. వాకింగ్ చేసుకొని ఓ అరగంట వీటిని చేసుకుంటునే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది.
– దేవేందర్రెడ్డి, డ్యాం వద్ద వాకర్
అన్ని సౌకర్యాలున్నయి..
ఓపెన్ జిమ్లో అన్ని సౌకర్యాలు కల్పించారు. అన్ని వయస్సుల వారు కసరత్తు చేసేందుకు అవసరమైన పరికరాలు పెట్టించారు. నేను ఎస్సారార్ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన జిమ్లో రోజూ పది రకాల పరికరాలపై ఎక్సర్సైజులు చేస్తున్నా. చాలా బాగా ఉపయోగ పడుతున్నాయి. ప్రైవేటు జిమ్లలో ఎలాంటి పరికరాలు అయితే ఉంటాయో.. అచ్చం అలాంటి పరికరాలనే పెట్టించారు. ప్రైవేట్ జిమ్ సెంటర్లకు వెళ్లి వేలకు వేలు ఖర్చు చేయలేని వారి కోసం ప్రభుత్వం ఇంత మంచి ఆలోచన చేసి ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయడం అభినందనీయం.
–రేవంత్రెడ్డి, ఎస్ఆర్ఆర్ వాకర్
ప్రజల హెల్త్ కోసమే..
నగర ప్రజల ఆరోగ్యం, ఆహ్లాదం కోసమే వాకింగ్ ట్రాక్స్, ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రజల ఆదరణ, విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకొని చర్యలు చేపడుతున్నాం. ఒకప్పటితో పోల్చితే నగరంలో వాకింగ్ చేసే వారి సంఖ్య పెరిగింది. అందుకు అనుగుణంగా అన్ని డివిజన్లల్లోనూ వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం. ప్రస్తుతం కొత్తగా ఏర్పాటు చేస్తున్న పార్కుల్లో తప్పనిసరిగా వాకింగ్ ట్రాక్ ఉండేలా చర్యలు చేపడుతున్నాం.
– వై సునీల్రావు, మేయర్