గోదావరిఖని/ రామగిరి, డిసెంబర్ 22 ; తెలంగాణ కొంగుబంగారం.. సిరుల మాగాని.. సింగరేణి అద్భుతమైన ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. నేడు 103వ వసంతంలో అడుగు పెట్టబోతున్నది. నల్ల బంగారం (బొగ్గు) నిక్షేపాలను వెలికితీస్తూ నవరత్న కంపెనీగా లాభాల బాటలో పయనిస్తున్నది. నాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రశ్నార్థకంగా మారిన సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక అభివృద్ధి బాటలో పయనిస్తున్నది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో బొగ్గు ఉత్పత్తితోపాటు విద్యుత్ రంగంలోనూ అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నది. స్వరాష్ట్రంలో కేసీఆర్ కృషితో సింగరేణిలో కారుణ్య నియామకాలను ప్రవేశపెట్టడంతో ఇప్పుడు యువరక్తంతో రికార్డు స్థాయి ఉత్పత్తి సాధిస్తున్నది. నేడు సింగరేణి వ్యాప్తంగా 103వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమైంది.
కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న సింగరేణి సంస్థ నాటి సీమాంధ్ర పాలకుల ఆదిపత్య పోరులో నలిగిపోయి నేడు స్వతంత్రంగా తెలంగాణ రాష్ర్టానికే కొంగుబంగారమైంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా ఏర్పడ్డ బీఆర్ఎస్ ప్రభుత్వం మెడికల్ అన్ఫిట్, చనిపోయిన కార్మికుల డిపెండెంట్లకు కారుణ్య నియామకాల ద్వారా ఇప్పటివరకు 20వేల పైచిలుకు మందికి ఉద్యోగాలు ఇవ్వడంతో యువరక్తంతో సింగరేణి భవిష్యత్పై ఆశలు పెరిగిపోతున్నాయి. 1920 డిసెంబర్ 23న అంటే సరిగ్గా ఇదే రోజున సింగరేణి సంస్థ పురుడు పోసుకుంది. 1871లో డాక్టర్ విలియం కింగ్ అనే బ్రిటిష్ అధికారి ఖమ్మం జిల్లా ఇల్లందులో బొగ్గు నిక్షేపాలను కనుగొన్నాడు. 1886లో హైదరాబాద్ డక్కన్ కంపెనీ ఆధ్వర్యంలో మైనింగ్ హక్కులు పొంది ఇల్లందు ఏరియాలోనే 1920 డిసెంబర్ 23న బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించింది. అ తర్వాత 1960లో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో బొగ్గు ఉత్పత్తి చేస్తూ ముందుకు సాగింది. 1974లో షేర్ల బదిలీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 51శాతం కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటాలతో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. 350 కిలోమీటర్ల మేర ప్రాణాహిత, గోదావరి వ్యాలీలో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థ ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విస్తరించి ఉంది. ప్రస్తుతం 39వేల మంది కార్మికులతో ప్రతి ఏటా 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంతో అద్భుతమైన ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది.
యాంత్రీకరణతో తగ్గుతున్న భారం
సంస్థ ప్రారంభమైన కొంత కాలానికే అధునాతన యాంత్రీకరణను సంస్థలో ఏర్పాటు చేసి బొగ్గు ఉత్పత్తి చేశారు. 1937లోనే కోల్ డ్రిల్లింగ్ మిషన్స్, తర్వాత షటల్ కార్స్, ఆర్మ్ లోడర్స్, కన్వేయర్స్, కోల్ ఫ్లాక్, డ్రాగ్లైన్, భారీ షావల్స్, ఎక్కువ కెపాసిటీ కలిగిన డంపర్లు, ఇన్ఫిట్ క్రషింగ్ కన్వేయన్స్ టెక్నాలజీతో అత్యంత వేగంగా బొగ్గుపై కప్పబడి ఉండే మట్టిని తొలగించే యంత్రం, సర్పేస్ మైనర్ యంత్రం, భూగర్భ బొగ్గు గనుల్లో లాంగ్వాల్ పద్ధతుల్లో బొగ్గు ఉత్పత్తి చేసే ప్రక్రియ చేపట్టారు. అలాగే బ్లాస్టింగ్ గ్యాలరీ టెక్నాలజీని, అండర్గ్రౌండ్ గనుల్లో కంటిన్యూయస్ మైనర్ యంత్రాన్ని ప్రవేశపెట్టారు. రామగుండం రీజియన్లో జర్మనీ టెక్నాలజీతో అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు.
పర్యావరణ హిత సింగరేణి
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి సీఎం కేసీఆర్ దూర దృష్టితో పర్యావరణ హిత సింగరేణిగా పేరు తెచ్చుకున్నది. అంతర్జాతీయ స్థాయి అవార్డులను సొంతం చేసుకుంటున్నది. సింగరేణి వ్యాప్తంగా కార్మికుల సంక్షేమంను దృష్టిలో ఉంచుకొని పర్యావరణకు పెద్దపీట వేస్తున్నది. కేసీఆర్ చేపట్టిన హరితహారంలో రాష్ట్రంలోనే సింగరేణి సంస్థ అగ్ర భాగాన నిలుస్తున్నది. సంస్థ వ్యాప్తంగా 11 ఏరియాల్లో యేటేటా కోట్లాది మొక్కలు నాటుతూ వాటి సంరక్షణ బాధ్యత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది.
సింగరేణిపై కేంద్రం కక్ష
సింగరేణిపై కేంద్రప్రభుత్వం కక్ష గట్టింది. కేవలం ఆదాయ వనరుగా మాత్రమే చూస్తున్నది. గడిచిన ఐదేండ్లలో సింగరేణి జీఎస్టీ, ఆదాయ పన్ను, సెంట్రల్ ఎక్సైజ్, క్లీన్ ఎనర్జీ సెస్, ఎంట్రల్ సేల్స్ టాక్స్, సర్వీసు టాక్స్, ఇతర పన్నుల రూపేణా భారీగా చెల్లిస్తున్నది. 49 వాటా కలిగిన కేంద్రానికి సింగరేణి సంస్థ నుంచి ఎక్కువగా నిధులు వెళ్తున్నా సంస్థకు మాత్రం కేంద్రం నుంచి నయా పైసా లాభం జరగడం లేదు.
కార్మికుల సంక్షేమానికి పెద్దపీట
2020-21 ఆర్థిక సంవత్సరంలో 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈసారి రికార్డు స్థాయి బొగ్గు ఉత్పత్తి సాధించడం సాధ్యమని పేర్కొంటుంది. రాష్ట్రం ఏర్పడిన సమయంలో కేవలం 50 మిలియన్ టన్నులుగా ఉన్న ఉత్పత్తి 70 మిలియన్ టన్నులకు చేరుకోవడం విశేషం. అంతక్రితం అరకొరగా ఉన్న లాభాలు భారీగా పెంచుకుంటూ ముందుకు సాగుతున్నది. 2017-18లో సంస్థ రికార్డు స్థాయిలో రూ.1766 కోట్లు లాభాలు ఆర్జించింది. కొవిడ్ సంక్షోభంలోనూ రెండేండ్లలో రెండు దఫాలుగా 2400 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా రెగ్యులరైజ్ చేశారు. 100కు పైఏగా డిస్మిస్ కార్మికులకు ఉద్యోగాలకు కల్పించారు.