మంథనిలోని బొక్కలవాగుపై నిర్మించిన డబుల్ వంతెనతో ఈ ప్రాంత వాసుల ప్రయాణ వెతలు దూరమయ్యాయి. సింగిల్ బ్రిడ్జితో నరకం చూసిన ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పాయి. ఇప్పుడు ఎంచక్కగా రాకపోకలు సాగుతున్నాయి.
మంథని, అక్టోబర్ 12: పెద్దపల్లి, కాటారం ప్రధాన రహదారి నుంచి మంథనిలోకి రావడానికి, పట్టణం నుంచి కాటారం, పెద్దపల్లికి వెళ్లేందుకు బొక్కలవాగుపై ఉన్న వంతెనను దాటి వెళ్లాలి. అయితే ఒకే వంతెన ఉండడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తి ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడే వారు. భారీ వాహనాల టర్నింగ్ కోసం డ్రైవర్లు సైతం చాలా ఇబ్బందులు పడేవారు. కొన్ని సందర్భాల్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కాగా.. మరికొన్ని సందర్భాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగేవి. ఈ నేపథ్యంలో అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ప్రత్యామ్నాయంగా మరో వంతెనను నిర్మించాలని సంకల్పించారు. వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో సీఎం కేసీఆర్ చొరవతో ప్రభుత్వం ఆర్డీఎఫ్ (రూరల్ డెవలప్మెంట్)కింద 2016 జూలై నెలలో రూ. 5 కోట్లు మంజూరు చేసింది. వెంటనే విడుదల చేయగా వెనువెంటనే పనులు ప్రారంభించారు. ఈ దశలో కరోనా విజృంభించడంతో పనులు కొంత ఆలస్యమయ్యాయి. అయినప్పటికీ సాధ్యమైనంత తొందరలో బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు. దీంతో పట్టణం నుంచి బయటికి, పాత వంతెన ద్వారా కాటారం-పెద్దపల్లి ప్రధాన రహదారి నుంచి లోపలి వాహనాలు సులువుగా వస్తున్నాయి. నూతన వంతెనతో మంథని పట్టణానికి ముఖద్వారంగా ఉన్న పాత పెట్రోల్ పంపు చౌరస్తాకు మరింత కళ వచ్చింది.
మంథని బొక్కలవాగుపై ఒకే వంతెన ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యతో నరకం అనుభవించాం. భారీ వాహనాలు టర్నింగ్ తీసుకునే సమయంలో ఇబ్బందులు ఎదురయ్యేవి. తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగేవి. బొక్కలవాగుపై మరో వంతెన నిర్మించడంతో రవాణా కష్టాలు తొలగిపోయాయి. పట్టణం నుంచి బయటికి వచ్చే వాహనాలు ఒక వంతెనపై నుంచి, పట్టణం నుంచి లోపలికి వెళ్లే వాహనాలు మరో వంతెనపై వెళ్తుండటంతో రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి.
-ఎం నరేశ్, మంథని