కరీంనగర్ బల్దియా ఇంజినీరింగ్ యంత్రాంగం నిర్లక్ష్యం నగరవాసులకు శాపంగా మారింది. చాలా ప్రాంతాలకు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తుండగా, డీజిల్కు డబ్బులు లేక బుధవారం సరఫరా నిలిచిపోయింది. దీంతో పలు ప్రాంతాల్లో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
కార్పొరేషన్, జూలై 1: కరీంనగరంలోని అనేక ప్రాంతాల్లో భూగర్భజలాలు పూర్తిగా అడుగంటాయి. నగరపాలక సంస్థ రోజు విడిచి రోజు నీటి సరఫరా చేస్తున్నా.. అనేక ప్రాంతాలకు పూర్తిస్థాయిలో ప్రెషర్ రాక ప్రజలకు వాటర్ ట్యాంకర్లే దిక్కవుతున్నాయి. ఈక్రమంలో నగరపాలక సంస్థ కొద్దిరోజులుగా హైలెవల్, లోలెవల్ పరిధిలో ఒక్కో ట్యాం కర్కు రూ.600 ఫీజు వసూలు చేస్తూ నీటిని సరఫరా చేస్తున్నది. హైలెవల్లో 4, లోలెవల్లో 3ట్యాంకర్లు నీటి సరఫరా చేస్తుండగా,మరో 12ట్యాంకర్లను నగరంలోని హరితహారం మొక్కల సంరక్షణకు వినియోగిస్తున్నారు.
మొత్తంగా నగరంలో ట్యాంకర్ల ద్వారా రోజూ 50ట్రిప్పుల నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే బల్దియా వాటర్ ట్యాంకర్లకు కరీంనగర్ జైలు పరిధిలో పెట్రోల్ బంక్లోనే డీజిల్ పోయిస్తున్నారు. కొద్దిరోజులుగా ముంద స్తు బిల్లులు చెల్లిస్తేనే జైలు అధికారులు మున్సిపల్ వాహనాలకు ఇంధనం పోస్తున్నారు. అయితే అధికారులు ముందస్తుగా చెల్లించిన నిధులు మంగళవారం నాటికి అయిపోవడంతో బుధవారం ట్యాంకర్లకు డీజిల్ పోసేందుకు జైలు అధికారులు నిరాకరించా రు. దీంతో నగరంలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు బ్రేక్పడగా, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ట్యాంకర్ల కోసం రిజర్వాయర్ల వద్దకు వచ్చి నిరాశతో వెనుదిరిగారు. ఇదే అదనుగా ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల యజమానులు అడ్డగోలుగా ఫీజు వసూలు చేసి నీటి సరఫరా చేశారు. కాగా, ఈ విషయమై ఇన్చార్జి ఈఈ లచ్చిరెడ్డిని వివరణ కోరగా, ముందస్తు బిల్లులు చెల్లింపు చేయకపోవడంతో బుధవారం డీజిల్ పోయని విషయం వా స్తవమేనని తెలిపారు. ఇప్పటికే ముందస్తు బిల్లులకు సంబంధించి రూ.10లక్షల చెక్కును బుధవారం సిద్ధం చేసి కమిషనర్కు పంపించామని, సాయంత్రం వరకు చెక్కు మంజూరవుతుందని, గురువారం నుంచి యథావిధిగా ట్యాంకర్లు నడుస్తాయని తెలిపారు.