రాజన్న సిరిసిల్ల, జనవరి 21 (నమస్తే తెలంగాణ): అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో సిరిసిల్ల నేతన్నలు శ్రీరాముడి జెండాల తయారీలో నిమగ్నమయ్యారు. ఇటీవలే ఇక్కడి నేత కార్మికుడు అయోధ్య రామ్లల్లాకు బంగారు చీరను బహూకరించాడు. ప్రతి ఇంటిపై కాషాయ జెండా ఎగురవేయాలన్న అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ పిలుపు మేరకు వివిధ రాష్ర్టాలకు చెందిన హిందూ ధార్మిక సంస్థలు సుమారు రూ. 2 కోట్ల విలువైన జెండాల తయారీ ఆర్డర్లు ఇచ్చాయి.
శ్రీరాముడు, ఆంజనేయుడు, ఓంకారంతో ముద్రించిన జెండాలు, కండువాల తయారిలో వందలాది మందికి ఉపాధి లభించింది. సోమవారం శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ ఉన్నందునా ఇప్పటికే నేత కార్మికులు కళా నైపుణ్యంతో జెండాలు, కండువాలు తయారు చేశారు. కర్నాటక, మహరాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలకు ఎగుమతి చేశారు. నెలరోజులుగా జెండాల తయారీతో రోజుకూ రూ. 800 నుంచి రూ. వెయ్యిదాకా సంపాదించామని పలువురు కార్మికులు చెప్పారు.