తిమ్మాపూర్/ తెలంగాణ చౌక్, జూన్ 21 : కరీంనగర్ నుంచి హైదరాబాద్ బయలు దేరిన పదిహేను నిమిషాల్లోనే ఎలక్ట్రికల్ బస్సు.. దగ్ధమైంది. దాదాపు అరగంటలోనే కాలిబూడిదైంది. అయితే డ్రైవర్ అప్రమత్తతతో ఇద్దరు చిన్నారులు సహా 40మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికుల వివరాల ప్రకారం.. కరీంనగర్ ఆర్టీసీ-2డిపోకు చెందిన ఎలక్ట్రికల్ బస్సు ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో ప్రయాణికులతో హైదరాబాద్ జేబీఎస్కు బయలుదేరింది. అల్గునూర్ శివారులో బస్సులో కాలిపోతున్న వాసనతోపాటు సిగ్నల్స్ రావడంతో డ్రైవర్ ప్రశాంత్ అప్రమత్తమయ్యాడు. వెంటనే బస్సును పక్కకు ఆపేందుకు యత్నంచగా కాకతీయ కెనాల్ రావడంతో కాస్త ముందుకెళ్లాడు. ఆ అక్కడ పెట్రోల్ బంక్ ఉండడంతో ఇంకాస్తా ముందుకెళ్లి రహదారి పక్కన ఆపాడు. ప్రయాణికులను అలర్ట్ చేసి, దించాడు.
కొందరు యువకులు కిటికీల్లోంచి దూకారు. బస్సులో ఉన్న అగ్నిమాపక పరికరాన్ని ఉపయోగించి మంటలు ఆర్పేందుకు డ్రైవర్ ప్రయత్నించినా అదుపులోకి రాలేదు. పరిస్థితి చేయి దాటిపోతుందని భావించి, బస్సులోకి వెళ్లి ప్రయాణికుల లగేజీ బయటకు విసిరి దిగాడు. అప్పటికే ఫైర్ స్టేషన్కు సమాచారం అందించగా, 40 నిమిషాల తర్వాత ఫైరింజన్ రావడంతో బస్సు మొత్తం దగ్ధమైంది. అర గంటలోనే మొత్తం కాలి బూడిదయింది. మానకొండూర్ ఫైర్ స్టేషన్ నుంచి రావాల్సిన వాహనం మొరాయించడంతో కరీంనగర్ నుంచి మూడు వాహనాలను తెప్పించి అదుపులోకి తెచ్చామని అగ్నిమాపకశాఖ అధికారి తెలిపారు. అగ్నిమాపకశాఖ సిబ్బంది దాదాపు గంటకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, సంఘటన స్థలాన్ని పోలీస్, అగ్నిమాపక, రవాణా, ఆర్టీసీశాఖల అధికారులు పరిశీలించారు. ఎలక్ట్రికల్ బస్సు కావడంతో బ్యాటరీలు పేలాయా.. లేదా షార్ట్సర్క్యూట్ జరిగిందా..? అనే కోణంలో అధికారులు అనుమానిస్తున్నారు.
మధ్యాహ్న సమయంలో లేదా.. ఎక్కువ దూరం నుంచి ప్రయాణించినా.. బ్యాటరీల మీద ఒత్తిడి పెరిగి ఏమైనా జరిగిందనుకోవచ్చు కానీ, కరీంనగర్ బస్టాండ్ నుంచి బయల్దేరిన పది, పదిహేను నిమిషాల్లోనే ప్రమాదం జరగడంతో ఏ కారణంతో మంటలు చెలరేగాయనే కోణంలో విచారణ చేపట్టారు. జాతీయ రహదారులపై స్ప్రింగ్ స్పీడ్ బేకర్లతో బస్సు కుదుపునకు గురై ముఖ్యమైన వైర్ కన్షెనన్లు లూజు అవుతాయని, నట్ బోల్ట్లు వదులై షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదముంటుందని సీనియర్ డ్రైవర్లు చెబుతున్నారు. టెక్నికల్ సిబ్బంది తక్కువగా ఉండడం, ఈవీ బస్సులను సరిగ్గా సర్వీస్ చేయకపోవడం కూడా లోపం ఏర్పడవచ్చని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా పూర్తి స్థాయి టెక్నికల్ టీం హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని ఆర్ఎం రాజు తెలిపారు. ప్రయాణికులను సురక్షితంగా కాపాడిన డ్రైవర్ ప్రశాంత్ను మంత్రి పొన్నం ప్రభాకర్, ఈడీ సోలమన్, ఆర్ఎం బీ రాజు అభినందించారు. ఆదివారం సాయంత్రం డిపో-2లో శాలువాతో ఘనంగా సన్మానించారు.