కలెక్టరేట్, నవంబర్ 25: ఫాం 6, 7పై అవగాహన సదస్సులు నిర్వహించాలని ఎన్నికల అధికారి వికాస్ రాజ్ బూత్ స్థాయి అధికారులను ఆదేశించారు. బూత్ స్థాయి అధికారుల విధులు, ఓటరు జాబితాలు రూపొందించడంపై శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రతి పోలింగ్ బూత్ వారీగా బీఎల్వో, పది బూత్లకు ఒక సూపర్వైజర్ను నియమించాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో బీఎల్వో, సూపర్ వైజర్ల పేర్లు, వివరాలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని సూచించారు.
బూత్ వారీగా మొదట ఫాం 6, 7పై బీఎల్వోలకు అవగాహన కల్పించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ, కొత్త ఓటరు జాబితా సవరణ -2023 కార్యక్రమంలో భాగంగా ఈనెల 26, 27, డిసెంబర్ 3, 4వ తేదీల్లో బూత్ లెవల్ అధికారులు పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారని తెలిపారు.
కొత్తగా ఓటు నమోదు కోసం ఫాం 6, అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు తదితర అంశాలు ఏమైనా ఉంటే ప్రజలు వారిని సంప్రదించాలని కోరారు. గ్రామ పంచాయతీల్లో ప్రచారం చేపట్టాలని, బూత్ స్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జడ్పీ సీఈవో ప్రియాంక, ఆర్డీవో ఆనంద్ కుమార్, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.