మెట్పల్లి రూరల్, నవంబర్ 17: ‘ఎట్టికైనా.. మట్టికైనా మనోడుంటేనే మంచిదంటరు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులెవరూ స్థానికులు కాదు. నేను మెట్పల్లికి చెందిన మీ బిడ్డను. అండగా ఉంటా. ఆశీర్వదించండి’ అని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘స్థానికుడు కావాలా.. పరాయివారు కావాలా’ ఆలోచన చేయాలని సూచించారు. శుక్రవారం మెట్పల్లి మండలం వేంపేట గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్షో నిర్వహించగా, యువకులు, మహిళలు, రైతులు, వృద్ధులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామ ప్రధాన కూడలిలో సంజయ్ ప్రసంగించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గుణగణాలతో పాటు వారి వెనకాలున్న పార్టీ సిద్ధాంతాలను కూడా ఓటర్లు గమనించాలన్నారు.
ప్రతిపక్ష పార్టీలు అసత్య ప్రచారాలతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నాయని, వారికి ప్రజా సంక్షేమంపై పట్టింపు లేదన్నారు. కానీ కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్కు రైతును రాజుగా చేయాలన్నదే సిద్ధాంతమని తెలిపారు. అందుకే రైతుబంధు, రైతుబీమా, 24 గంటల విద్యుత్, సమయానికి ఎరువుల పంపిణీ, గ్రామాల్లోనే ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. 65 ఏళ్ల ప్రతిపక్షాల పాలనలో ప్రజలు నానా గోస పడ్డారని, కేసీఆర్ వచ్చినంక కేవలం తొమ్మిదేళలో ఎనలేని అభివృద్ధి, ప్రజా సంక్షేమం జరిగిందని చెప్పారు. దేశంలో బీడీ కార్మికులకు పింఛను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే పీఎఫ్ కటాఫ్తో సంబంధం లేకుండా బీడీ కార్మికులందరికీ పింఛన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
రైతుబీమా తరహాలో తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి రూ.5 లక్షల బీమా సౌకర్యం, రేషన్ దుకాణం ద్వారా సన్నబియ్యం పంపిణీ, ఆసరా పింఛన్లను విడతల వారీగా రూ. 5,016, వికలాంగ పింఛను రూ. 6,016కు పెంచనున్నట్లు చెప్పారు. బీజేపీకి చెందిన అభ్యర్థి నిజామాబాద్ నుంచి, కాంగ్రెస్కు చెందిన అభ్యర్థి హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేయగా, తాను మాత్రం మెట్పల్లికి చెందిన బిడ్డగా ఇక్కడి నుంచే పోటీచేస్తున్నట్లు చెప్పారు. కారు గుర్తుకు ఓటేసి మీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని కోరారు. ఇక్కడ ఎంపీపీ మారు సాయిరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నల్ల తిరుపతిరెడ్డి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గడ్డం రాజరెడ్డి, ఎంపీటీసీ పుల్ల చంద్రశేఖర్గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ కొమ్ముల రాజేశ్వర్రెడ్డి, సర్పంచులు ఉన్నారు.