సిరిసిల్ల, ఆగస్టు 3: ‘కేటీఆర్ సార్ కాలుకు నొప్పయిందట గదా.. ఎట్లుంది బిడ్డా..? నా పానం నిమ్మలమైతలేదు. ఎదైనా చెప్పేటోళ్లు మీరే కదా అని తెలుసుకొని ఇక్కడకు వచ్చిన’ అంటూ చీర్లవంచ సత్తవ్వ డీపీఆర్వో మామిండ్ల దశరథంను ఆత్రుతగా అడిగింది. బుధవారం సిరిసిల్ల కలెక్టరేట్లోని డీపీఆర్వో కార్యాలయానికి వచ్చిన సత్తవ్వ డీపీఆర్వో దశరథంతో మాట్లాడింది. ‘మా బిడ్డ (కేటీఆర్)కు కాలుకు దెబ్బతాకిందని మా ఊర్లె అనంగ విన్న. మనసున పడ్తలేదు. ఎట్లున్నడో మీకైతే తెలుస్తదని ఇక్కడికి వచ్చిన.. జెర కరెక్ట్ చెప్పండి సార్’ అంటూ అడుగడంతో అక్కడ ఉన్న వారంతా ఆసక్తిగా తిలకించారు.
మంత్రి కేటీఆర్కు కాలు గాయమైన విషయం తెలుసుకొని ఉండబట్టలేక స్వయంగా కలెక్టరేట్కు రావడం ఆమె అభిమానానికి అద్దం పడుతున్నది. తెలంగాణ ఉద్యమకారిణిగా ప్రపంచానికి తన ట్విట్టర్ ఖాతా ద్వారా సత్తమ్మను పరిచయం చేసిన మంత్రి కేటీఆర్ కాలునొప్పి కావడం అమెను బాధించింది. ఇటీవల మంత్రి కేటీఆర్ జిందం సత్తవ్వకు డబుల్ బెడ్రూం ఇంటిని కూడా కేటాయించారు. కాగా మంత్రి కేటీఆర్ కాలునొప్పితో ఉన్నారని, వైద్యుల సూచనల మేరకు ఆయన చికిత్స పొందుతున్నారని, త్వరలో సిరిసిల్ల పర్యటనకు వస్తారని చెప్పడంతో సత్తవ్వ డీపీఆర్వోకు దండం పెడుతూ సార్ చల్లగా ఉండాలని కోరింది. మరోవైపు తనకు డబుల్బెడ్రూం ఇంటిని అందజేసిన ఫొటోను మీ కార్యాలయంలో పెట్టాలని కోరగానే డీపీఆర్వో అంగీకరించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది.