కలెక్టరేట్, నవంబర్ 26 : పద్దెనిమిదేళ్లు నిండిన జిల్లాలోని యువత ఓటు హక్కు పొందాలని, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను శనివారం నగరంలో ఆయన పరిశీలించారు. నగరంలోని వివేకానంద విద్యాలయం, అల్గునూరు జడ్పీ ఉన్న పాఠశాలలోని పోలింగ్ బూత్లోఆయన మాట్లాడారు. ప్రతి పోలింగ్ కేంద్రం వారీగా అర్హులైన నూతన ఓటర్లను గుర్తించి, ఓటర్ల జాబితాలో వారి పేర్లు నమోదు చేయాలన్నారు. వారితో పాటు దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లను కూడా ఓటర్లుగా చేర్చాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమం ద్వారా ఓటర్లకు వారి వివరాల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తారని చెప్పారు. బీఎల్వోలు ఇంటింటి సర్వే ద్వారా ఓటర్లను చైతన్యవంతులను చేయాలన్నారు. చనిపోయిన వారి వివరాలు జాబితా నుంచి తొలగించాలని సూచించారు. పోలింగ్ కేంద్రంలో బూత్ స్థాయి అధికారులు, ఎన్నికల సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో ఆనంద్కుమార్, తహసీల్దార్ సుధాకర్, కనకయ్య, బూత్స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ఓటరు స్పెషల్ డ్రైవ్
మానకొండూర్ రూరల్, నవంబర్ 26: మానకొండూర్ తహసీల్ కార్యాలయంలో శుక్రవారం ఎన్నికల రిటర్నింగ్, అధికారి జడ్పీ సీఈవో ప్రియాంక కర్ణన్ ఆదేశాల మేరకు శనివారం మండలంలోని అన్ని గ్రామాల్లోని ఎలక్షన్ పోలింగ్ స్టేషన్లలో ఓటరు నమోదు స్పెషన్ డ్రైవ్ నిర్వహించారు. మండలంలోని అన్ని పోలింగ్ స్టేషన్లో బూత్ లెవల్ అధికారులు ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, చనిపోయిన వారివి తొలగించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తహసీల్దార్ లక్ష్మారెడ్డి తెలిపారు. ఆదివారం కూడా వివరాలను నమోదు చేయనున్నట్లు వెల్లడించారు. ఓటరు నమోదు చేసుకోని వారు, మార్పులు, చేర్పులు చేసుకునే వారు బీఎల్వోలకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ సమీనాబేగం, బీఎల్వోలు, సిబ్బంది పాల్గొన్నారు.
అర్హులందరూ ఓటు హక్కు నమోదు చేయించుకోవాలి
జమ్మికుంట, నవంబర్ 26: ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని, 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు తమ ఓటు హక్కును నమోదు చేయించుకోవాలని హుజూరాబాద్ ఆర్డీవో హరిసింగ్ సూచించారు. శనివారం ఆయన జమ్మికుంటలో ఎమ్మార్సీ భవనం, ప్రభుత్వ బాలుర పాఠశాల లో చేసిన ప్రత్యేక ఓటు నమోదు కార్యక్రమాలను పరిశీలించి, బీఎల్వోలకు సూచనలు చేశారు. ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించి, ప్రజల్లో చైతన్యం కలిగించాలని తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా తహసీల్దార్ రాజేశ్వరి హాజరై మాట్లాడారు. రాజ్యాంగం, ఓటు హక్కు తదితర అంశాలను వివరించారు. డీటీ సమ్మయ్య, కమిషనర్ సమ్మయ్య, ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్లు శ్రీలత, సువర్ణ, అకడమిక్ కో-ఆర్డినేటర్ సుజాత, రామ్మోహన్, శ్రీనివాస్రెడ్డి, స్వరూపారాణి, సురేశ్, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఓటు హకుపై అవగాహన ..
హుజూరాబాద్ రూరల్, నవంబర్ 26: విద్యార్థి దశ నుంచే ఓటు హక్కుపై అవగాహన కలిగి ఉండాలని జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి సూచించారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కందుగుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మాక్ ఓటింగ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పడిదం బకారెడ్డి హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో ప్రదానోపాధ్యాయుడు మహేందర్ రెడ్డి, సర్పంచ్ ప్రభావతి, ఎంపీటీసీ పద్మ, ఉపసర్పంచ్ బెల్లి రాజయ్య, ఎస్ఎంసీ చైర్మన్ హేమలత, ఉపాధ్యాయులు ఓరుగంటి తిరుపతి, శారద, మమత, నందన, సమ్మయ్య, విద్యార్థులు ఉన్నారు.
సైదాపూర్లో..
సైదాపూర్, నవంబర్ 26: 18 సంవత్సరాలు నిండిన యువతీయువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని లస్మన్నపల్లి సర్పంచ్ కాయిత రాములు పిలుపునిచ్చారు. లస్మన్నపల్లిలో ఓటర్ల నమోదుపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు ప్రత్యేక నమోదు కార్యక్రమం నవంబర్ 26, 27 తేదీలతో పాటు డిసెంబర్ 3, 4 తేదీల్లో నిర్వహిస్తున్నారన్నారు. ఓటు హక్కు నమోదు చేసుకునేవారు బీఎల్వో దగ్గర దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆర్ఐ శరత్, బీఎల్వో స్వరాజ్యం, ఏఎన్ఎం ఇందిర ఉన్నారు.