కార్పొరేషన్, జూలై 30: అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. పద్మశాలీల సంక్షేమం కోసం అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని తెలిపారు. కరీంనగర్లోని పద్మశాలీ కల్యాణ మండపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏసీ డైనింగ్ హాల్ను ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, నియోజకవర్గంలో తాను మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచేందుకు పద్మశాలీలు ఎంతో మద్దతుగా నిలిచారన్నారు. అందుకే నగరంలో చేపట్టిన వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో అమ్మవారికి సారె సమర్పించే అవకాశం ఎప్పటికీ పద్మశాలీలదేనన్నారు. అంతే కాకుండా టీటీడీ ఆలయ శంకుస్థాపన సమయంలోనూ పద్మశాలీలకు పెద్దపీట వేశామన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 70 సంవత్సరాల్లో బీసీలు వెనకి నెట్టి వేయబడ్డారని పేర్కొన్నారు. గత పాలకులకు వెనుకబడిన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యనందించాలనే మనస్సు రాలేదని విమర్శించారు.
కానీ, స్వరాష్ట్రంలో బీసీ బిడ్డలను గొప్పగా చదివించేందుకు సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున గురుకులాలను ఏర్పాటు చేశారని తెలిపారు. వీటిలో లక్షల సంఖ్యలో బీసీ విద్యార్థులు చదువుకుంటున్నారని, ప్రతి విద్యార్థిపై లక్షకు పైగా వ్యయం చేసి నాణ్యమైన విద్యనందిస్తున్నామని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కరీంనగర్ ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోవాలన్నారు. గత 10 సంవత్సరాల్లో కరీంనగర్ రూపురేఖలు మార్చామని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. పద్మశాలీ హాస్టల్ భవన నిర్మాణానికి రూ. 40 లక్షలు విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పద్మశాలీల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. మరోసారి తనను ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ యాదగిరి సునీల్రావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, కార్పొరేటర్ లెక్కల స్వప్న-వేణు, పద్మశాలీ సంఘం అధ్యక్షుడు స్వర్గం మల్లేశం, గౌరవాధ్యక్షుడు దూడం లక్ష్మీరాజం, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎలగందుల సత్యనారాయణ, నాయకులు మెతుకు సత్యం, వాసాల రమేశ్, వొడ్నాల రాజు, రాధ, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.