MLA Medipalli Satyam | గంగాధర, ఫిబ్రవరి 3 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలంలోని బూరుగుపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధి హామీ నిధులు రూ.8 లక్షలతో నిర్మించిన మరుగుదొడ్లు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం సహకారంతో పాఠశాలలో ఏర్పాటుచేసిన లైబ్రరీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ విద్యార్థుల కోరిక మేరకు పాఠశాలలో డైనింగ్ హాల్, తరగతి గదుల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మాలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. చొప్పదండి నియోజకవర్గంలోని కొత్త పాఠశాలల అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు.
బూరుగుపల్లి ప్రభుత్వ పాఠశాలలో లైబ్రరీ ఏర్పాటుకు సహకరించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశంను ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, స్థానిక సర్పంచ్ దూలం కల్యాణ్, తహసీల్దార్ అంబటి రజిత, ఎంపీడీవో దామ్ రాము, మండల సర్పంచ్లు సంఘం అధ్యక్షుడు ముద్దం నగేష్, ఉప సర్పంచ్ తిరుపతి, సాగి అజయ్ రావు, దూలం శ్రీనివాస్, దూలం అంజయ్య, బుర్గు గంగన్న, నాయకులు పాల్గొన్నారు.