కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొదటిరోజు లాక్డౌన్ విజయవంతమైంది. బుధవారం ఉదయం 10 గంటలకు లాక్డౌన్ అమల్లోకి రాగానే ప్రధాన రహదారులతో పాటు అన్ని వీధుల్లో జనసంచారం బంద్ అయింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో రోడ్లన్నీ నిర్జనంగా కనిపించాయి.
కొవిడ్ -19 కేసుల పెరుగుదల నేపథ్యంలో బుధవారం నుండి 10 రోజుల పాటు ప్రభుత్వం రాష్ట్రంలో లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అన్ని వ్యాపార కార్యకలాపాలు ప్రతి రోజు ఉదయం 6 నుండి 10 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతించబడ్డాయి. కూరగాయలు, కిరాణా సామాగ్రి, ఇతర నిత్యావసర వస్తువుల కొనుగోలుకు ప్రజలు ఈ సమయంలో బయటకు రావొచ్చు.
లాక్డౌన్ అమలు పర్యవేక్షణ కోసం కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు డ్రోన్ కెమెరాలను మోహరించారు. గత ఏడాది మాదిరి మొబైల్ కమాండ్ కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసేందుకు పోలీసులు యోచిస్తున్నారు. పరిస్థితిని పర్యవేక్షించడానికి, ప్రజల కదలికలను నిరోదించేందుకు కొన్ని ముఖ్యమైన ప్రదేశాలలో పోలీసు సిబ్బందిని మోహరించారు.