కోరుట్ల రూరల్, నవంబర్ 19: “అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని చెబుతున్న ప్రతిపక్షాల మాటలు నమ్మితే నిండా మునుగుతం. వారితో అయ్యేది లేదు.. పోయేది లేదు. వ్యవసాయానికి కాంగ్రెస్ మూడు గంటల కరెంటే ఇస్తా అంటున్నది. అది సరిపోతదా..? ఒకసారి రైతులు ఆలోచించాలి. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చే బీఆర్ఎస్ కావాలా..? మూడు గంటలు ఇచ్చే కాంగ్రెస్ కావాలా..? నిర్ణయం తీసుకోవాలని’ కోరుట్ల అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సూచించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో రాష్ర్టాన్ని ముందంజలో నిలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్పై విమర్శించే ప్రతిపక్షాలు ముందు అభివృద్ధి అంటే ఏంటో తెలుసుకోవాలని, మీ పాలనలో ఏ ఒక్క పనైనా చేస్తే తెలిసేదని ఎద్దేవా చేశారు. ఇలాంటి మాటలు మాట్లాడే వారిని నమ్మితే మోసపోతామన్నారు. ఆదివారం కోరుట్ల మండలం యూసుఫ్నగర్, ధర్మారం, తిమ్మాయిపల్లి, అయిలాపూర్ అనుబంధ గ్రామమైన కిషన్రావుపల్లె, నాగులపేట, సంగెం, చిన్నమెట్పల్లి, కల్లూరు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించగా, బీఆర్ఎస్ శ్రేణులు, మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డాక్టర్ సంజయ్ మాట్లాడారు.
బీజేపీ నాయకుడు ఎంపీగా గెలిచిన ఐదేండ్లలో నియోజకవర్గానికి చేసిందేమీలేదని, కులాల, మతాల పేరుతో గ్రామాల్లో చిచ్చుపెడుతున్నారే తప్పా ఒక్కసారై మీ గ్రామానికి వచ్చారా..? అని ప్రజలను ప్రశ్నించారు. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ర్టానికి చేసిందేమీలేదని, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంతో ప్రగతి సాధించినట్లు చెప్పారు. రైతులను ఏనాడు పట్టించుకోని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు ఓట్ల కోసం మీ ముందుకు వస్తున్నారో.. నిలదీయాలని గ్రామస్తులకు సూచించారు. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా తెలంగాణను అన్ని రంగాల్లో తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాల్సిన అవసరముందన్నారు.
సమైక్య పాలనలో కరెంటు కోతలతో ఇబ్బందులు పడి, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక 24 గంటల ఉచిత విద్యుత్తో మూడు పంటలను పండించుకుంటున్న రైతులు ఆలోచించాలన్నారు. అప్పటి పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులను గమనించాలని సూచించారు. ‘ సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో నేను మీ ముందుకు వచ్చానని, ‘మీ బిడ్డగా ఆశీర్వదించితే. మీ బిడ్డల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసి అండగా నిలుస్తానన్నారు. కోరుట్ల నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధిలో ముందుంచామని, తన తండ్రిని ఆదరించినట్లుగానే తననూ ఆదరించి కారు గుర్తుకు ఓటేసి బారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇక్కడ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, ఎంపీపీ తోట నారాయణ, జడ్పీటీసీ దారిశెట్టి లావణ్య, వైస్ఎంపీపీ చీటి స్వరూప, ఆర్బీఎస్ జిల్లా అధ్యక్షుడు చీటి వెంకట్రావ్, మున్సిపల్ అధ్యక్షురాలు అన్నం లావణ్య, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు.