మెట్పల్లి/ మారుతీనగర్, నవంబర్10: ‘కాంగ్రెస్, బీజేపీలు ఫేక్ హామీలిస్తున్నయి. వాళ్లతో ఏదీ కాదు. రాష్ర్టాన్ని, దేశాన్ని ఏండ్లకేండ్లు పాలించిన కాంగ్రెస్, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేసిందేమైనా ఉందా..? ప్రజలను గోసపెట్టుడు. నిండా ముంచుడు తప్ప ఏదీ చేతకాదు. ‘అది చేస్తాం.. అది చేస్తాం’ అని దొంగ హామీలు, గ్యారెంటీలు ఇస్తూ మోసం చేస్తున్నారు.. దేశంలోని వారి పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి పథకాలు ఏ ఒక్కటీ అమలు చేయనోళ్లు.. ఇక్కడ చేస్తరా..? ఒకసారి ఆలోచించాలి. మన బతుకులు ఆగం చేసేందుకే వాళ్లు వస్తున్నరని, జాగ్రత్తగా ఉండాలని’ కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సూచించారు.
శుక్రవారం దివ్యాంగుల సంస్థల అధ్యక్షుడు వాసుదేవరెడ్డితో కలిసి మెట్పల్లి పట్టణంలోని వెంకట్రెడ్డి గార్డెన్లో నిర్వహించిన కోరుట్ల నియోజకవర్గ దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ దివ్యాంగులకు అందజేస్తున్న పలు సంక్షేమ పథకాలను వివరించారు. మరోసారి కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ ముఖ్యమంత్రిగా భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలకు మోసపోవద్దని దివ్యాంగుల సంక్షేమానికి పాటుపడుతున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించి అండగా నిలువాలన్నారు. కోరుట్ల ఎమ్మెల్యేగా తనను ఆశీర్వదించి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. అంతకు ముందు డాక్టర్ సంజయ్తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు వాసుదేవరెడ్డిలను దివ్యాంగులు శాలువాలతో ఘనంగా సత్కరించారు.
అనంతరం సంజయ్ కల్వకుంట్ల మెట్పల్లి పట్టణంలోని మున్నూరు కాపు, పట్కరి, వంజరి, బంటుపేట మాల తదితర సంఘాల సభ్యులను నేరుగా కలిశారు. ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. గడిచిన తొమ్మిదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ, మేలు చేసే ప్రభుత్వానికి అండగా నిలువాలని, తన తండ్రి ఎమ్మెల్యే విద్యాసాగర్రావుపై చూపిన ఆదరణను తనపై కూడా చూపించాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా దివ్యాంగుల అధ్యక్షుడు మాదాసు ప్రవీణ్, కోరుట్ల డివిజన్ అధ్యక్షుడు జంబుక రాజయ్య, ఉపాధ్యక్షుడు లక్ష్మినర్సయ్యగౌడ్, కోరుట్ల అధ్యక్షుడు మనోజ్, శంకర్, రాజు, శ్రీను, నిజం రాజేశ్, కోరుట్ల నియోజకవర్గ నేత ఒజ్జెల శ్రీనివాస్, కౌన్సిలర్లు ఉన్నారు.