మెట్పల్లి రూరల్, నవంబర్ 15: ‘గతంలో రాష్ర్టాన్ని ఎన్నో పార్టీలు పాలించినా చేసింది శూన్యం. ప్రజలను గోసపెట్టినయి. కనీస అవసరాలు కూడా తీర్చలేదు. కానీ 65 ఏండ్లలో జరుగని అభివృద్ధి, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో కేవలం తొమ్మిదేళ్లలో జరిగింది. ఇవన్నీ మీ కండ్ల ముందే కనిపిస్తున్నాయని’ కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పేర్కొన్నారు. బుధవారం మెట్పల్లి మండలం జగ్గసాగర్, రామలచ్చక్కపేట, ఆత్మనగర్, ఆత్మకూర్, పాటిమీది తండా, ఏఎస్సార్ తండా, రంగారావుపేట, కేసీఆర్ తండా, మెట్లచిట్టాపూర్, విట్టంపేట గ్రామాల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే విద్యాసాగర్రావుతో కలిసి ఎన్నికల ప్రచారం చేయగా, ఆయా గ్రామాల్లో సంజయ్కు మహిళలు, రైతులు, యువకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన సమావేశాల్లో డా. సంజయ్ ప్రసంగించారు. స్వాతంత్య్రం వచ్చిన నుంచి రైతుబంధు, 24 గంటల విద్యుత్ ఇవ్వాలన్న ఆలోచన ఏ ప్రభుత్వానికి రాలేదని, అది సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమైందని చెప్పారు.
నాడు వరదకాలువ ఎండిపోయి యువకులు క్రికెట్ ఆడుకున్నారని, నేడు అది జీవనదిలా మారిందని పేర్కొన్నారు. దీంతో గ్రామాల్లోని చెరువులన్నీ నిండుకుండలా మారి, 365 రోజులు నీటితో కళకళలాడుతున్నాయని చెప్పారు. ఆసరా పింఛన్లతో ముసలవ్వల ముఖాల్లో నేడు నవ్వులు విరబూస్తున్నాయని, వారు ఎవరి వద్ద చేయి చాపాల్సిన అవసరం లేకుండా ఉందన్నారు. దేశంలో బీడీ కార్మికులకు పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు. అలాగే గతంలో నీళ్లు మోసి మహిళల జబ్బలు వంగిపోయేవని, ఇప్పుడు ఇంటి వద్దకే మంచినీరు వస్తుందన్నారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 2014 పీఎఫ్ కటాఫ్ను ఎత్తివేసి ప్రతి ఒక్క బీడీ కార్మికురాలికి పింఛను ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అలాగే విడతల వారీగా ఆసరా పింఛన్లను రూ. 5,016కు, వికలాంగ పింఛన్లను రూ.6,016కు పెంచుతామని, రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేపడుతామని, రైతుబీమా తరహాలో తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి రూ.
ఐదు లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని వివరించారు. ‘మేము చేసినవి.. చేయబోవి చెబుతున్నాం. ప్రతిపక్షాలు కేవలం ఓట్లు మాత్రమే అడుక్కోవడానికి వస్తున్నాయి. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని’ సూచించారు. ఎన్నికలు రాగానే ప్రజలు ఆగం కావద్దని సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులెవరూ స్థానికులు కాదని, తాను మెట్పల్లి బిడ్డనని తెలిపారు. ‘మీ బిడ్డ కావాలా.. పరాయి బిడ్డ కావాలా’ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. కారు గుర్తుకు ఓటేసి తనను ఆశీర్వదించాలని అభ్యర్థించారు. కాగా, జగ్గసాగర్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 50 మంది యువకులు, మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన మేర సంఘం సభ్యులు బీఆర్ఎస్లో చేరగా, వారికి డా. సంజయ్, ఎమ్మెల్యే విద్యాసాగర్రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ మారు సాయిరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నల్ల తిరుపతిరెడ్డి, రైతు సమన్వయ సమతి మండలాధ్యక్షుడు గడ్డం రాంరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, సహకార సంఘాల అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.