చలి పులి భయపెడుతున్నది. రోజురోజుకూ తీవ్రత పెరుగుతున్నది. రాత్రి ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతుండగా, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం కనిపిస్తున్నది. ముఖ్యంగా గుండెపోట్ల ముప్పు పొంచి ఉన్నది. అస్తమా వ్యాధిగ్రస్తులతోపాటు చిన్న పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపైనా తీవ్రత ఉండనున్నది. ఇది ప్రతి ఒక్కరిలోనూ ఆందోళన కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా చలి కాలంలో గుండె వ్యాధులు అధికంగా వస్తాయని, చల్ల గాలికి అసలు తిరగొద్దని, గుండె జబ్బులు, ఆస్తమా వ్యాధిగ్రస్తులు తప్పని సరిగా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
– కరీంనగర్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్
కరీంనగర్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్ : చలి ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్నది. ఇప్పటికే పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. గతేడాదితో పోలిస్తే తీవ్రత అధికంగా కనిపిస్తున్నది. నిరుడు డిసెంబర్ 11న గరిష్ఠం 28.0, కనిష్ఠం 21 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ యేడాది ఇదే రోజు పగటి ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలే ఉండగా, రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం 17కు పడిపోయాయి. అంటే 4 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు కనిపిస్తున్నాయి.
దీనికి తోడు ఉత్తరాది నుంచి శీతల పవనాలు వీస్తుండడం, గాలిలో తేమ శాతం పెరగడంతో చలి తీవ్రత ఎక్కువగా ఉన్నది. నానాటికీ పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు చలి తీవ్రతను మరింత పెంచేలా కనిపిస్తున్నాయి. ఇదే నెలలో 14 నుంచి 12 అంతకంటే తక్కువ డిగ్రీలకు రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయే ప్రమాదమున్నది. ఎండ లేక పొద్దంతా చలి ఉంటున్నది. ఈ నేపథ్యంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదం ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. తగిన జాగ్రత్తలు పాటించకుంటే ప్రాణాల మీదకు వస్తుందని హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా చలి కాలంలో గుండె వ్యాధులు అధికంగా వస్తాయి. శరీరాన్ని వేడిగా ఉంచేందుకు గుండెపై అధిక భారం పడుతుంది. గుండె పోటు అనేది గుండెకు రక్తం అందకపోయినా, ఆటంకం ఏర్పడినా వస్తుందని వైద్యులు చెబుతున్నారు. గుండె ధమనుల్లోంచి ఒకదానిలో ఇబ్బంది ఉన్నా, ధమనుల్లో కొవ్వు, ప్లాక్ పేరుకుపోయినా రక్త వాహికలు బ్లాక్ అవుతుంటాయని, ఫలితంగా ఏర్పడిన బ్లడ్ క్లాట్తో గుండె పోట్లు వస్తాయని సూచిస్తున్నారు. చలికాలం చాలా మంది పని తగ్గించడం వల్ల స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్, కార్డియోవాస్క్యులర్ ఇబ్బందులు, ఎరిథిమిమో వంటి సమస్యలు వస్తున్నాయని చెబుతున్న వైద్యులు ఇలాంటి పరిస్థితుల్లో గుండెను సంరక్షించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెబుతున్నారు.
చలి కాలం శరీరాన్ని సాధ్యమైనంత వరకు వేడిగా ఉంచాలని, గుండె పదిలంగా ఉండేందుకు ఇది మంచి పద్ధతని, ఫిజికల్ ఆక్టివిటీస్ ఎక్కువగా ఉంటే మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవాలని, నీళ్లు ఎక్కువగా తాగాలని, దీంతో శరీరం హైడ్రేట్గా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. గుండెపోటు లక్షణాలపై శ్రద్ధ పెట్టాలని, ఎప్పటికప్పుడు గుండె పరీక్షలు చేయించుకుంటే మంచిదని అంటున్నారు. గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వారు చలి గాలికి తిరగవద్దని హెచ్చరిస్తున్నారు.
చలి గాలికి ఎక్కువగా తిరగొద్దు. శీతల పానీయాలు తీసుకోవద్దు. మాంసాహారం తీసుకోకుండా ఉంటే మంచిది. గుండె వ్యాధి గ్రస్తులు చలి తీవ్రత లేనప్పుడు, ఎండ వచ్చిన తర్వాతనే ఇండ్ల నుంచి బయటికి రావాలి. కాళ్ల వాపులు ఉన్న వారు చలిలో తిరిగితే ఈ వ్యాధి మరింత ముదిరే అవకాశం ఉంటుంది. వ్యాయామాలు ఎక్కువ సేపు చేయకూడదు. మధ్య మధ్యలో విరామం ఇవ్వడం మంచిది.
– కిరణ్ కొండపాక, కార్డియాలజిస్ట్
చలి కాలంలో దీర్ఘకాల వ్యాధులు ఉన్న వాళ్లు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మునుపటి కంటే ఈసారి చలి తీవ్రత ఎక్కువగా ఉంది. బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. చలి తీవ్రత ఇతర జబ్బులు ఉన్న వారిపైనా ప్రభావం చూపుతుంది. శరీరాన్ని ఎప్పటికీ వెచ్చగా ఉండేలా ఉన్ని దుస్తులు ధరించాలి. శరీరం చల్లబడకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఇంట్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు వాడకూడదు. చల్లని పానీయాలు తీసుకోకూడదు. అస్తమా ఉన్న వాళ్లు పొగ తాగకూడదు. పొగ తాగే వారి వద్ద ఉండకూడదు. వ్యాయామం ఎక్కువగా చేయకూడదు. జాగ్రతలు తీసుకుంటేనే చలి కాలంలో ప్రాణాంతక వ్యాధుల నుంచి బయటపడగలం.
– డాక్టర్ నవీన, ఫిజీషియన్ (కరీంనగర్ ప్రభుత్వ దవాఖాన)
చలి ప్రభావం ఎక్కువగా చిన్న పిల్లలు, వృద్ధులు, ఆస్తమా వ్యాధి గ్రస్తులపై ప్రభావం చూపుతుంది. వీళ్లు చలికి ఎంత తక్కువ తిరిగితే అంత మంచిదని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు.