వచ్చే నెల 15లోగా పనులు ప్రారంభించాలి
ఈ నెలాఖరులోగా టెండర్లు పిలువాలి అప్రోచ్ రోడ్డు పనులను కూడా పూర్తి చేయాలి
మానేరు రివర్ఫ్రంట్ కరీంనగర్కు మణిహారంగా నిలుస్తుంది
జూన్ మొదటి వారంలో సీఎం చేతుల మీదుగా కేబుల్ బ్రిడ్జిని ప్రారంభిస్తాం
రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్
సుందర నగరంగా కరీంనగర్
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్
నగర అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం
కార్పొరేషన్, ఫిబ్రవరి 11 : స్మార్ట్సిటీ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులను వచ్చే నెల 15లోగా ప్రారంభించాలని, ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చూపవద్దని అధికారులను రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్మార్ట్సిటీ, నగరపాలక సంస్థ అభివృద్ధి పనులు, కేబుల్ బ్రిడ్జి, మానేర్ రివర్ ఫ్రంట్ పనులపై శుక్రవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ చేసిన కృషితోనే కరీంనగర్కు స్మార్ట్సిటీ హోదా వచ్చిందని చెప్పారు. స్మార్ట్సిటీ పనులన్నింటినీ మార్చి 15లోగా క్ష్రేత్రస్థాయిలో ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. చేపట్టే పనులకు సంబంధించిన డీపీఆర్లను త్వరగా సమర్పించి, ఈ నెలాఖరులోగా టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలని సూచించారు. నగరం నలువైపులా నాలుగు కొత్త సమీకృత మారెట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మార్కెట్ రోడ్డు సమీపంలోని ఆర్అండ్బీ శాఖ కార్యాలయం, టీబీ దవాఖాన స్థలాన్ని పారింగ్కు వినియోగించాలని సూచించారు. నగరంలోని ప్రధాన రోడ్ల వెంట ఫుట్పాత్లను ఆక్రమించకుండా కట్టడి చేయాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్కు సూచించారు.
మానేరు జలాశయం కిందిభాగంలో మొదటి దశలో సుమారు ఏడు కిలోమీటర్ల మేర మానేరు రివర్ ఫ్రంట్ పనులు చేపడతామని చెప్పారు. అందుకు గాను నీటిపారుదల శాఖ నుంచి రూ. 310 కోట్లు, పర్యాటక శాఖ నుంచి రూ. 100 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు కరీంనగర్ జిల్లాకు మణిహారంగా నిలుస్తుందన్నారు. కేబుల్ బ్రిడ్జిని జూన్ మొదటి వారంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. కేబుల్ బ్రిడ్జికి రెండు వైపులా అప్రోచ్ రోడ్డు పనులను వచ్చే మే 15 నాటికి పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. గణేశ్నగర్ బైపాస్ రోడ్డు, ఎలగందుల పాత రోడ్డు పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఎస్సారార్ కళాశాలలో నిర్మించనున్న ఆడిటోరియం పనులను వేగవంతం చేయాలన్నారు. నగరంలో డంప్ యార్డును మరో చోటుకు తరలించాలని, అందుకు కావాల్సిన ఆరు ఎకరాల స్థలాన్ని అప్పగించాలని జిల్లా కలెక్టర్కు సూచించారు. డంప్ యార్డును ట్రీట్మెంట్ ప్లాంట్గా పిలువాలని, నగరపాలక సంస్థ ప్రతిరోజూ సేకరించే 150 మెట్రిక్ టన్నుల చెత్తను బయో మైనింగ్ చేయాలన్నారు. కరీంనగర్ నుంచి కామారెడ్డి బీటీ రోడ్డు పనులతోపాటు ఎలగందల్ బీటీ రోడ్ల పనులను త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
సుందర నగరంగా కరీంనగర్ : వినోద్
కరీంనగర్ అతి త్వరలోనే అత్యంత సుందర నగరంగా మారుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ అన్నారు. నగరంలో ఇప్పటికే రోడ్లు అభివృద్ధి చెందాయని, పార్కుల సుందరీకరణ పనులు కూడా వేగవంతం చేస్తున్నామని తెలిపారు. నగరం నడిబొడ్డున ఉన్న మల్టీపర్పస్ హైసూల్ను హెరిటేజ్ భవనంగా మార్చాలని సూచించారు. అందులో లైబ్రరీ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకొని నగరంలో మరింత వేగంగా అభివృద్ధి చేయాలన్నారు. ముఖ్యంగా స్మార్ట్సిటీ కింద చేపడుతున్న అభివృద్ధి పనులను పెండింగ్లో పెట్టవద్దన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోగానే మంజూరైన పనులన్నింటినీ ప్రారంభించాలన్నారు. నగరాభివృద్ధికి ఇంకా నిధులు మంజూరు చేయించేందుకు తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఒకసారి వేసిన రోడ్లను తవ్వి పాడుచేయకుండా చూడాలని, రోడ్లను తవ్వి పాడు చేసే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా గ్రంథాలయాన్ని డిజిటల్ లైబ్రరీలుగా తీర్చిదిద్ది పాఠకులకు అన్ని పుస్తకాలకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. టవర్సరిల్ ఆధునీకరణ పనులు, స్మార్ట్రోడ్ల పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. కరీంనగర్ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని తెలిపారు. ఈ సమావేశంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మేయర్ వై సునీల్రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి హరిశంకర్, నగరపాలక సంస్థ కమిషనర్ సేవ ఇస్లావత్, నీటిపారుదల శాఖ, ఆర్అండ్బీ శాఖ ఎస్ఈలు, ఈఈలు, మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు, విద్యుత్ శాఖ ఎస్ఈ, పోలీస్ అధికారులు, స్మార్ట్సిటీ ఏజెన్సీ ప్రతినిధులు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.