తిమ్మాపూర్, ఏప్రిల్ 20 : రైతులకు న్యాయ సేవలందించేందుకే అగ్రి లీగల్ ఎయిడ్ క్లీనిక్ను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ పేర్కొన్నారు. వీటిని భూ సమస్యలు, వ్యవసాయరంగ సమస్యలు ఎదురొంటున్న పేద రైతులు, వ్యవసాయ కూలీలకు న్యాయ సహాయం కోసం ప్రారంభించామన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సుజయ్తో కలిసి గురువారం ఆమె గన్నేరువరంలోని రైతు వేదికలో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ను ప్రారంభించి మాట్లాడారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు గుర్తించిన గ్రామాల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ క్లీనిక్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతు విత్తనం వేసే మొదలు నీటి సౌకర్యం లేక, కూలీలు దొరకక అనేక ఇబ్బందులు ఎదురొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు బీమా పరిహారం నామమాత్రంగా ఉండడంతో ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. తమది రైతు కుటుంబం అని, ఖాళీ సమయాల్లో కుటుంబంతోపాటు వ్యవసాయ పనులకు సమయాన్ని కేటాయిస్తానని తెలిపారు.
ప్రకృతి సిద్ధమైన ఎరువుల తయారీ కోసం పశువుల పెంపకాన్ని గ్రామాల్లో ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వం ధరణి పోర్టల్ను ప్రారంభించే ముందు పది సంవత్సరాల క్రితమే ఒక చిన్న గ్రామంలో పైలెట్ ప్రాజెక్టుగా మొదలుపెట్టి అమలు చేశారన్నారు. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత అనేక భూసమస్యలు పరిష్కారయ్యాయని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి వచ్చిన అనేక సమస్యలను చట్టబద్ధంగా పరిషరించినట్లు తెలిపారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటే మనిషి మనుగడకే ప్రమాదమని, రైతు క్షేమమే దేశ క్షేమమని ఆమె కొనియాడారు. పారిశుధ్యంలో జాతీయ పురసారాన్ని అందుకున్న గన్నేరువరం గ్రామ పంచాయతీ పాలకవర్గానికి, గ్రామస్తులకు అభినందనలు తెలిపారు. అంతకుముందు ఖాసీంపేట మానసాదేవి ఆలయం, పారువెల్ల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ ప్రధాన అర్చకులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమకు పూర్ణకుంభ స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు చేశారు. జూనియర్ సివిల్ జడ్జి శ్రీనిజ కొన్హిర్కర్, జిల్లా వ్యవసాయాధికారి వాసిరెడ్డి శ్రీధర్, ఆర్బీఎస్ జిల్లా కో-ఆర్డినేటర్ గూడెల్లి తిరుపతి, సర్పంచ్ పుల్లెల లక్ష్మి, కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లింగంపల్లి నాగరాజు, మండల సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు, రైతు కూలీలు పాల్గొన్నారు.