Vote | కరీంనగర్ కలెక్టరేట్, అక్టోబర్ 20 : త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఓటు వేయాల్సిన పోలింగ్ కేంద్రం వివరాలు తెలుసుకునేందుకు ఓటరు సహాయ మిత్రను వినియోగించుకోవచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఉన్న ఈ యాప్తోపాటు ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా కూడా తెలుసుకునే అవకాశమున్నది. పోలింగ్ కేంద్రాలకు వెళ్లే ముందే ఓటర్లు తాము ఓటు వేయాల్సిన బూత్ ఎక్కడుందో సమగ్రంగా తెల్సుకోవాలి. ఈసారి కుటుంబాల వారీగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో గతంలో మాదిరి కాకుండా, కుటుంబంలో ఓటు హక్కు కలిగి ఉన్న వారందరికీ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఓటర్ల పీసీలు మారనున్న దృష్ట్యా, ముందుగానే వివరాలు తెలుసుకోవడం మూలం గా ఇబ్బందులు తప్పనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. అలాగే, నవంబర్ 10 వరకు నామినేషన్ల పర్వం ముగియనుండగా, ఆ మరుసటి రోజు నుంచి ఓటర్లకు పోలింగ్ స్పిప్పు లు పంపిణీ చేయనున్నట్లు వెల్లడిస్తున్నారు.
గతం లో ఎదుర్కొన్న అనుభవాల నేపథ్యంలో ఈసారి ఎలాంటి సమస్యలకు ఆస్కారం లేకుండా ఓటర్లు పోలింగ్లో పాల్గొనేలా ప్రోత్సహించే క్రమంలో, ఇరవై రోజుల ముందుగానే పోలింగ్ స్లిప్పులు పం పిణీ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించినట్లు జిల్లా యంత్రాంగం పేర్కొంటున్నది. వాస్తవానికి ఎన్నికల సంఘం ద్వారా మాత్రమే పోలిం గ్ స్లిప్పులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. అయితే, ఓటర్లను ఆకర్షించే క్రమంలో బరిలో నిలిచిన అభ్యర్థులు కూడా ఓటర్లకు పోలింగ్ స్లిప్పులు పంపిణీ చేస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం అటు అభ్యర్థులు, ఇటు ఎన్నికల సంఘం కూడా పో లింగ్ స్లిప్పులు సక్రమంగా పంపిణీ చేయకపోవడంతో, తమ ఓటు ఎక్కడుందో తెల్సుకునేందుకు ఓటర్లు నానా అగచాట్లు పడాల్సి వచ్చింది. దీంతో, కొంతమంది ఓట్లు వేయకుండానే వెనుక్కు తిరిగిపోగా, మరికొంత మంది అలాగే, వేచి చూస్తుండడంతో పోలింగ్ సమయం ముగిసిన అనంతరం కూడా అనేకచోట్ల ఓట్లు వేశారు. వీటిని దృష్టిలో పెట్టుకున్న ఎన్నికల సంఘం ఈసారి నిర్ధిష్ట సమయంలోనే వందశాతం పోలింగ్ పూర్తి చేసేందుకు ప్రణాళినబద్ధంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే ప్రతి ఓటరుకు పక్కాగా పోలింగ్ స్లిప్పు అందేలా ముందస్తుగానే చర్యలు చేపట్టింది.