దశాబ్దాలుగా పేదరికంలో మగ్గుతున్న జీవితాల్లో వెలుగులు నింపాలన్న సీఎం కేసీఆర్ తెచ్చిన దళిత బస్తీ పథకం ఆ కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. నాడు అడ్డా కూలీలుగా పని చేసిన వారు మూడెకరాల భూపంపిణీతో రైతులుగా మారారు. తీరొక్క పంటలు సాగు చేస్తూ వారు ఉపాధి పొందడమే కాకుండా మరో పది మందికి ఉపాధి కల్పిస్తూ దర్జాగా బతుకుతున్నారు. రైతు కావాలన్న తమ కోరిక తీర్చిన దేవుడు, తమను సమాజంలో తలెత్తుకొనేలా చేసిన పెద్దన్న కేసీఆర్ అంటూ కృతజ్ఞతలు చెబుతున్నారు.
– రాజన్న సిరిసిల్ల, మార్చి 9 (నమస్తే తెలంగాణ)
ఇది ఒక స్వామే కాదు, వందలాది మంది లబ్ధిదారులు చెబుతున్న మాట ఇదే. నాడు ఇంచు భూమి లేని నిరుపేద దళితులు, సర్కారు ఇచ్చిన మూడెకరాల భూమితో చిన్నకారు రైతులుగా మారారు. రైతుబంధు కూడా వస్తుండడంతో సంబురంగా సాగు చేసుకుంటున్నారు. ఒకప్పుడు కూలీలుగా బతుకులీడ్చిన వారంతా నేడు పంటలు సాగు చేస్తూ పదిమందికి పనికల్పించే స్థాయికి ఎదిగారు.
నాడు సమైక్య పాలనలో దళితులను ఎవరూ పట్టించుకోలేదు. వారి సంక్షేమంపైనా దృష్టి పెట్టలేదు. ఫలితంగా దశాబ్దాలుగా అంధకారంలో బతకాల్సి వచ్చింది. పొట్ట కూటి కోసం ఎంతో మందికి వలసబాటే దిక్కయింది. కానీ, స్వరాష్ట్రంలో రాష్ట్ర సర్కారు చేయూతనిచ్చింది. కూలీ బతుకులకు భరోసానిచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టితో ఆర్థిక ప్రగతికి బాటలు పడగా, భూమిలేని దళితులకు ‘దళిత బస్తీ’ కింద మూడెకరాలు ఇవ్వడంతో ఎంతో మంది కూలీలు నేడు రైతులుగా మారారు. మంత్రి కేటీఆర్ చొరవతో కోనరావుపేట మండలం ధర్మారంలో 36 కుటుంబాలకు భూమిని అందించారు. ఇలా ఒక్కో గ్రామంలో 25 మంది లబ్ధిదారులకు భూపంపిణీ చేశారు. మొత్తంగా 2014-15 సంవత్సరం నుంచి 2019 వరకు దశల వారీగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 165 మంది లబ్ధిదారులకు 436.2 ఎకరాల భూమిని అందించారు. ప్రభుత్వం 21కోట్ల 67లక్షల 32వేలు వెచ్చించి పట్టాదారుల నుంచి భూమి కొని ఇవ్వడంతో నేడు సొంతంగా వ్యవసాయం చేసుకుంటూ ధీమాగా బతుకుతున్నారు. నాడు మస్కట్, దుబాయి లాంటి దేశాలకు వలస వెళ్లిన వారంతా తిరిగి స్వగ్రామాలకు వచ్చి భార్యా పిల్లలతో కలిసి సర్కారిచ్చిన భూమిలో సాగు చేసుకుంటున్నారు. భూమి పొందిన దళిత మహిళలు వివిధ పంటల సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
మాది కోనరావుపేట సుద్దాల గ్రామం. ఇంటర్ వరకు చదువుకున్న. మా నాయన నర్సయ్య ముంబైలో కూలీ పనిచేస్తుండె. నేను ఐదేళ్లు అక్కడే సెంట్రింగ్ పనిలో చేరిన. అప్పుడు రోజుకూలీ నూటాయాభై రూపాయలే. పండుగలకు ఇంటికచ్చినప్పుడు పొలాలను చూస్తే నాకింత పొలం ఉంటే మంచిగుండు అనుకునేటోన్ని. నేను కూడా రైతునైతే బాగుండు అనిపించేంది. కానీ, కూలీ పనిచేసుకునే నాకు భూమి కొనే తాకతెక్కడిది. ఉద్యమ సమయంల ముంబై నుంచి మా ఊరికొచ్చిన. ఇక్కడే బిల్డింగ్ పనిలో చేరిన. పెళ్లి చేసుకున్న. నా భార్య నేను ఇద్దరం కలిసి చేస్తేగాని పొట్టగడవదు. ఊర్లు తిరుగుతూ కూలీ పనిచేసిన. కానీ, కేసీఆర్ సీఎం అయినంక మా పరిస్థితి మారింది. దళిత బస్తీ పథకం కింద నా భార్య పేరిట మూడెకరాల భూమి అచ్చింది. నాకు సంతోషం ఆగలేదు. ఇది కలా.. నిజమా..? అనుకున్న. మా ఇంట్ల పండుగ చేసుకున్న. రైతు కావాలన్న నా కోరిక తీర్చిన దేవుడు కేసీఆర్ను మనసులోనే మొక్కుకున్న. సిరిసిల్లలో గాంధీ చౌక్లో పెట్టిన కేసీఆర్ ఫ్లెక్సీని తెచ్చుకుని పూజలు చేసిన. అందరికీ స్వీట్లు పంచిన. నాకిచ్చిన రెండకరాల్లో పామాయిల్తోట వేసిన. ఎకరంలో వరి సాగు చేసిన. నాడు కూలీ పనిచేసిన నేను ఇయ్యాల రైతుగా మారి పదిమందికి పని కల్పిస్తున్న. తలెత్తుకుని గౌరవంగా బతుకుతున్న. ఇదంతా కేసీఆర్ దయవల్లనే. మా దళితుల బతుకుల్లో వెలుగులు చూసుకుంటున్నం.
– మల్యాల స్వామి, లక్ష్మి దంపతులు
మా కుటుంబమంతా ఎవుసం కూలీ పనిచేసుకునేటోళ్లమే. ఒకనాడు పనికి పోకుంటే కడుపెండుడే. జరమొచ్చినా, శాతగాకున్నా పనిజెయ్యక తప్పలేదు. మా ఆయన దేవరాజు, నేను కలిసి పొలం పనులకు పోయినం. ఆ పని లేని రోజు అడ్డమీదకు పోయి పొద్దంతా పనిజేత్తే రోజుకు రూ.రెండు వందలే వచ్చినయ్. మోటు పనిచేసుడాయె. నెల రోజుల కూలీ పైసలు రోగాలకే పెట్టినం. ఇంచు జాగ లేని మాకు కేసీఆర్ సారు మూడెకరాలు ఇచ్చిండు. అధికారులు పట్టాలిస్తే ఉత్తవే అనుకున్నం. మాఊర్లనే మంచి జాగ సూపించి సాగు చేసుకోమన్నరు. కూలీనాలీ చేసేటోళ్లం. పంట పెట్టుబడి ఎట్లనుకుని రంది పడ్డం. కానీ, కేసీఆర్ సార్ రైతుబంధు ఇచ్చిండు. ఆ పైసలతో వరి సాగు చేసినం. మంచి పంట వచ్చింది. వడ్ల అమ్మిన పైసలు బాగొచ్చినయ్. ఎన్నడు గిన్ని పైసలు సూడనోళ్లం. మా కూలీల బతుకులు కేసీఆర్ జెయ్యవట్టి మారినయ్. దేవుడు ఎక్కడో లేడు, కేసీఆర్ రూపంలో వచ్చి మాకు దారి సూపిండు. జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటం.
– పూర్సాని లక్ష్మి, దళిత రైతు సుద్దాల (కోనరావుపేట మండలం)