కార్పొరేషన్, ఆగస్టు 11 : వచ్చే ఎన్నికల్లో విపక్షాల మాటలు నమ్మితే తెలంగాణ మళ్లీ అంధకారమే అవుతుందని, సీఎం కేసీఆర్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలో అన్నీ స్కాంలు ఉండేవని, కానీ, బీఆర్ఎస్ హయాంలో సంక్షేమ స్కీంలు మాత్రమే కొనసాగుతున్నాయన్నారు. శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్లోని ఆడిటోరియంలో 125 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు 1,25,14,500 విలువైన చెకులతోపాటు చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రం రాకముందు కరీంనగర్ ఎలా ఉన్నదో..? ఇప్పుడు ఎలా అభివృద్ధి సాధించిందో..? ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వస్తే కరెంటు ఉండదని, హిందూ ముస్లింల గొడవలతో శాంతిభద్రతలు లేకుండా పోతాయని, పరిస్థితులు భయంకరంగా ఉంటాయని నాడు అనేక విమర్శలు చేశారని గుర్తు చేశారు. కానీ, సీఎం కేసీఆర్ పాలనలో శాంత్రిభద్రతలు, అభివృద్ధిలో రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందన్నారు.
కల్యాణలక్ష్మి ఇస్తున్న ఘనత ప్రపంచంలోనే సీఎం కేసీఆర్కు మాత్రమే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో పథకాలు ప్రవేశపెట్టి వాటిల్లో సగం ప్రజలకు పంచి, మిగిలినవి ఆ పార్టీ నాయకులే మింగే వారని విమర్శించారు. ఎన్నికలు వస్తున్నాయని మళ్లీ తమకు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ బీజేపీ, కాంగ్రెస్ వస్తున్నాయని, 50 ఏళ్లు పాలించిన ఈ పార్టీలు తెలంగాణను ఏం అభివృద్ధి చేశాయో చూశామని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ వారిని నమ్మితే ప్రస్తుత సంక్షేమ పథకాలు ఎత్తి వేసి, తెలంగాణను మరోసారి గుడ్డి దీపంగా మారుస్తారని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పాలన అంతా ఢిల్లీ నుంచే నడుస్తుందని, కానీ బీఆర్ఎస్ పాలన హైదరాబాద్ నుంచి నడుస్తుందని, ప్రజలు ఏం కోరుకుంటారో అదే చేస్తున్నట్లు తెలిపారు. గతంలో సంపద పెరిగితే అది కాంగ్రెస్ వారే తినేవారని, కానీ బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో పెరిగిన సంపదను పేదలకు పంచుతున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒకరికీ సొంత ఇల్లు ఉండాలని గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఈనెల 16వ నుంచి మైనార్టీ బంధు, బీసీ కులాలకు చేయూత చెక్కులు పంపిణీ చేస్తామన్నారు.
పేదలకు అండగా సీఎంఆర్ఎఫ్
మెరుగైన వైద్యం కోసం ఇబ్బందులు పడే పేదలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో అండగా నిలుస్తున్నదని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. శుక్రవారం కరీంనగర్లోని తన క్యాంపు కార్యాలయంలో 157 మంది లబ్ధిదారులకు 48.59 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఈ పథకం కింద ఇప్పటికే ఎంతో మందికి వైద్యం అందించినట్లు చెప్పారు. పేదలను ఆదుకోవాలన్న లక్ష్యంతో కేసీఆర్ పెద్ద సంఖ్యలో ఈ పథకం కింద చెక్కులను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మేయర్ యాదగిరి సునీల్రావు, ఆర్డీవో మహేశ్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, కరీంనగర్ రూరల్ ఎంపీపీ లక్ష్మయ్య, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ, గంట కళ్యాణి, గందె మాధవి, మాజీ డిప్యూటీ మేయర్ షమీ, బీఆర్ఎస్ నాయకులు శ్యాంసుందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.