Dharmaram Lions Club | ధర్మారం,మే 19 : ధర్మారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు మంగళవారం మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. తీవ్రమైన ఎండ తీవ్రత లోనూ ధర్మారం గ్రామ శివారులో సుమారు 200 ఉపాధి కూలీలు పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో కూలీల శ్రమను గమనించిన లయన్స్ క్లబ్ సభ్యులు వారికి మజ్జిగ పంపిణీ చేయాలని సంకల్పించారు. దీంతో క్లబ్ సభ్యులు పని ప్రదేశానికి వెళ్లి సుమారు 200 మందికి మజ్జిగ (చల్ల) ప్యాకెట్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కూలీలు క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు ఇప్ప మల్లేష్, రీజియన్ చైర్ పర్సన్ కామని శ్రీనివాస్, సెక్రెటరీ బూతగడ్డ రవి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చింతపండు నర్సింగం, ఫీల్డ్ అసిస్టెంట్ గుర్రం సతీష్ తదితరులు పాల్గొన్నారు.