తెలంగాణ వస్తే చీకట్లో మగ్గాల్సి వస్తుందని నాడు ఆంధ్రా పాలకులు వెక్కిరించారు.. కానీ, సీఎం కేసీఆర్ పాలనాదక్షతతో నిరంతర కరెంట్ తెచ్చి కష్టాలను దూరం చేశారు” అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. ఉద్యమ సమయంలో గ్రామాల్లో గులాబీ కండువా కప్పుకొని వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఉండేదని, కానీ, ఇప్పుడు ఎక్కడికి వచ్చామో కార్యకర్తలు గుర్తుచేసుకోవాలని కోరారు. తిమ్మాపూర్ మండలం అల్గునూర్లో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో కలిసి పాల్గొన్నారు. యాదాద్రి పవర్ప్లాంట్ ద్వారా 25 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తే పవర్కట్ ఉండదని చెప్పారు.
తిమ్మాపూర్, జూలై 16: ‘తెలంగాణ ఇస్తే వీళ్లతో పాలన చేతగాదని.. కరెంట్లేక చీకట్లో మగ్గాల్సి వస్తుందని నాటి ఆంధ్రాపాలకులు వెక్కిరించారు..కానీ సీఎం కేసీఆర్ పక్క రాష్ట్రం నుంచి కరెంట్ తెచ్చి వీళ్ల నోర్లు మూయించారు’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కు కుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గ్రామాల్లో పెత్తందార్ల ముందు గులాబీ కండూవా కప్పుకొని వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఉండేది..ఇప్పుడు ఎక్కడికి వచ్చామో కార్యకర్తలు గుర్తు చేసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ పాలనాదక్షతతో తెలంగాణ ప్రజల కష్టాలను దూరం చేశారని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూర్లో బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మెన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ పోరాట సందర్భంలో బీఆర్ఎస్ నుంచి నలుగురమే ఎంపీలుగా ఉన్నామని, దేశ వ్యాప్తంగా తిరిగి 36పార్టీలకు చెందిన 545మంది ఎంపీలతో రాష్ర్టానికి మద్దతు కూడగట్టామని చెప్పారు. రాష్ట్రం వచ్చిన తర్వాత ఆంధ్రాలో అధికారం చేపట్టిన చంద్రబాబు మన రాష్టం చీకట్లో ఉండాలని విభజన రూల్స్కు విరుద్ధంగా కరెంట్ నిలిపివేశారని అన్నారు. కానీ సీఎం కేసీఆర్ ఛత్తీస్గఢ్ సర్కారుతో ఒప్పందం కుదుర్చుకుని కరెంట్ తెచ్చి భరోసా కల్పించారా న్నారు. సీఎంగా కేసీఆర్ తొలి సంతకం రైతులకు విద్యుత్పైనే చేశారని పేర్కొన్నారు. మరో రెండేళ్లలో తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి ప్రాజెక్టు ద్వారా 25వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయబోతుందని, ఇది వస్తే తెలంగాణ పవర్ కట్ అనేదే ఉండదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వంద అంతస్తుల ఎత్తు అంత ఎత్తుకు జలాలను తరలించి సాగుకు ఊతం పోస్తున్నామన్నారు.
ప్రతిపక్షాల ఆరోపణలు తిప్పికొట్టాలి: రసమయి
ఎమ్మెల్యే రసమయి మాట్లాడుతూ బీఆర్ఎస్కు కార్యకర్తలే బలమని చెప్పారు. పార్టీ అధిష్టానం ఏ పిలుపునిచ్చినా కార్యక్రమాలు గొప్పగా నిర్వహిస్తారన్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పథకాలను గ్రామాల్లో ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలను బలంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.