నాలుగు వరుసల బీటీ రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ సిస్టంతో ధర్మారం మండలం నూతన శోభను సంతరించుకున్నది. మండల కేంద్రంలో పెద్దపల్లి-ధర్మారం ఆర్అండ్బీ రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించేందుకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక చొరవతో డీఎంఎఫ్టీ పథకం ద్వారా రూ.7కోట్లు మంజూరు కాగా, పనులన్నీ పూర్తికావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. గతేడాది అంబేద్కర్ చౌరస్తా నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు రూ.50లక్షలతో నాలుగు వరుసల విస్తరణతో బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి కాగా, డివైడర్ నిర్మించారు.
అనంతరం కోటి రూపాయలతో మహాత్మాగాంధీ విగ్రహం నుంచి ఏఎంసీ ప్రధాన గేట్ వరకు, రూ.2కోట్లతో ఏఎంసీ కార్యాలయం గేట్ నుంచి ఎస్సారెస్సీ డీ-83 కాలువ వరకు బీటీ రోడ్డును విస్తరించారు. రూ.3.50కోట్లతో అంబేద్కర్ చౌరస్తా నుంచి వడ్డెర కాలనీ వరకు రెండు వైపులా డ్రైనేజీ, బీటీ రోడ్డు, డివైడర్, అలాగే అంబేద్కర్ చౌరస్తా నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు డివైడర్ నిర్మించారు. ఇటీవల డివైడర్ల మధ్య విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడంతో మండల కేంద్రం జిల్ జిగేల్మంటూ కళకళలాడుతున్నది.
– ధర్మారం, డిసెంబర్13