నన్ను నియోజకవర్గ ప్రజలు అనేకసార్లు గెలిపించారు. మరోసారి మీ బిడ్డగా మీ ముందుకొచ్చా. ఈసారి కూడా ఆశీర్వదిస్తే నా జీవితం మొత్తం నియోజకవర్గ ప్రజలకే అంకితం చేస్తా. పేద కుటుంబంలో పుట్టిన నాకు రాజకీయ అవకాశం కేసీఆర్ ఇస్తే.. ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను అంచలంచెలుగా ఎత్తుకు ఎదిగేలా చేశారు. పేదింటి బిడ్డగా నాకు అందరి కష్టాలు తెలుసు. అన్ని వర్గాలను సమదృష్టితో చూస్తూ.. సీఎం సహకారంతో వందలాది కోట్లు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నా.
– ధర్మపురి ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్
‘వచ్చే ఎన్నికల్లో ధర్మపురి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ను 75వేల మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గంలోని దళిత కుటుంబాలన్నింటికీ ఒకేసారి దళితబంధు ఇస్తం. హుజూరాబాద్లో ఇచ్చినమాదిరిగా ప్రతి దళిత కుటుంబానికి ఒకేసారి పథకాన్ని వర్తింపజేసి తీరుతం. మీ ఎమ్మెల్యే ఈశ్వర్ చాలా మృదు స్వభావి, సౌమ్యుడు, కార్మిక రంగం నుంచి వచ్చిండు. పట్టుబట్టి నిధులు తెచ్చుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నడు. కొప్పుల ఎమ్మెల్యే కాక ముందు ధర్మపురి ఎలా ఉండేది? నేడు ఎలా ఉన్నదో పోల్చిచూడండి.
ఈశ్వర్ను ఆశీర్వదించి, మరొకసారి అసెంబ్లీకి పంపాలి’ అని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ధర్మపురిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరై, అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. నాటి సమైక్య పాలనలో అనుభవించిన కష్టాలను, నేటి స్వరాష్ట్ర పాలనలో సాధించిన విజయాలను వివరించారు. గత పాలకులకు ధర్మపురిలో గోదావరి పుష్కరాలు నిర్వహించాలన్న సోయే లేదని మండిపడ్డ ఆయన, స్వరాష్ట్రంలో ఘనంగా నిర్వహించుకున్నామని గుర్తు చేశారు. నృసింహ క్షేత్ర అభివృద్ధికి 100 కోట్లు ఇచ్చామని, అవసరమైతే మరిన్ని నిధులిస్తామని చెప్పారు.
– కరీంనగర్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి), జగిత్యాల, (నమస్తే తెలంగాణ)
జగిత్యాల, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): వచ్చే ఎన్నికల్లో ధర్మపురి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ను 75వేల మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గంలోని దళిత కుటుంబాలన్నింటికీ ఒకేసారి దళితబంధు ఇస్తామని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. హుజూరాబాద్లో ఇచ్చినమాదిరిగా ప్రతి దళిత కుటుంబానికి ఒకేసారి పథకాన్ని వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గురువారం సాయంత్రం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద యాత్రలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
రాష్ట్ర ప్రజలందరికీ కొంగుబంగారమైన లక్ష్మీనర్సింహస్వామి కొలువున్న ధర్మపురి క్షేత్రం పరమ పవిత్రమైందని, ఈ క్షేత్రానికి శిరస్సువంచి నమస్కరిస్తున్నానన్నారు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస అనే మకుటంతో ధర్మపురి శేషప్ప కవి రాసిన ఆధ్యాత్మిక గీతాలు అజరామమని అన్నారు. పరమ పవిత్ర గోదావరి ఉత్తర దక్షిణాలుగా సాగే చోట ఉన్న ధర్మపురిలో గతంలో గోదావరి పుష్కరాలు జరుగతాయన్న విషయమే చాలా మందికి తెలువకపోయేదన్నారు. గోదావరి పుష్కరాలు అంటే రాజమండ్రి, కృష్ణ పుష్కరాలు అంటే విజయవాడ అన్నట్లుగా ఉండేదని, తెలంగాణ ప్రజలు పుష్కరాలకు అక్కడికి పోయి గుండు కొట్టించుకొని, జేబులు ఖాళీ చేసుకొని వచ్చేవారన్నారు.
2003లో తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చిన పుష్కరాల సందర్భంగా ఇక్కడికి వచ్చి స్నానం చేసి ఉద్యమిస్తేనే ధర్మపురిలో గోదావరి పుష్కరాలు జరుగుతాయన్న విషయం ప్రపంచానికి తెలిసివచ్చిందన్నారు. తెలంగాణ సాధన అనంతరం 2015లో గోదావరి పుష్కరాలను ధర్మపురి క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుపుకున్న విషయం అందరికీ తెలిసిందేన్నారు. తెలంగాణ సాధన అనంతరం ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.
మృధు స్వభావి, సౌమ్యుడు, కార్మిక రంగం నుంచి వచ్చిన కొప్పుల ఈశ్వర్ ధర్మపురి ఎమ్మెల్యేగా పట్టుబడి ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడ్డారన్నారు. వాగులు బాగు చేయాలని, వంకలు మెరుగు పర్చాలని, టేల్ఎండ్ ప్రాంతాలకు నీళ్లు అందడం లేదంటూ కొప్పుల ఈశ్వర్ వెంటపడి నిధులు సాధించాడన్నారు. కొన్ని సందర్భాల్లో ధర్మపురి అభివృద్ధి కోసం, నిధుల కోసం, ఇక్కడి ప్రజల మంచి కోసం నన్ను వేధించాడని, అయినా ప్రజల మంచి కోసం అడుగుతున్న పనులు కాబట్టి అన్ని మంజూరు చేసినట్లు చెప్పారు. రూ.136 కోట్లతో రోళ్లవాగు ప్రాజెక్టు, రూ.300 కోట్లతో ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథతో చెరువులను బాగు చేసుకోవడంతో పాటు, ఇక్కడ అనేక వాగులపై చెక్డ్యామ్లు కట్టుకున్న విషయం ప్రజలకు తెలిసిందేనన్నారు.
ప్రభుత్వం తీసుకున్న నీటిపారుదల చర్యలతో పాటు, రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, నిరంతర విద్యుత్తో ధర్మపురిలో సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. ఒకప్పుడు 40వేల ఎకరాల సాగు విస్తీర్ణం ఉంటే, ఇప్పుడు 1.30లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు. ధర్మపురి ఆలయ పునర్నిర్మాణం కోసం రూ.100 కోట్లు మంజూరు చేసుకున్నామని, అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. నిధులు సరిపోకపోతే ఇంకా అదనంగా మంజూరు చేసుకుందామన్నారు. కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యేగా గెలువక ముందు ధర్మపురి ఎలా ఉంది..? ఇప్పుడు ఎలా ఉందన్న విషయా న్ని ప్రజలు బేరీజు వేసుకోవాలని సూచించారు. ధర్మపురికి సంబంధించి అన్ని అభివృద్ధి, సంక్షేమ పనులు చేస్తున్నామన్నారు. ధర్మపురి పరిధిలో అనేక రెసిడెన్షియల్ విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకున్న విషయాన్ని గుర్తించాలన్నారు.
రైతుబంధు, రైతుభీమా పథకాలను మనమే సృష్టించామన్నారు. ప్రపంచంలో ఎవరూ ఇలాంటి పథకాలను తీసుకురాలేదన్నారు. ప్రతిపక్ష పార్టీలకు రైతుబంధు తెలువదు.. రాబంధులే తెలుసు అంటూ విమర్శించారు. ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుభీమా, సకాలంలో ఎరువుల పంపిణీ, సాగునీటి ప్రాజెక్టులతో తెలంగాణ సస్యశ్యామలంగా మారిపోయిందన్నారు. 3 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తున్నదని చెప్పారు. దిగుబడి అయిన ధాన్యాన్ని సైతం మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతులను గోసపోసుకున్న వ్యవస్థను తీసివేసి, ధరణి పోర్టల్ను తీసుకువస్తే, తీసివేస్తామని ప్రతిపక్షాలు చెబుతున్నాయని, అలా జరిగితే మళ్లీ మునుపటి లెక్క లంచాల రాజ్యం వస్తుందన్నారు.
తహసీల్ ఆఫీస్లకు వెళ్లి లంచాలు ఇచ్చే వ్యవస్థ మోపవుతుందని మండిపడ్డారు. ధరణి పోర్టల్ రద్దు అయితే రైతుబంధు, రైతుభీమా ఎలా వస్తుందని ప్రశ్నించారు. ధరణిని రద్దు చేసి, రైతుబంధు, రైతుబీమా, కొనుగోలు కేంద్రాలను ఖతం చేయాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయన్నారు. గతంలో ట్రాన్స్ఫార్మర్ల కోసం మనిషికి కొన్ని డబ్బులు వసూలు చేసి, అధికారులకు లంచాలు ఇచ్చే వ్యవస్థ ఉండేదని, ఇప్పుడు అలాంటి వ్యవస్థ ఉందా..? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడం లేదని, ఒకవేళ కాలిపోయినా ఈశ్వర్ లాంటి ఎమ్మెల్యేలు వెంటపడి కొత్త ట్రాన్స్ఫార్మర్లను పెట్టిస్తున్నారన్నారు. భారతదేశంలో అనాదిగా దళితులు ఈసడింపునకు, వెనకబాటుకు గురుయ్యారన్నారు. దళితులు ఆర్థికంగా, సామాజికంగా వెనకబడి ఉండడం సమాజానికే సిగ్గు చేటని, అందుకే దళితులు ఆర్థిక స్వావలంభన సాధించేందుకు దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు.
దళితులను గతంలో ప్రభుత్వాలు పట్టించుకుకోకపోవడం వల్లే ఆ దుస్థితి వచ్చిందన్నారు. బడుగు, బలహీనవర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం, తెలంగాణ ఔన త్యం కోసం ఏర్పడిందే బీఆర్ఎస్ అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆగమాగం కావద్దని, ఆలోచించి, వజ్రాయుధం లాంటి ఓటుతో ప్రతిపక్షాలకు బుద్ది చెప్పాలన్నారు. ధర్మపురిలో సభను చూస్తేనే తనకు ఈశ్వర్ గెలిచాడన్న విషయం అర్థం అయ్యిందన్నా రు. ‘ధర్మపురిలో ఈశ్వర్ గాలి బాగా ఉందన్నారు. ధర్మపురి ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని, రానున్న ఎన్నికల్లో ధర్మపురి నుంచి 75 వేల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలన్నారు.
ఈశ్వర్ను గెలిపించిన తర్వాత, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇచ్చినట్లుగా అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి సంతృప్తికర స్థాయిలో దళితబంధు పథకాన్ని వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చా రు. సాయంత్రం ఐదు గంటలు దాటితే హెలికాఫ్టర్లో ప్రయాణం చేయడం ఇబ్బం ది అవుతుందని, యాగంలో పాల్గొంటున్న నేపథ్యంలో హెలికాప్టర్ ప్రయాణం తప్పనిసరి అయిందన్నారు. యాగం సమయం అవుతుండడంతో తొందరగానే ప్రసంగాన్ని ముగిస్తున్నానని, ప్రజలు క్షమించాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
సభలో ధర్మపు రి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వ ర్, రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్రావు, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని, జగిత్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మాకునూరి సంజయ్కుమార్, జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ మంత్రి రాజేశం గౌడ్, ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ సత్తమ్మ, ఎంపీపీ చిట్టిబాబు, జడ్పీటీసీ సభ్యురాలు అరుణ, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి , బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఓరుగంటి రమణరావు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, వైస్ చైర్మన్ హరిచరణ్రావు, డీసీఎమ్మెస్ చైర్మన్ డాక్టర్ శ్రీకాంత్రెడ్డి, ఎంపీపీలు చిట్టిబాబు, లక్ష్మి, రాజమణి, కరుణ శ్రీ, శంకరయ్య, జడ్పీటీసీలు బాధినేని రాజేందర్, సుధారాణి, రాజేందర్రావు, జలేంధర్, మున్పిపల్ చైర్పర్సన్ సత్తెమ్మ, ఏఎంసీ చైర్మన్లు రాజేశ్కుమార్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.