జగిత్యాల, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): ‘ధర్మపురి ప్రజలు ధర్మం వైపే ఉంటారు. ధర్మం బీఆర్ఎస్ పక్షాననే ఉంది. ప్రచారంలో ఈ విషయం స్పష్టమవుతున్నది. నియోజకవర్గంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా, ప్రజలు నీరాజనం పడుతున్నారు. ఏ ఒక్కరినీ కదిలించినా, స్వరాష్ట్రంలో, సీఎం కేసీఆర్ పాలనలో తమకు కలిగిన ప్రయోజనాలను ఏకరువు పెడుతూ బీఆర్ఎస్ గెలుపు ఆవశ్యకత ఏంటో వారే చెబుతున్నారు. ప్రతిపక్షాలు, వారి అభ్యర్థులు కుట్రలు, కుతంత్రాలు చేసి గులాబీదళంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నా, వాటిని ప్రజలే తిప్పికొడుతూ, గులాబీ జెండాకు జై కొడుతున్నారు. ప్రతిపక్షాలవి దింపుడు కల్లం ఆశలే. ప్రజాక్షేత్రంలో మరోసారి జయం మనదే’ అని ధర్మపురి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ ధీమా వ్యక్తం చేశారు.
వరుసగా ఏడోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కొప్పుల ఈశ్వర్, గత రెండు నెలలుగా ప్రచారంలో తలమునకలై ఉన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ ప్రజా ఆశీర్వాద యాత్రలను దాదాపుగా పూర్తి చేసిన ఈశ్వర్, ప్రతి ఒక్కరినీ కలుస్తున్నారు. ఈ మేరకు గురువారం ధర్మపురిలో ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు. ప్రచారంలో ప్రజలు చూపుతున్న ఆదరణ, సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన దళితబంధు పథకం ప్రాధాన్యం, ధర్మపురికి ప్రాతినిధ్యం వహిస్తూ చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రతిపక్షాల ఆరోపణలు, సీఎం కేసీఆర్ ధర్మపురి ప్రచార సభ విశేషాలు, తదితర అంశాలపై తన అభిప్రాయాలను వివరించారు.
కొప్పుల: రెండు నెలలు కాదు.. దాదాపు నాలుగు నెలలుగా ప్రజల్లోనే ఉంటున్నా. నిజం చెప్పాలంటే, 2009లో ధర్మపురి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ధర్మపురి నియోజకవర్గ ప్రజలతోనే ఉన్నా. ప్రత్యేకంగా ప్రచారం అనేదేమీ లేదు. ధర్మపురి ప్రజలు, నేను వేర్వేరు కాదు. ఇద్దరం ఒకటే. ధర్మపురి ప్రజలంటేనే ఈశ్వర్, ఈశ్వర్ అంటేనే ధర్మపురి ప్రజలు. ఇక ధర్మపురి ప్రజల స్పందన ఎలా ఉందంటే, అపూర్వమనే చెప్పాలి. ఒక తల్లి బిడ్డను ఆదరించినట్లు, ఒక తండ్రి కొడుకును చూసినట్లు, ఒక సోదరి సోదరుడిపై ఆప్యాయత చూపినట్లుగానే ఉంది. నిజం చెప్పాలంటే గతంలో కంటే ఈ సారి ప్రజల ఆదరణ అధికంగా ఉంది. ఎటూ చూసినా ప్రజల దీవెనలే కనిపిస్తున్నాయి. ఏ ఇంటికి వెళ్లినా, ప్రేమాభిమానాలే కనిపిస్తున్నాయి. కలిసిన ప్రతి వ్యక్తి పదేండ్లలో సీఎం కేసీఆర్ పాలనలో తమకు కలిగిన ప్రయోజనాలు, వర్తించిన పథకాలను వివరిస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రాష్ర్టానికి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ మార్గదర్శనం ఎంత అవసరమో..? చెబుతున్నారు. వారి మాటలు వింటే చాలా సంతోషం కలుగుతుంది.
నియోజకవర్గంలో మీరు ఈ సారి గుర్తించిన సమస్యలు ఏంటి ? వాటి పరిష్కారానికి మార్గాలేంటి..?
నియోజకవర్గంలో పదేండ్లుగా పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపడుతూ వచ్చాం. 1700 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. 40 వేల ఎకరాల సాగు భూమిని 1.30లక్షల ఎకరాల సాగు భూమిగా మార్చివేశాం. 35వేల మందికి సీఎం సహాయ నిధిని వర్తింపజేశాం. 453 మందికి ఎల్ఓసీలు ఇచ్చి వైద్యం చేయించాం. రూ.240 కోట్లతో లిఫ్టు ఇరిగేషన్ స్కీమ్లు చేశాం. రూ.136 కోట్లతో రోళ్లవాగును ఆధునీకరించాం. ధర్మపురిలో 50 పడకల మాతా శిశు కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. 50 పడకల సాధారణ దవాఖానను నిర్మించుకున్నాం. మేడారంలో 50 పడకల దవాఖాన కట్టించాం. ధర్మపురి ఆలయానికి రూ.100 కోట్లు మంజూరయ్యాయి. ధర్మపురిని మున్సిపాలిటీగా మార్చడంతో పాటు రూ.41 కోట్లతో అభివృద్ధి చేసుకుంటున్నాం.
తాజాగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రూ.25కోట్లు మంజూరు చేశారు. ధర్మపురిలో రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ, పాఠశాలలు ఏర్పాటు చేసుకున్నాం. ధర్మారం, గొల్లపల్లిలో జూనియర్ కాలేజీల భవనాలు నిర్మించుకున్నాం. ధర్మపురితో పాటు, నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ రోడ్లు, వంతెనల నిర్మాణం పూర్తి చేసుకున్నాం. సంక్షేమ పథకాలకు లెక్కే లేదు. ఈ సారి ప్రచారంలో ప్రధానంగా ధర్మపురి పట్టణాన్ని ముంపు నుంచి నివారించేందుకు ప్రొటెక్షన్ బండ్ (రక్షణ గోడ)ను నిర్మించాలని నిర్ణయించడంతో పాటు, ధర్మపురి పుణ్యక్షేత్రాన్ని రాష్ట్రంలోనే ఆహ్లాదకరమైన, ఆధ్యాత్మిక క్షేత్రంగా మార్చాలని నిర్ణయించుకున్నాం.
దళితబంధు వర్తింపుపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటీ..?
దళితబంధు పథకం వర్తింపుపై ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్న విషయం అక్షర సత్యం. దళితబంధు పథకం అనేది ఒక అద్భుత పథకం. 70 ఏండ్లుగా దేశాన్ని పరిపాలించిన పాలకులు దళితులను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారు తప్ప, వారిని శాశ్వతంగా సంస్కరించి, వారు ఆర్థికస్వావలంభనను సాధించేలా ప్రణాళికలు వేయలేదు.
ఎస్సీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, 20 శాతం సబ్సిడీతో ఆర్థిక సాయాలు అనే పథకాలను పెట్టారు. వాటిని బ్యాంకులకు అనుసంధానం చేశారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకుండా తిప్పితిప్పి చంపాయి. ఈ పథకాలు ఏవీ దళితుల తల రాతలను మార్చలేకపోయాయి. సీఎం కేసీఆర్ దళితుల దౌర్భాగ్యాన్ని తగ్గించి, వారిని ఆర్థికంగా సంస్కరించి, ఒకరి వద్ద చేయి చాచని స్థితికి తీసుకురావాలని దళితబంధు పథకాన్ని రూపొందించారు. రెండేండ్లుగా ఈ పథకం అమల్లోకి వచ్చిం ది. రెండేండ్లలో అనేక మంది దళితులకు ఈ పథకాన్ని ఇచ్చాం. కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడం ఆరంభమైంది. ధర్మపురిలోనూ మొదటి విడతలో లబ్ధిపొందిన వారు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.
దశల వారీగా అమలయ్యే దళితబంధు పథకాన్ని చూసి ప్రతిపక్షాలు ఆందోళనకు గురయ్యాయి. దళితుల్లో మార్పు వస్తే వారికి పుట్టగతులు ఉండవని, కుట్రలు మొదలు పెట్టారు. విడతల వారీగా దళితబంధు పథకాన్ని వర్తింపజేసే అంశాన్ని ఆసరాగా చేసుకొని దళితులను రెచ్చగొట్టి, ప్రభుత్వానికి, దళితవర్గాలకు మధ్య దూరం పెంచే ప్రయత్నం చేశారు. ఇది చాలా బాధాకరం. అయితే దళితులు వారి కుట్రలను నమ్మే స్థితిలో లేరు. దళితబంధు అంటే ఉచితంగా రూ.10 లక్షలు ఇచ్చే పథకం కాదు, అది ఒక కుటుంబం ఆర్థిక స్వావలంభన సాధించేందుకు ఇచ్చే పథకం అన్న విషయాన్ని దళితవర్గాలు గుర్తించాలని కోరుతున్నా.
ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు ఇస్తామని ప్రకటించారు.. దీనిపై మీ స్పందన ?
సీఎం కేసీఆర్ ధర్మపురి ప్రజా ఆశీర్వాద సభకు ఇటీవల వచ్చినప్పుడు చేసిన ఈ ప్రకటన, హామీకి కృతజ్ఞతలు. ఆయనకు ధర్మపురి ప్రజల పక్షాన, నా పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ప్రకటన చాలా కీలకమైంది. ఇది ఒక ధర్మపురి నియోజకవర్గానికే పరిమితం కాదు, రాబోయే రోజుల్లో తెలంగాణలోని ప్రతి నియోజకవర్గానికి వర్తిసుంది. సీఎం కేసీఆర్ దళిత కుటుంబాలన్నింటిని ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థాయికి తేవాలన్న దృక్పథంతో ముందుకు సాగుతున్నారు. ఆర్థికంగా ఒకసారి నిలదొక్కుకున్న కుటుంబం క్రమంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. ప్రగతి సాధించిన కుటుంబం తిరిగి ఆర్థిక సంపదను సృష్టించడం మొదలు పెడుతుంది.
దీని ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంపద వృద్ధి చెందుతుంది. దళిత కుటుంబాలు బలోపేతమవుతాయి. ఇది చాలా గొప్ప పథకం. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, రూ.2కోట్లను దాదాపు 17వేల కుటుంబాలకు వర్తింపజేశారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి వర్తింపజేసినట్లుగా ధర్మపురికి వర్తింపజేస్తామని, నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించడం చాలా సంతోషదాయకమైన విషయం. దళితబంధు పథకానికి సంబంధించి నియోజకవర్గంలో ఇటీవల ఎంపిక చేసిన జాబితాలన్నీ రద్దవుతాయి. అందరికీ దళితబంధు పథకం వర్తింపజేస్తాం. 50 ఏండ్ల క్రితం ఇందిరమ్మ దళిత కుటుంబాలకు ఇండ్ల నిర్మాణం చేసి ఎలాగైతే అమ్మగా మారిపోయారో.. భవిష్యత్తులో దళిత జాతి ఉద్ధారకుడిగా సీఎం కేసీఆర్ మారబోతున్నారన్నది అక్షర సత్యం.
ప్రతిపక్ష పార్టీలు, వాటి అభ్యర్థులు, నాయకులు చేసే విమర్శలు పూర్తిగా అర్థరహితం. అసంబద్ధం. కాంగ్రెస్, ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ ధర్మపురి అభ్యర్థి చేసే ఆరోపణలు సరిగా లేవు. బీజేపీ విమర్శలకు అంతు లేదు. కాంగ్రెస్ 60 ఏండ్లు పరిపాలించింది. ఏమన్నా చేసిందా..? ప్రజలను ఏడిపించి, ఇప్పుడు ఆరు గ్యారెంటీ స్కీంలు అంటూ ముందుకు రావడం చూసి ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పది పదకొండు సార్లు అధికారం చెలాయించినప్పుడు చేయని పనులు ఇప్పుడు చేస్తామంటూ రావడం ప్రజల్లో ఆ పార్టీని చులకన చేసింది. పైగా ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఆరు గ్యారెంటీ స్కీంలు అమలు కావడం లేదు. అక్కడ చేయని వారు ఇక్కడ చేస్తామనడాన్ని ప్రజలు విశ్వసించడం లేదు. ఇక స్థానికంగా ధర్మపురిలో కాంగ్రెస్ అభ్యర్థి చేసే ఆరోపణలకు అర్థం లేదు. గతంలో వరుసగా ఐదు సార్లు ఓడిపోయిన అక్కసుతో ఆయన అర్థం లేని, ఆధారం లేని ఆరోపణలు చేస్తున్నాడన్న విషయం స్థానిక ప్రజలకు అర్థమైంది. ఇక బీజేపీకి తెలంగాణలో ఉనికి లేదు. వారు చేసే విమర్శలకు అర్థం లేదు. ప్రజల సోదిలో లేని పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చే అప్పీల్, పిలుపు, అభ్యర్థన ఏదైనా అనుకోండి. అది ఒక్కటే. స్వరాష్ర్టాన్ని సాధించి, తెచ్చుకున్న రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను రెండు చక్రాలుగా అమర్చుకొని ముందుకు వెళ్తున్న దార్శనిక సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని బలపర్చమని కో రుతున్నా. 14 ఏండ్లుగా నిరంతరం ప్రజలకు అం దుబాటులో ఉండి, మీలో ఒకడిగా కలిసిపోయి, మీ కష్ట సుఖాల్లో పాలుపంచుకొని, నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచిన వ్యక్తిని గుర్తించండి. మరోసారి ఆశీర్వదించి, నియోజకవర్గ అభివృద్ధికి సహకరించండి అన్నదే నా అప్పీల్.