ధర్మారం, అక్టోబర్ 29: ‘అరవై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదు.. పల్లెలు, పట్టణాల్లో అభివృద్ధి లేదు. అవినీతి తప్పా వారు చేసిందేమీలేదు.. కానీ సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో అన్ని వర్గాలకు మేలు జరిగింది..రైతుబంధు లాంటి పథకాలతో అన్నదాతల బతుకుల్లో వెలుగులు నింపింది..ప్రజలరా ఆలోచించండి.. మీ ఓటు ఎటువైపు రైతుబంధుకా..రాబంధులకా’ అంటూ ధర్మపురి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం శాయంపేట, గోపాల్రావుపేటల్లో ప్రజాఆశీర్వాద యాత్ర చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి ఎన్నికల ప్రచారం చేశారు.
గోపాలరావుపేటలో మహిళలు , యువకులు, పార్టీ నాయకులు బతుకమ్మలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇన్నాళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏమి చేయలేదని ప్రస్తుతం మళ్లీ ఓట్లు వేయమని వచ్చి ఆ పార్టీ నాయకుల అబద్ధపు మాటలు నమ్మవద్దని సూచించారు. అధికారంలోకి వస్తే ఏదో చేస్తామని చెబుతున్న కల్లబొల్లి మాటలను ప్రజలు అసలే నమ్మవద్దని విజ్ఞప్తిచేశారు. సీఎం కేసీఆర్ పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలతో మేలు చేశారని చెప్పారు.
రైతుల కోసం రైతు బంధు పథకం, రైతు బీమా పథకాలను అమలు చేసి వారికి సహాయాన్ని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తనదేనని అన్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పేద వర్గాల సంక్షేమం కోసం ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించారని చెప్పారు. ముఖ్యంగా రైతుబంధు పథకం సహాయాన్ని రూ.16,000కు, ఆసరా పింఛన్లను రూ.5,016 పెంపు, ప్రతి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న అర్హత గల మహిళలకు నెల నెల రూ.3,000 గౌరవ భృతి ,రూ. 400 కే గ్యాస్ సిలిండర్ను అందించడం తదితర పథకాలను అమలు చేయాలని ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించారన్నారు. ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి మళ్లీ అధికారంలోకి వచ్చే విధంగా సహకరించాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జిల్లా పరిషత్ సభ్యురాలు పద్మజ, గ్రామాల సర్పంచులు చెనెల్లి సాయికుమార్, జనగామ అంజయ్య, ఎంపీటీసీ జనగామ లక్ష్మి, నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, ఏఎంసి చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ పాకాల రాజయ్య, జిల్లా సభ్యుడు రామారావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్, పార్టీ మండల అధికార ప్రతినిధి గుర్రం మోహన్ రెడ్డి, ఆయా గ్రామాల్లో ఉపసర్పంచ్లు బద్దం శ్యామల తిరుమల్ రెడ్డి, సంకసాని సతీష్ రెడ్డి, ఆయా గ్రామాల పార్టీ అధ్యక్షులు బొలిశెట్టి సుధాకర్, పంజాల శ్రీనివాస్, పార్టీ నాయకులు బద్దం లక్పతి రెడ్డి, గాగి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, భారత స్వామి సంధినేని కొమురయ్య, జాడి రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.