Odela | ఓదెల, జూన్ 14 : తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన పెద్దపల్లి జిల్లాలోని ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. విద్యాసంస్థలకు ఆదివారంతో సెలవులు ముగియనుండడం, వానాకాలం వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్న క్రమంలో ఓదెల మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్రంలోని వివిధ దూర ప్రాంతాల నుంచి భక్తులు రైళ్లు, ప్రత్యేక వాహనాల్లో, ఆర్టీసీ బస్సుల్లో ఆదివారం తెల్లవారుజాము వరకే వచ్చి చేరుకున్నారు.
దీంతో ఆలయ ఆవరణ అంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామి వారిని దర్శించుకోవడానికి క్యూలైన్లో భారీగా భక్తులు నిలబడి ఉన్నారు. ఆదివారం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో సరిపడా వసతి గదులు, చెట్లు లేక ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. మహిళలు, పిల్లలు, వృద్దులు భక్తుల రద్దీతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పట్నాలు, బోనాలతో మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారిని దర్శించుకుని తమ కోరికలు నెరవేరేలా చల్లంగా చూడాలని వేడుకున్నారు. ఆలయ సిబ్బంది పర్యవేక్షిస్తూ భక్తులను స్వామివారి దర్శనానికి క్యూలైన్లో పంపించారు.