చేర్యాల, జనవరి 5: కొమురవెల్లి మల్లన్న ఆలయ అభివృద్ధిలో భక్తులు భాగస్వాములవ్వాలని ఆలయ పాలక మండలి చైర్మన్ గీస భిక్షపతి కోరారు. కరీంనగర్కు చెందిన పడిగెల మహేశ్గుప్తా కిలో 250 గ్రాముల వెండితో తయారు చేయించిన పూజ సామగ్రిని గురువారం ఆలయానికి బహూకరించారు. ఈ సందర్భంగా ఆలయ పాలక మండలి చైర్మన్ మాట్లాడుతూ, స్వామి వారికి భక్తులు మొక్కుల రూపంలో సమర్పించిన వెండితో ఇప్పటికే ఆలయ తలుపులు, దర్వాజలకు వెండి తాపడం చేయించినట్లు తెలిపారు.
త్వరలో భక్తులు సమర్పించిన బంగారంతో మేడలమ్మ, కేతమ్మకు బంగారు కిరీటాలు తయారు చేయించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రత్యేక చొరవతో వెండి తాపడంతో పాటు స్వామి వారికి కిలోన్నర బంగారంతో కిరీటం తయారు చేయించినట్లు చెప్పారు. మల్లన్నకు వెండి పూజా సామగ్రిని అందజేసిన మహేశ్గుప్తా కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ పర్యవేక్షకుడు నీల శేఖర్, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, జూనియర్ అసిస్టెంట్ మధుకర్ పాల్గొన్నారు.